YS Sharmila Rajya Sabha Seat: చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
YS Jagan Political Strategy: షర్మిలకు రాజ్యసభ సీటు ఇచ్చినట్లయితే ఆమె మరింత ఉత్సాహంతో కాంగ్రెస్ బలోపేతానికి ప్రయత్నించేవారు. కానీ జగన్ ఇండియా కూటమి వైపు వచ్చే అవకాశాలు తెరిచి ఉంచేందుకు ఆపారు.

YS Jagan INDIA Alliance Support: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల చుట్టూ తిరుగుతున్న రాజ్యసభ సీటు వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తాజా రాజ్యసభ అభ్యర్థుల అధికారిక జాబితాలో ఆమె పేరు లేకపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సమయం నుండి, ఆమెను కర్ణాటక లేదా ఇతర రాష్ట్రాల నుండి పెద్దల సభకు పంపుతారనే బలమైన ప్రచారం సాగింది. సాక్షాత్తూ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం నడిచినప్పటికీ, చివరి నిమిషంలో ఆమెకు మొండిచేయి ఎదురుకావడం వెనుక ఢిల్లీ వేదికగా భారీ హైడ్రామా నడిచినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
షర్మిలకు రాజ్యసభ ఇచ్చి ఉంటే ఏపీలో కాంగ్రెస్ బలోపేతం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహం వల్లనే షర్మిలకు రాజ్యసభ దక్కలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. షర్మిలకు రాజ్యసభ సీటు దక్కితే పార్లమెంట్ వేదికగా ఆమె వాయిస్ మరింత బలంగా వినబడుతుంది. అదే సమయంలో రాష్ట్రంలో మరింత దూకుడుగా ఆమె పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హోదా లభిస్తుంది. అది ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి దారితీస్తుంది.ఇది అంతిమంగా జగన్ కు నష్టం జరుగుతుంది. ఎందుంటే వైసీపీ ఓటు బ్యాంక్ అంతా.. కాంగ్రెస్ ఓటు బ్యాంకే. దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు మొదటి నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉండేవారు. జగన్ పార్టీ పెట్టుకున్నాక ఆయన వెంట వెళ్లారు. గత ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల వల్లే వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ ప్రమాదం గమనించిన జగన్ .. కాంగ్రెస్ బలోపేతం దిశగా అడుగులు వేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఇండీ కూటమి సపోర్టులో ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. ఇటీవల SIR సహా ఇతర అంశాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
జగన్ సిగ్నల్స్ కారణంగానే రాహుల్ వెనక్కి తగ్గారా
జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్కు ఇస్తున్న సిగ్నల్స్ కారణంగానే షర్మిలకు రాజ్యసభ సీటు చివరి క్షణంలో మిస్ అయినట్లుగా రాజకీయవర్గాలుచెబుతున్నాయి. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమిని గద్దె దించేందుకు లేదా బిల్లుల విషయంలో అవసరమైనప్పుడు తాము ఇండియా కూటమికి మద్దతు ఇస్తామనే బలమైన సంకేతాలు పంపినట్లు ఢిల్లీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇటీవలి కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై జగన్ చేసిన కొన్ని పరోక్ష వ్యాఖ్యలు, పార్లమెంట్లో గతంలో లాగా కాకుండా కొన్ని బిల్లుల విషయంలో తీసుకున్న తటస్థ వైఖరి.. కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఇచ్చిన శాంపిల్స్ అనే చర్చ నడుస్తోంది.
దక్షిణాదిలో కాంగ్రెస్కు అత్యంత కీలకం
షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్కు వచ్చే తాత్కాలిక మైలేజ్ కంటే, జగన్ మోహన్ రెడ్డి ద్వారా జాతీయ స్థాయిలో లభించే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువని కాంగ్రెస్ అధిష్టానం లెక్కలు వేసుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ కేంద్రంలో అధికారం సాధించాలంటే దక్షిణాది సీట్లే కీలకం. ఉత్తరాదిలో ఆ పార్టీ తేలిపోతోంది. దక్షిణాదిలో ఇప్పటికి ఏపీ మినహా అన్నింటిలోనూ కాంగ్రెస్ లేదా మిత్రపక్షాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ వల్లే కాంగ్రెస్ హైకమాండ్ షర్మిల సీటు విషయంలో వెనక్కి తగ్గిందని, ఫలితంగా ఆమెకు దక్కాల్సిన పదవి చివరి నిమిషంలో చేజారిందని భావిస్తున్నారు.
వైఎస్ కుటుంబంలో మొదలైన ఆస్తి వివాదాలు, ఆరోపణలు ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కూడా కదిలిస్తున్నాయి. తల్లి విజయమ్మతో ఆస్తి వివాదాలు, కోర్టు కేసులతో ఇబ్బందులు పడ్డ జగన్, ఈ రాజ్యసభ సీటును అడ్డుకోవడం ద్వారా చెల్లి షర్మిలకు గట్టి షాక్ ఇచ్చారని అనుకోవచ్చు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏపీ కాంగ్రెస్లో ఎలాంటి అంతర్గత కలహాలకు దారితీస్తాయో, షర్మిల తన తదుపరి వ్యూహాన్ని ఎలా అమలు చేస్తారో వేచి చూడాలి.
Before You Go
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















