Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Bonda Uma : గుంటూరు ముద్రగడ సంస్మరణ సభలో అంబటితో వేదిక పంచుకున్న బొండా ఉమాపై టీడీపీ సీరియస్ అయింది. విచారణకు త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేశారు. వైసీపీ కాపు నేత ట్రాప్లో టీడీపీ నేతలు చిక్కుంటున్నారు.

Chandrababu Naidu Serious On TDP Leaders: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, అధికారిక కూటమిలోనూ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. గుంటూరులో నిర్వహించిన దివంగత ముద్రగడ పద్మనాభం సంతాప సభలో బొండా ఉమా పాల్గొని, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఆప్యాయంగా వేదిక పంచుకోవడం, ఆలింగనం చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ అధిష్టానం దీన్ని తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించింది. దీనికి తోడు కాపు సామాజిక వర్గ డిమాండ్లను సరిగా పట్టించుకోకపోవడం వల్లే 2019లో టీడీపీ ఓడిపోయింది అంటూ బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి.
ఈ పరిణామంపై ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు అత్యంత కఠినంగా స్పందించారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన.. సమాజంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే ఎజెండాగా పనిచేస్తున్న వైసీపీ నేతలతో ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా వేదికలు పంచుకోవడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ విస్తరిస్తున్న రాజకీయ ఉచ్చులో పడొద్దని హెచ్చరించడమే కాకుండా, పార్టీ క్రమశిక్షణా రేఖను దాటి ప్రవర్తించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, శాశ్వతంగా దూరం పెట్టేందుకైనా వెనుకాడబోమని హెచ్చరిస్తూ గట్టి సందేశాన్ని పంపారు. ఈ వ్యవహారాన్ని కేవలం మౌఖిక హెచ్చరికలతో వదిలేయకుండా, బొండా ఉమా నుంచి వివరణ తీసుకోవడానికి టీడీపీ అధిష్టానం ముగ్గురు సభ్యులతో కూడిన త్రీమెన్ కమిటీ ని తక్షణమే ఏర్పాటు చేసింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కీలక నేత కిలారు రాజేష్లతో కూడిన ఈ కమిటీ ముందు హాజరై తన ప్రవర్తనపై, సభలోని వ్యాఖ్యలపై సరైన సమర్థన ఇవ్వాలని ఉమాకు ఆదేశాలు వెళ్లాయి. అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలతో వ్యక్తిగత, కుల సమీకరణల పేరుతో చనువు ప్రదర్శించడం శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు పంపుతుందనేది అధిష్టానం ఆలోచనగా ఉంది.
పార్టీ నేతలు హెచ్చరికగా తీసుకుంటారా?
ఈ చర్యలు పార్టీలో కిందిస్థాయి నేతలకు హెచ్చరికగా నిలుస్తాయా లేక కొత్త వ్యూహాత్మక సంక్షోభాన్ని తెచ్చిపెడతాయా అనేది ఆసక్తికరంగా మారింది. తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన బొండా ఉమా.. తాను హాజరైంది వైసీపీ సభకు కాదని, కాపు సామాజిక వర్గ నేత సంతాప సభ మాత్రమేనని సమర్థించుకుంటున్నారు. ఇదే ముద్రగడ సంస్మరణ సభల్లో వైసీపీ నేతలతో వేదిక పంచుకున్న వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి వారిని కూడా వివరణ అడుగుతారా అని ఆయన ప్రశ్నించడం పార్టీ అంతర్గత వర్గాల్లో పెద్ద చర్చకు తెరతీసింది. అధిష్టానం ప్రస్తుతం తీవ్రమైన ధర్మసందేహంలో పడింది. బొండా ఉమాపై కఠినంగా క్రమశిక్షణా చర్యలు లేదా సస్పెన్షన్ వేటు వేస్తే, దాన్ని ప్రతిపక్షాలు కాపు నేతలపై కక్షసాధింపు గా మలిచి రాజకీయ లబ్ధి పొందే ప్రమాదం ఉంది. అలాకాకుండా కేవలం వివరణతో సరిపెట్టి వదిలేస్తే, అధినేత చంద్రబాబు ఇచ్చిన కఠిన హెచ్చరికలకు విలువ లేకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
క్రమశిక్షణపై దృష్టి
పలువురు నేతలు వ్యక్తిగత అనుబంధాలు, సామాజిక వర్గాల పేరుతో ప్రత్యర్థి పార్టీ నేతలతో చనువుగా ఉండటం టీడీపీ కేడర్ను గందరగోళానికి గురిచేసింది. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళ, ప్రతిపక్ష వైసీపీకి ఎలాంటి రాజకీయ మైలేజ్ దక్కకుండా చూడటమే లక్ష్యంగా చంద్రబాబు ఈ కొత్త రూల్ను కఠినంగా అమలు చేయాలని నిశ్చయించుకున్నారు. త్రీమెన్ కమిటీ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయం.. ఇతర టీడీపీ నాయకుల నడతను, పార్టీలో క్రమశిక్షణా ప్రమాణాలను శాసించే కీలక మలుపుగా మారనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















