KCR News: ఎన్నో తట్టుకుని నిలబడ్డాం, తాజా ఓటమితో బీఆర్ఎస్ దిష్టి పోయింది - కేసీఆర్
Telangana News: బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో లోక్సభ ఎన్నికల్లో ఓటమితో దిష్టి తీసినట్లైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లా నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

BRS Chief KCR: తెలంగాణ కోసం ఉద్యమం సమయంలో ఎన్నో పరిస్థితులను తట్టుకుని నిలబడ్డామని.. నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) అన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్లో బుధవారం తనను కలిసేందుకు మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుండి వచ్చిన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయగాధలు లేవన్నారు. తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్కే కాదన్నారు. ఎలాంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుతూ ముందడుగు వేస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
ప్రమాదంలో తెలంగాణ అస్థిత్వం
తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కుమొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన, అట్నుంచి పదేళ్ల ప్రగతి పాలన దాకా తాను ఎదుర్కొన్న కష్టాలను కేసీఆర్ ఈ సందర్భంగా కార్యకర్తలకు వివరించారు. ప్రస్తుత పరిస్థితి పెద్దదేమీ కాదన్నారు. ఆనాడు తెలంగాణను అష్ట దిగ్భందనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు.. వాళ్లు రాసిందే రాత గీసిందే గీత అన్నట్లు నడిచేదని గుర్తుచేశారు. తెలంగాణ వ్యతిరేకతకు, అత్యంత శక్తివంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకుంటూ, సమైక్యవాదానికి సింబాలిక్గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబును ఎదిరించి నిలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. అలాంటి సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి తెలంగాణను సాధించి.. కలబడి నిలబడిన తెలంగాణ సమాజం, భవిష్యత్తులో ఎలాంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని భరోసా వ్యక్తం చేశారు.
ఆ రోజులు తిరిగి వస్తాయి
గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందన్నారు. శత్రువుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో దిష్టి తీసినట్టయిందని, తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టాలని కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేశామని భావిస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగబడే రోజులు వస్తాయన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని దుయ్యబట్టారు. తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రశాంతమైన పాలన ద్వారా పదేళ్ల పాటు సంక్షేమం అభివృద్ధిని అందిస్తూ అన్ని రకాలుగా అండగా నిలబడ్డ బిఆర్ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటున్నదని కేసీఆర్ తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకుని జనం వెతుకుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కోసం వస్తారని కేసీఆర్ కార్యకర్తలతో అన్నారు. అప్పటి వరకు ఓపికతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
పిలిచినోళ్లు మాత్రమే రండి
బుధవారం నాడు ఎర్రవల్లి నివాసం లో తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులతో.. ‘‘ నన్ను కలుద్దానికి పిలిచినోళ్లు పిలవనోళ్లు రోజూ వేలాదిమంది వస్తున్నారు. మీ అభిమానానికి థ్యాంక్స్. అయితే అంతమందితో ఐదారు గంటలపాటు నిలబడి ఫోటోలు దిగాలంటే కాలు విరిగిన నాకు ఇబ్బంది అవుతుంది. ఒక్క మనిషి వేలమందితో నిలబడి ఫోటోలు దిగితే ఎంత కష్టమో మీరే చెప్పండి. అందుకే సందర్శకులను ముందస్తు సమాచారం మేరకు మాత్రమే ఆహ్వానించాలనుకుంటున్నాం. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు ప్రకటిస్తాం. అప్పుడు మాత్రమే ఆ నియోజకవర్గాలకు చెందిన వాళ్లు రావాలి. అప్పుడు లొల్లి లేకుంట వాళ్లతో కడుపునిండ మాట్లాడుకుని పంపియ్యొచ్చు. మీరు నా మీద ఇంతగా చూపిస్తున్న అభిమానానికి మరోసారి మీకు పేరు పేరునా ధన్యవాదాలు ” అంటూ కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















