Chandrababu Naidu Cases: పేకమేడల్లా కూలుతున్న బాబుపై కేసులు - వైసీపీ లీగల్ డిఫెన్స్ ఎందుకు ఫెయిలైంది? భవిష్యత్తులో తిరగదోడటం సాధ్యమేనా?
Dismissed Cases: వైసీపీ హాయాంలో చంద్రబాబుపై జగన్ పెట్టిన 16 కేసులు కోర్టుల్లో ఎందుకు కొట్టుకుపోతున్నాయి? వైసీపీ నేతలు ఆధారాలు ఎందుకు చూపించలేకపోయారు? భవిష్యత్తులో ఈ కేసులను తిరగదోడటం సాధ్యమేనా?

Why YSRCP Failed to Show Evidence Against Babu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాం చంద్రబాబు నాయుడే లక్ష్యంగా సాగిన కేసుల పర్వానికి సాక్ష్యంగా నిలిచింది. నాటి జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై ఏకంగా 16 కేసులు నమోదు చేసింది. ఇందులో స్కిల్ డెవలప్మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, ఉచిత ఇసుక విధానం, మద్యం పాలసీ వంటి విధానపరమైన నిర్ణయాలతో పాటు, అంగళ్లు హింసాత్మక ఘటన వంటి క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి పటిష్ట ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉంచడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ప్రస్తుతం కోర్టుల విచారణలో ఈ కేసులన్నీ ఒక్కొక్కటిగా వీగిపోతుండటం, ప్రాథమిక ఆధారాలను కూడా దర్యాప్తు సంస్థలు చూపించలేకపోతుండటంతో.. ఇదంతా కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని చట్టపరంగా స్పష్టమవుతోంది.
అసైన్డ్ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో నమోదైన కేసు ఇందుకు ఒక క్లాసిక్ ఉదాహరణ. తమ భూములను చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారంటూ ఏ ఒక్క దళిత రైతు కూడా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయలేదు. కేవలం అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఇచ్చిన పొలిటికల్ ఫిర్యాదు ఆధారంగానే సీఐడీ కేసు నమోదు చేసింది. చివరకు ఈ కేసులోనూ క్షేత్రస్థాయిలో ఎలాంటి అవినీతి లేదా అక్రమం జరగలేదని కోర్టుల ముందు తేలిపోయింది. చట్టం , న్యాయస్థానాల నిబంధనల ప్రకారం.. విచారణ సంస్థలు మోపిన ఆరోపణల్లో కనీస సరుకు లేకపోవడంతో, హైకోర్టు, సుప్రీంకోర్టులలో జగన్ సర్కార్ నిర్మించిన కేసుల పేకమేడలన్నీ కుప్పకూలుతున్నాయి.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు ఆధారాలు సమర్పించలేదు?
అయితే, ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏమిటంటే.. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన కేసులను వైసీపీ నేతలు, వారి లీగల్ టీమ్ కోర్టుల్లో ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు? దీనికి ప్రధాన కారణం ఆధారాల లేమి . రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలనే ఆత్రుతలో, విధానపరమైన క్యాబినెట్ నిర్ణయాలను సైతం అవినీతి స్కాములుగా చిత్రీకరించే ప్రయత్నం నాటి పాలకులు చేశారు. ఉదాహరణకు, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదంతో తెచ్చిన విధానం. ఇందులో నిధుల దారిమళ్లింపు జరిగిందని ఆరోపించారే తప్ప, ఆ డబ్బు చంద్రబాబు ఖాతాల్లోకి గానీ, ఆయన కుటుంబ సంస్థల్లోకి గానీ వెళ్లినట్లు ఒక్క రూపాయికి సంబంధించిన మనీ ట్రైల్ ను కూడా సీఐడీ నిరూపించలేకపోయింది. కేవలం ఊహాజనిత కథనాలతో కోర్టుల్లో గెలవడం సాధ్యం కాదనే కనీస చట్టపరమైన సత్యాన్ని వైసీపీ విస్మరించిందన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో ఉంది.ఐదేళ్ల పాటు సీఐడీని, ఏసీబీని కేవలం చంద్రబాబును, టీడీపీ నేతలను భయపెట్టడానికి ఒక పొలిటికల్ అస్త్రంగా వాడుకున్నారు తప్ప, చట్టబద్ధమైన పక్కా సాక్ష్యాల సేకరణ పై దృష్టి పెట్టలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులను, కేస్ డైరీలను కోర్టులు పరిశీలించినప్పుడు అవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం హడావుడిగా అల్లిన కథలుగా తేలిపోయాయి. దీంతో న్యాయస్థానాల ముందు వైసీపీ లీగల్ వాదనలు వీగిపోక తప్పలేదు.
వైసీపీ వస్తే కేసులు రీఓపెన్ చేయగలరా?
ఇక రాజకీయ వర్గాల్లో నడుస్తున్న మరో ఆసక్తికరమైన చర్చ.. భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే, ఇప్పుడు కోర్టులు కొట్టేసిన ఈ కేసులను మళ్లీ తిరగదోడగలదా అని. చట్టపరంగా చూస్తే ఇది అంత సులువు కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ఒకే నేరంపై ఒక వ్యక్తిని పదే పదే విచారించడం లేదా శిక్షించడం సాధ్యం కాదు . కోర్టులు ఒకసారి మెరిట్స్ ఆధారంగా కేసును పూర్తిగా కొట్టేస్తే , భవిష్యత్తులో కొత్తగా ఎటువంటి తిరుగులేని అదనపు సాక్ష్యాధారాలు దొరికితే తప్ప అదే కేసును మళ్లీ రీ-ఓపెన్ చేయడం సాధ్యపడదు. ఒకవేళ కేవలం టెక్నికల్ కారణాలతో కేసులు నిలిచిపోతే తప్ప, కక్షసాధింపు కోణంలో మళ్లీ తిరగదోడాలని చూస్తే కోర్టులు తీవ్రంగా పరిగణిస్తాయి. చట్టం ముందు భావోద్వేగాలకు, రాజకీయ మైలేజ్ వ్యూహాలకు తావుండదు, కేవలం సాక్ష్యాలు మాత్రమే మాట్లాడతాయి. ఆ సాక్ష్యాలను చూపించడంలో వైసీపీ ఘోరంగా విఫలమవడంతో, చంద్రబాబుపై ఉన్న ఇమేజ్ చట్టపరంగా మరింత బలపడిందన్న అభిప్రాయం ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















