CM Revanth Reddy: ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ, ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి
Bio Asia 2025 Summit - Telangana Life Sciences | విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ట్రిలియర్ డాలర్ల ఆర్థిక తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Bio Asia 2025 Summit | హైదరాబాద్: బయో ఏషియా సమ్మిట్ హైదరాబాద్ (Hyderabad)ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టిందని, హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశిస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దీమా వ్యక్తం చేశారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా దేశ విదేశాలను బయో ఏషియా ఆకర్షిస్తుందన్నారు. బయో ఏషియా-2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో దిగ్గజన ఫార్మా కంపెనీలు, హెల్త్కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయి. ఇక్కడి నుంచి పని చేస్తున్నాయి. కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
ఇప్పటివరకూ ఉన్నత విద్యపై పెట్టుబడులు పెట్టాం. జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నాం. ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజనీర్ల సమూహాన్నీ తయారు చేశాం. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా అవతరించింది. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ, AI సిటీ తో పాటు మరెన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. ఇక్కడ దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో తెస్తున్నాం. హైదరాబాద్ (Hyderabad) కోర్ అర్బన్ సిటీ ఏరియా సేవల రంగానికి ప్రాధాన్యమిస్తాం. కోర్ సిటీ బయట హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad Outer Ring Road) నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (RRR) వరకు మాన్యుఫాక్షరింగ్ హబ్ ను అభివృద్ధి చేస్తాం.
మెగా డ్రైపోర్టు అభివృద్ధిపై ఫోకస్
ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాలలో ఒకటిగా తీర్చిదిద్దుతాం. చైనా ప్లస్ వన్ అవసరాలు తీర్చే కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. ప్రపంచం వ్యాప్తంగా పెట్టుబడులను ఆహ్వానిస్తాం. ఔటర్ రింగ్ రోడ్డు.. రీజనల్ రింగ్ రోడ్డులను రేడియల్ రోడ్లతో అనుసంధానిస్తాం. వీటికి ఇరువైపులా క్లస్టర్లను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రం కనుక ఒక మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేసి.. ఇక్కడి నుంచి ఏపీలోని సీ పోర్ట్ కు అనుసంధానానికి ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా ఏర్పాటు చేస్తాం. బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచానికి చిరునామాగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నాం. అమ్జెన్ సంస్థ నిన్ననే హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను విస్తరించింది.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక్కడ అత్యల్ప ద్రవ్యోల్బణం (Inflation)తో పాటు అత్యధిక ఉద్యోగాల కల్పన ఉంది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా తెలంగాణ ప్రభుత్వం రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. పల రంగాల్లో 50 వేల ఉద్యోగాలు రానున్నాయి. గత ఏడాది లైఫ్ సైన్సెస్ రంగంలో 40,000 కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా విలేజీలు అభివృద్ధి చేస్తున్నాం. ఐదు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి.
గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఒప్పందాలపై సంతకం చేశాయి. జర్మన్ కంపెనీ మిల్టెని బయోటెక్ జీనోమ్ వ్యాలీలో తన సెల్ అండ్ జన్యు చికిత్సను ప్రారంభించింది. గత 25 ఏళ్లలో హైదరాబాద్ ఐటీ, ఫార్మా తయారీ, డిజిటల్ హెల్త్ పవర్ హౌస్గా పేరు నిలుపుకుంది. గత ఏడాది AI హెల్త్కేర్ సమ్మిట్ నిర్వహించాము. హాజరైన వారికి అభినందనలు. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును పొందిన ప్రొఫెసర్ పాట్రిక్ టాన్కు అభినందనలు’ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read: Amberpet Flyover: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, శివరాత్రి నుంచి అంబుబాటులోకి మరో ఫ్లైఓవర్






















