Ind vs Nz T20I: సంజూ శాంసన్ మ్యాచ్ విన్నర్.. అతడు జట్టులో ఉండాలన్న మాజీ క్రికెటర్, నెక్ట్స్ మ్యాచ్ డిసైడ్ చేస్తుందా?
T20 World Cup | భారత జట్టులో స్థానం ఉంటుందా లేదా అని సంజూ శాంసన్పై చర్చ జరుగుతుండగా.. మాజీ క్రికెటర్ అజింక్య రహానే వికెట్ కీపర్ బ్యాటర్కు మద్దతుగా నిలిచాడు. అతడు జట్టులో ఉండాలని పేర్కొన్నాడు.

న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో మొదటి మూడు మ్యాచ్లు గెలిచి టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంది. అయినప్పటికీ, ఒక పేరు మాత్రం ఇటీవల చర్చల్లో ఉంది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఈ టీ20 సిరీస్లో ఇప్పటివరకు పరుగులు సాధించలేదు. అందుకే అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తిరిగి జట్టులోకి రానుండటంతో, ప్లేయింగ్ ఎలెవన్ నుండి ఎవరు బయటకు వెళ్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయంపై మాజీ ఓపెనర్ అజింక్యా రహానే కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఫామ్లో లేన్నప్పటికీ సంజుపై నమ్మకం
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్లలో విఫలమైన తర్వాత, సాధారణంగా ఏ ఆటగాడిపైనైనా ఒత్తిడి పెరుగుతుంది. కానీ సంజూ శాంసన్ విషయంలో కథ కొంచెం డిఫరెంట్గా ఉంది. జట్టుతో పాటు బయటి నుంచి సైతం అతనికి మద్దతు లభిస్తోంది. మాజీ భారత కెప్టెన్ అజింక్యా రహానే వికెట్ కీపర్ బ్యాటర్ శాంసన్కు మద్దతు తెలిపాడు. అతడు ఫాంతో సంబంధం లేకుండా భారీ ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్ అని కితాబిచ్చాడు. కేవలం కొన్ని మ్యాచులలో ప్రదర్శన ఆధారంగా సంజూను అంచనా వేయకూడదని అన్నారు. టీ20 క్రికెట్లో విఫలం కావడం స్టార్ బ్యాటర్లకు సైతం సర్వసాధారం. ఇది ఆటగాడి సామర్థ్యాన్ని తగ్గించదంటూ సంజూకు రహానే సపోర్ట్ ఇచ్చాడు.
సంజూకు అవకాశం ఇవ్వాలి
అజింక్యా రహానే చెప్పేది ఏంటంటే, సంజు శాంసన్ ఒక మ్యాచ్ విన్నర్ ఆటగాడు. కనుక టీ20 ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో ఇలాంటి ఆటగాళ్లు అవసరం. మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచాలని, ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఏ బ్యాట్స్మెన్కైనా అతిపెద్ద బలం అన్నారు. సంజు తనపై నమ్మకం ఉంచుకుని ఒత్తిడి లేకుండా ఆడితే, పరుగులు సాధిస్తాడని రహానే అభిప్రాయపడ్డారు.
ఇషాన్ కిషన్ కు ఛాన్స్ లభిస్తుందా..
ప్లేయింగ్ లెవన్ విషయానికి వస్తే, రహానే ఎంపిక స్పష్టంగా ఉంది. తిలక్ వర్మ తిరిగి వచ్చిన తర్వాత ఇషాన్ కిషన్ జట్టు నుంచి బయటకు వెళ్లవలసి రావచ్చు. శాంసన్ ఫామ్లోకి రావడానికి మరికొంత సమయం ఇవ్వాలని రహానే అన్నారు. ప్రారంభ ఓవర్లలో జాగ్రత్తగా ఆడిన తర్వాత సంజూ తన సహజ ఆటను ఆడగలడని రహానే అన్నారు. అటువంటి పరిస్థితిలో వికెట్ కీపర్ బ్యాటర్కు వరుస అవకాశాలు లభించడం చాలా ముఖ్యం అన్నారు.
తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే..
భారత్ తరువాత టీ20 మ్యాచ్ జనవరి 28న విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ సంజూ శాంసన్కు చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో శాంసన్ మంచి ఇన్నింగ్స్ ఆడితే, ప్లేయింగ్ ఎలెవన్లో అతని స్థానంపై ఢోకా ఉండదు. అయితే, పరుగులు చేయడంలో మళ్లీ ఫెయిల్ అయితే మాత్రం టీమ్ మేనేజ్మెంట్ కఠిన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఎందుకంటే కొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ సమయంలో కోచ్, బీసీసీఐ ఎటువంటి రిస్క్ తీసుకోదు. ఫాం లేని కారణంగా శుభ్మన్ గిల్ను టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు ఎంపిక చేయలేదన్న విషయాన్ని క్రికెట్ ఫ్యాన్స్ గమనించారు.





















