Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
YSRCP Criticism on PM Modi: నిన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఆచితూచి వ్యవహరించిన వైసీపీ తన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. మోదీ ఏడు సూత్రాల పై ఘాటుగా స్పందించడం చర్చనీయాంశమైంది.

YSRCP Criticism on PM Modi 7 Appeals: పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీతో ఒక రకమైన అప్రకటిత మిత్రత్వం కొనసాగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన రాజకీయ వ్యూహాన్ని సమూలంగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన సెవెన్ అప్పీల్స్ పిలుపుపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇది కేవలం ఒక విధానపరమైన విమర్శ మాత్రమే కాదని, బీజేపీతో తెగతెంపులు చేసుకునే దిశగా పడుతున్న తొలి అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
మోదీ సూత్రాలపై ఎద్దేవా - బాధ్యత ఎవరిది?
తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ అధికార ప్రతినిధి పేర్ని, ప్రధాని మోదీపై నేరుగా విమర్శలు గుప్పించారు. ప్రజలకు నీతులు చెప్పే ముందు మోదీ ఆ సూత్రాలను స్వయంగా ఆచరించి చూపాలి అంటూ ఎద్దేవా చేశారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ప్రజలే కారణమన్నట్లుగా ప్రధాని వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లు ఆపాలని, విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోవాలని చెప్పడం కాదని మోదీ ఆచరించాలన్నారు.
తమిళనాడు ఎఫెక్ట్ - విజయ్ బాటలో జగన్?
తమిళనాడులో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం సాధించిన విజయం, అక్కడ ఆయన అనుసరిస్తున్న రాజకీయ పంథా జగన్ను ఆకర్షించినట్లు కనిపిస్తోంది. విజయ్ నేరుగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్తో జతకట్టి అక్కడ అధికారంలోకి రావడంతో, జగన్ కూడా అదే తరహా ప్రయోగానికి సిద్ధమవుతున్నారని సమాచారం. బీజేపీ , టీడీపీ,జనసేన ఒకే కూటమిలో ఉండటంతో జగన్ ఇక బీజేపీపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న జగన్, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీజేపీ కూటమిని ఢీకొట్టాలంటే కాంగ్రెస్తో కలవడమే ఏకైక మార్గమని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విజయ్ పార్టీని నెత్తికెక్కించుకున్న వైసీపీ సోషల్ మీడియా విభాగాలు కూడా, బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించడం ద్వారా కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు క్షేత్రస్థాయిలో సంకేతాలు పంపుతున్నాయి.
కేంద్రంపై పోరాటమే ఇక ఏకైక అజెండా?
రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి బలంగా ఉండటంతో, జగన్ ఇక తన పోరాటాన్ని నేరుగా కేంద్రంపైకి మళ్లించాలని నిర్ణయించుకున్నారు. గతంలో విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయాల్లో కేంద్రంపై మెతక వైఖరి అవలంబించారనే విమర్శలను చెరిపివేసేందుకు మోదీని నేరుగా టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల పార్లమెంట్ లో ప్రత్యేకహోదా అంశాన్ని వైసీపీ ఎంపీలు ప్రస్తావించారు. ప్రధాని మోదీ విఫలమవుతున్నారని వైసీపీ అధికారికంగా ప్రకటించడం అంటే, భవిష్యత్తులో బీజేపీతో దోస్తీకి శాశ్వతంగా ముగింపు పలికినట్లేనని భావించవచ్చు. విజయ్ స్ఫూర్తితో కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం ద్వారా జగన్ తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. ఒకవేళ జగన్ నిజంగానే కాంగ్రెస్తో జట్టు కడితే, అది ఏపీలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పెద్ద సంచలనంగా మారనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















