Telangana MLAs Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
BRS MLAs Disqualification: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇంకా నిర్ణయం తీసుకోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమనే నిర్ణయం తీసుకోమ్మంటారా అని స్పీకర్ ను ప్రశ్నించింది.

Telangana MLAs Disqualification | ఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు (నవంబర్ 17న) మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "అనర్హత అంశంపై నిర్ణయం మీరు తీసుకుంటారా? మేము తీసుకోవాలా?" అని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను గట్టిగా ప్రశ్నించింది. ఈ క్రమంలో తెలంగాణ స్పీకర్కు కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ స్పీకర్కు నోటీసులు, నాలుగు వారాలు గడువు
నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులలో పేర్కొంది. అంతేకాకుండా, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ సూచించారు. దీనికి ప్రతిస్పందనగా, స్పీకర్ తరఫు లాయర్లు నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపారు. అనంతరం, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
BRS దాఖలు చేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం జులై 31న తెలంగాణ స్పీకర్ ను ఆదేశించింది. అయితే పలు కారణాలవల్ల నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాలేదని, మరో 2 నెలలు గడువు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ శాసనసభ కార్యదర్శి దాఖలు చేసిన మిసిలేనియస్ అప్లికేషన్ సీజేఐ ధర్మాసనం ముందు 14వ నంబరులో లిస్ట్ చేశారు. కేటీఆర్ దాఖలుచేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ 36వ నంబరులో ఉంది. మరో రిట్ పిటిషన్ 37వ నంబరులో లిస్ట్ అయింది. అయితే పిటిషన్లపై విచారణ చేపట్టి తేల్చేందుకు ధర్మాసనం తెలంగాణ స్పీకర్ కు 4 వారాల గడువు ఇచ్చింది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ జాప్యం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఏడాదిన్నర కావొస్తున్నా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం ప్రాజస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. సుప్రీంకోర్టు సైతం అనర్హత పిటిషన్లపై మూడు నెలలు గడువు ఇచ్చినా స్పీకర్ ఎటూ తేల్చకపోవడంపై సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.






















