TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
Rajya Sabha Elections : తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఆశావహులపై కసరత్తు జరుగుతోంది. పలువురు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువగా చింతకాయల విజయ్ పేరు ప్రచారంమలోకి వస్తోంది.

Who are the lucky TDP Rajya Sabha members: తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సీట్ల కేటాయింపు అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జూన్లో ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలకు గాను, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మిగిలిన స్థానాలకు రకరకాల పేర్లు చర్చల్లోకి వస్తున్నాయి.
చింతకాయల విజయ్ - యువ నాయకత్వానికి పెద్దపీట?
టీడీపీ ఐటీ విభాగంలో చురుగ్గా ఉంటూ, గత ఎన్నికల్లో పార్టీ సోషల్ మీడియా వ్యూహకర్తగా పనిచేసిన చింతకాయల విజయ్ పేరు రేసులో ముందుండటానికి ప్రధాన కారణం యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న అధిష్టానం ఆలోచనే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి బలమైన బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విజయ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడినందుకు ఆయనకు ఈ గుర్తింపు దక్కవచ్చని క్యాడర్ భావిస్తోంది.
సీనియర్ల రేసు - యనమల చిరకాల వాంఛ
మరోవైపు, పార్టీలో అత్యంత సీనియర్ నేత అయిన యనమల రామకృష్ణుడు పేరు కూడా చర్చల్లో ఉంది. గత కొంతకాలంగా ఆయన రాజ్యసభకు వెళ్లాలని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీకి ట్రబుల్ షూటర్గా, ఆర్థిక వ్యవహారాల్లో పట్టున్న నేతగా యనమల సేవలను ఢిల్లీ స్థాయిలో ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తే ఆయనకు అవకాశం దక్కవచ్చు. అయితే, సామాజిక సమీకరణాలు , కొత్త రక్తాన్ని ఎక్కించాలనే లోకేష్ వ్యూహం కారణంగా సీనియర్లకు ఏ మేరకు ప్రాధాన్యత ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది.
గల్లా జయదేవ్, దేవినేని ఉమతో పాటు పలువురు యువనేతలు
వ్యాపార కారణాలు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల గత లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న గల్లా జయదేవ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై గళం విప్పడంలో ఆయనకు ఉన్న అనుభవం, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకున్న నెట్వర్క్ పార్టీకి అవసరమని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నట్లు గతంలోనే ప్రకటించినందున, మళ్లీ రాజ్యసభ ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఇక గత ఎన్నికల్లో చాన్స్ దొరకని దేవినేని ఉమ కూడా రేసులో ఉన్నారు. యువనేతలు వంగవీటి రాధాతో పాటు మహాసేన రాజేష్ వంటి వారు కూడా సామాజికవర్గ కోటాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.
హైకమాండ్ వ్యూహం: సామాజికం + విధేయత
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ప్రధానంగా మూడు సూత్రాలను పాటిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. బీసీ, ఎస్సీ , కాపు సామాజిక వర్గాలకు సమతుల్యత పాటించడం.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడగలిగే వ్యక్తులను పంపే అంశాలను పరిశీలిస్తున్నారు. వీరితో పాటు పార్టీ కోసం పనిచేసిన మరికొందరు పారిశ్రామికవేత్తలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కూడా టీడీపీ పరిశీలిస్తోంది. ఢిల్లీలో పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారికే చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
మిత్రపక్షాలకూ సీట్లు
మిత్రపక్షాలకూ సీట్లు కేటాయించాల్సి ఉంది. జాతీయ స్థాయి ప్రాధాన్యత దృష్ట్యా బీజేపీ ఓ సీటును కోరుకుంటుందని అంచనా వేస్తున్నారు. బీజేపీకి ఇస్తే జనసేన పార్టీకి చాన్స్ ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు ఫైనల్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















