మరో రెండు నెలల పాటు BRS ఆత్మీయ సమ్మేళనాలు- మంత్రి కేటీఆర్
సోషల్ మీడియా కమిటీలను బలోపేతం చేసుకోవాలని పిలుపుసంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు మే వరకు చేసుకోవచ్చని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మరింత విస్తృతంగా, కూలంకషంగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధినేత కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు.
ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపై మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో పదిమందితో కూడిన కార్యక్రమాల అమలు కమిటీని ఏర్పాటు చేసుకున్నామన్నారు కేటీఆర్. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తుందని తెలిపారు. వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కమిటీ ద్వారానే అధినేత కేసీఆర్ పార్టీ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ తీరు, వాటికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని.. ఈ విషయాన్ని గుర్తించి ఈ కమిటీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కేటీఆర్ కోరారు. ఈ ఎన్నికల సంవత్సరంలో ప్రతి ఎమ్మెల్యే చురుకైన పార్టీ కార్యకర్తలతో కలిపి ఒక టీంని ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ టీం ద్వారా అటు పార్టీకి ప్రజలకు నిరంతరం సమాచారం అందించేందుకు, పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు ఉపయోగించుకోవాలని కోరారు.
ప్రతి నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకుపోయేందుకు సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు మే నెల వరకు కూడా చేసుకోవచ్చని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరింత విస్తృతంగా, కూలంకషంగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్
పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రతి కార్యకర్తను భాగస్వామిని చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని గైడ్ చేశారు. ప్రతి ఆత్మీయ సమ్మేళనం కచ్చితంగా ముఖ్యమంత్రి పార్టీ కార్యకర్తలకు రాసిన ఆత్మీయ సందేశంతోనే ప్రారంభించుకోవాలని సూచించారు. ఆత్మీయ సందేశం ప్రతి కార్యకర్తకు అందేలా అవసరమైన కరపత్రాల లాంటి మెటీరియల్స్ సిద్ధం చేసి విస్తృతంగా పంపిణీ చేసుకోవాలన్నారు. పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పదవుల్లో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో హాజరయ్యేలా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా పార్టీగా, ప్రభుత్వంగా ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకుపోయేందుకు అవకాశం లభిస్తుందన్నారు కేటీఆర్. తెలంగాణ సాధించిన అభివృద్ధిపైన విస్తృతంగా మాట్లాడే ప్రజాప్రతినిధులను, వక్తలను ప్రత్యేకంగా ఇందుకు ఉపయోగించుకోవాలని కోరారు.
తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి,అందివచ్చిన సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు పార్టీ కార్యకర్తలను సమాచార సైనికులుగా తయారు చేసేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు అద్భుతంగా ఉపయోగపడతాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.





















