Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Kapu Leaders Demand: దివంగత ముద్రగడ ఆశయ సాధన పేరుతో వైసీపీ కాపు నేతల సంచలన కామెంట్స్ చేస్తున్నారు. మరి జగన్ మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ విధానం మారేనా?

AP Kapu Politics : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభం మరణానంతరం ఆయన ఆశయ సాధన కోసం కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని వైసీపీ కాపు నేతలు చేస్తున్న ప్రకటనలు రాష్ట్ర రాజకీయంలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముద్రగడ తన జీవిత చరమాంకంలో వైసీపీలోనే కొనసాగి తుదిశ్వాస విడిచారనే అంశాన్ని తెరపైకి తెస్తూ.. ఆయన కలలను నెరవేరుస్తామని సదరు నేతలు చెప్తున్నారు. ఒకవైపు సొంత పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కాపు రిజర్వేషన్లు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు, అది కేంద్ర పరిధిలోని అంశం అని బహిరంగంగా తేల్చేస్తే.. మరోవైపు అదే పార్టీకి చెందిన కాపు నాయకులు ఈ హామీని నెరవేరుస్తామని అనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ సీఎం అయ్యాక EWSలో కాపు రిజర్వేషన్ల తొలగింపు
2014-19 మధ్యకాలంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఆ తర్వాత కేంద్రం తెచ్చిన 10% EWS కోటాలో 5% కాపులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ EWS 5% కాపు రిజర్వేషన్ జీవోను అమలు చేయకుండా పక్కనబెట్టింది. పాదయాత్ర సమయంలోనే రిజర్వేషన్ల అంశం నా చేతుల్లో లేదు, అబద్ధపు హామీలు ఇచ్చి మిమ్మల్ని మోసం చేయలేను అని జగన్ కుండబద్దలు కొట్టిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అధినేత విధానపరమైన వైఖరి అంత స్పష్టంగా ఉన్నప్పుడు, వైసీపీ కాపు నేతలు ఏ ప్రాతిపదికన ముద్రగడ ఆశయాలను నెరవేరుస్తామని పదేపదే చెబుతున్నారనేది ప్రధాన ప్రశ్న.
వైసీపీ విధానం మారుతుందా?
ముద్రగడ పద్మనాభం తన జీవితాంతం కాపు సామాజిక వర్గానికి బీసీ హోదా దక్కాలనే ఏకైక ఎజెండాతో పోరాటాలు చేశారు. తుని ఘటన మొదలుకొని ఆమరణ నిరాహార దీక్షల వరకు ఆయన నడిపిన ఉద్యమాలు కాపు వర్గాల్లో భావోద్వేగాలను రగిల్చాయి. అయితే, ఆయన చివరి రోజుల్లో రాజకీయ పరిణామాల రీత్యా వైసీపీలో చేరినప్పటికీ, కాపు రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీ అధికారిక స్టాండ్ మారలేదు. ఇప్పుడు ఆయన మరణం తర్వాత కాపు ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి లేదా సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి వైసీపీ నేతలు ముద్రగడ పేరును వాడుకుంటున్నారే తప్ప, కాపు రిజర్వేషన్లపై నిజమైన చిత్తశుద్ధి చూపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిజంగానే వైసీపీ కాపు నేతలకు తమ సామాజిక వర్గ ప్రయోజనాలు, ముద్రగడ ఆశయాల పట్ల గౌరవం ఉంటే.. ముందుగా తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి మనస్సు మార్చగలరా అనేది అసలు సవాలు. కాపులకు బిసి లేదా EWS రిజర్వేషన్లు ఇస్తాం, మా ప్రభుత్వం వస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అమలు చేస్తాం అని జగన్ చేత స్పష్టమైన పార్టీ విధాన ప్రకటన ఇప్పించగలరా అనే ప్రశ్న వస్తోంది. పార్టీ అధినేతేమో రిజర్వేషన్లు మన చేతుల్లో లేవు అని చేతులెత్తేస్తే, కింద ఉన్న నాయకులు మాత్రం మేము సాధిస్తాం అని చెప్పడం కాపు ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం అత్యంత కీలకమైన రాజకీయ శక్తిగా మారింది. ఒకవైపు అధికార కూటమిలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ , కూటమి ప్రభుత్వం కాపు సంక్షేమం, రిజర్వేషన్లపై స్పష్టమైన అడుగులు వేస్తున్న తరుణంలో.. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఆత్మరక్షణ తంత్రంగానే కనిపిస్తున్నాయి. సొంత పార్టీ విధానాన్ని మార్చకుండా, అధినేత చేత ప్రకటన చేయించకుండా వైసీపీ కాపు నేతలు చేసే ప్రకటనలను కాపు మేధావులు విశ్వసించే పరిస్థితి లేదు. ముద్రగడ పద్మనాభం ఆశయ సాధన అనేది కేవలం రాజకీయ నినాదంగా మిగిలిపోకూడదంటే వైసీపీ ముందు ఒకే మార్గం ఉంది. తమ పార్టీ మ్యానిఫెస్టో లేదా అధికారిక విధానంలో కాపు రిజర్వేషన్లకు మద్దతుగా జగన్ మోహన్ రెడ్డి చేత నిర్ణయం తీయించాలి. లేనిపక్షంలో, అధినేత నిర్ణయానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో కాపు నేతలు మాట్లాడే మాటలు రాజకీయంగా మరింత నవ్వులపాలు కావడమే కాకుండా, కాపు సామాజిక వర్గంలో వైసీపీ పట్ల మరింత వ్యతిరేకత పెరగడానికి కారణమవుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















