KCR Delhi : ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తెలంగాణ సీఎస్, డీజీపీ ? హస్తినలో కేసీఆర్ పెద్ద ప్లానే అమలు చేస్తున్నారా?
తెలంగాణ సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన మూడు రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు.
KCR Delhi : తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వారం రోజులు అవుతోంది. గత బధవారం ఆయన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యూపీ వెళ్లి అటు నుంచి అటు ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ వెంట .. ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్తో పాటు కొంత మంది నేతలు ఉన్నారు. వారం రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారేమో స్పష్టత లేదు కానీ.. బహిరంగంగా మాత్రం ఎవరితోనూ చర్చలు జరపడం లేదు. అయితే హఠాత్తుగా ఆయన సీఎస్ సోమేష్తో పాటు డీజీపీని కూడా హుటాహుటిన ఢిల్లీకి రావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు కానీ.. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోందా అన్న చర్చ మాత్రం ప్రారంభమయింది.
కేసీఆర్కు మూడు రోజులుగా జ్వరం అని చెబుతున్న టీఆర్ఎస్ వర్గాలు !
ఓ వైపు మునుగోడు ఎన్నికలు జరుగుతూండటం..మరో వైపు పాలనను పట్టించుకునేవారు లేకపోయినా సరే కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయడంతో రాజకీయ పరమైన విమర్శలకు కారణం అవుతోంది. అయితే ఇప్పటి వరకూ ఏమీ చెప్పని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పుడు కేసీఆర్కు స్వల్ప అనారోగ్యం కలిగిందని.. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని అందుకే విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఎలాంటి సమావేశాలు మూడు రోజులు నిర్వహించలేదని అంటున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల కారణంగానే విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు.
సీఎస్, డీజీపీలకు ఢిల్లీకి పిలుపెందుకు !?
కేసీఆర్ హైదరాబాద్ రాలేకపోతున్నందన... సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించి కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పిలిపించి మరీ చెప్పాల్సిన అవసరం ఏముందని.. ఆదేశాలను మరో రూపంలో జారీ చేయవచ్చని చెబుతున్నారు. సీఎస్, డీజీపీ ఖచ్చితంగా ఢిల్లీకి రావాల్సిన పరిణామం ఏదో జరిగిందని ఇతరులు విశ్లేషిస్తున్నారు. అదేమిటన్నదానిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అంచనా వేయడం కష్టం. అందుకే కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నరాన్న ఉత్కంఠ తెలంగాణ విపక్షాలకూ ఉంది. అదీ కూడా సెమీ ఫైనల్ లాంటి మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీలో మకాం వేయడం.. అక్కడికే ఉన్నతాధికారుల్ని పిలిపించుకోవడం వెనుక మతలబు ఉందని నమ్మకానికి వస్తున్నారు.
జాతీయ రాజకీయాలపై మళ్లీ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ?
ఎవరైనా పార్టీ ప్రకటించిన తర్వాత ఎలాంటి గ్యాప్ రాకుండా .. పార్టీని ప్రజల్లో నానే చేయాలని అనుకుంటారు. అలా చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది. ఆ విషయం కేసీఆర్కు తెలియనిదేం కాదు. కానీ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని తీర్మానం చేసిన తర్వాత ఆయన సెలెంట్ అయిపోయారు. కనీసం జాతీయ మీడియాకు కూడా ఇంటర్యూలు ఇవ్వలేదు. తన పార్టీ విధివిధానాలను కూడా సవయంగా ప్రకటించలేదు. దీంతో కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్పై చర్చ క్రమంగా తగ్గిపోతోంది. కనీసం జాతీయ పార్టీల నేతలతో అయినా సమావేశం అయితే కాస్త ప్రచారం వస్తుంది. కేసీఆర్ అది కూడా చేయడం లేదు.
సైలెంట్గా ఉన్నా.. రాజకీయంగా నిర్ణయాలు తీసుకున్నా... కేసీఆర్ ప్లానింగ్ పక్కాగా ఉంటుంది. ఇప్పుడు ఆ దిశగానే ఆయన ప్రణాళికల్లో ఉన్నారని అనుకోవచ్చు. ఇలాంటి వారాల తరబడి ఆయన ఫామ్హౌస్కే పరిమితమైన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఢిల్లీలో ఏ ఎజెండా లేకుండా వారం రోజులు ఉండటం మాత్రం ఏదో అలా జరిగిపోయిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. కేసీఆర్ ఢిల్లీని గురి పెట్టారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన సీక్రెట్స్ ఏమిటో.. ముందు ముందు ఆయన తీసుకునే నిర్ణయాల ద్వారా అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets