Barbarikudu Revanth: నేను బార్బరీకుడి తరహా - ఉద్యోగులే ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు - సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth: సీఎం రేవంత్ తనను తాను మహాభారతంలోని బార్బరీకుడి పాత్రతో పోల్చుకున్నారు. బార్బరీకుడిలా అణగారివర్గాల తరపున ఉంటానన్నారు.

CM Revanth Speech at Madiga employees Meeeting: శిల్పా కళా వేదికలో జరిగిన మాదిగ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం అత్యంత ఆసక్తికరంగా, ఉద్వేగభరితంగా సాగింది. ఈ సందర్భంగా ఆయన తనను తాను మహాభారతంలోని బార్బరీకుడి తో పోల్చుకున్నారు. బలహీనుల పక్షాన నిలబడి పోరాడే గుణం ఉన్న బార్బరీకుడి వలె, తాను కూడా అణగారిన వర్గాల కోసం, ముఖ్యంగా మాదిగ జాతి హక్కుల కోసం రాజకీయ ఒత్తిళ్లను సైతం లెక్కచేయకుండా నిలబడ్డానని ఆయన చెప్పారు. కర్ణుడు మిత్రధర్మాన్ని పాటించినట్లుగా, తాను మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మిత్రధర్మాన్ని నెరవేర్చానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
2023 ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని, తమ వద్ద అక్రమ సంపాదన లేకపోయినా కేవలం చిత్తశుద్ధితోనే గెలిచామని సీఎం గుర్తు చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటాన్ని తాను దగ్గరుండి చూశానని, కృష్ణ మాదిగ వంటి నేతలకు అండగా నిలిచానని చెప్పారు. అసెంబ్లీలో వర్గీకరణ అంశాన్ని లేవనెత్తినప్పుడు గత పాలకులు తనను బయటకు గెంటివేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం మనదే కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులే ఈ పాలనకు కళ్లు, చెవులని అభివర్ణించిన రేవంత్ రెడ్డి, 99 రోజుల ప్రజల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి ఫలాలు అందాలంటే ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతినెలా వెయ్యి కోట్ల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని, ఖజానాకు నిధులు చేర్చే బాధ్యత కూడా ఉద్యోగులపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
అణగారిన వర్గాల అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి బలంగా ఉద్ఘాటించారు. అందుకే తాను స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తూ ప్రక్షాళన చేస్తున్నానని, హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచామని తెలిపారు. గత ప్రభుత్వం కుల వృత్తుల పేరుతో గొర్రెలు, బర్రెలు ఇచ్చి పాత పద్ధతుల్లోనే ఉంచాలని చూసిందని విమర్శిస్తూ.. చెప్పులు కుట్టుకున్న జాతి ఈ రాజ్యాన్ని ఏలాలి.. ఈ జాతి నుండి కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు రావాలి అనే తన ఆకాంక్షను వెలిబుచ్చారు.
తనను రేవంత్ మాదిగ అని, రేవంత్ యాదవ్ అని, రేవంతుద్దీన్ అని ఎవరెలా పిలిచినా తనకు అభ్యంతరం లేదని.. తాను అందరి వాడినని సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రిగా వచ్చిన ఈ అవకాశాన్ని పదిమందికి సహాయం చేయడానికే ఉపయోగిస్తానని, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. తాను సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుండి జరిగే రాజకీయ దాడులను ఆపే బాధ్యతను ప్రజలే తీసుకోవాలని, మాదిగ జాతి తనకు అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















