Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy Delhi: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల ఢిల్లీ పర్యటన ముగిసినా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. అంతర్గత అసంతృప్తులు తలెత్తకుండా హైకమాండ్ ఊరుకున్నంత ఉత్తమం అనే వ్యూహం పాటిస్తోంది.

Telangana Congress Leaders Delhi High Command Meeting: హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు సాగించిన మూడు రోజుల సుదీర్ఘ చర్చలు, ఏఐసీసీ సమన్వయ కమిటీ భేటీల తర్వాత తేలిందేమిటంటే.. ఎంతోమంది సీనియర్లు, ఎమ్మెల్యేలు ఆశగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజీ లోకి వెళ్లిపోయింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా సీనియర్లంతా ఢిల్లీ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీలతో పలు విడతలుగా సమావేశమైనప్పటికీ, కేబినెట్ విస్తరణ లేదా మార్పుచేర్పులకు మాత్రం అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో చాన్నాళ్లుగా మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్న ఆశావహులకు నిరాశే మిగిలింది.
ఈ నిర్ణయం వెనుక అధిష్ఠానం ఊరుకున్నంత ఉత్తమం.. బోడిగుండంత సుఖం అనే రక్షణాత్మక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న బెర్తుల భర్తీ లేదా రీషఫుల్ చేపడితే.. పార్టీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేగుతాయనే భయం అధిష్ఠానంలో ఉంది. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్లోనూ, పార్టీ అంతర్గత రాజకీయంలోనూ చోటుచేసుకున్న పరిణామాలు, అసంతృప్తుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణలో ఉన్న శాంతిభద్రతలను, ప్రభుత్వ స్థిరత్వాన్ని దెబ్బతీసే సాహసం ఇప్పుడు చేయకూడదని హైకమాండ్ ఒక స్పష్టమైన ముగింపునకు వచ్చినట్లు తెలుస్తోంది.
జెన్ జీ కోటాలో మరింత మంది ముందుకు!
మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల పోటీ ఊహించని మలుపులు తిరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వంటి సీనియర్లు ఒకవైపు గట్టిగా ఒత్తిడి తెస్తుండగా.. జెన్-జీ నినాదంతో యువ ఎమ్మెల్యేలకు సైతం ప్రాతినిధ్యం కల్పించాలనే చర్చ సరికొత్త సమీకరణాలను తెచ్చిపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం యువ ముఖాలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనను తెరపైకి తెచ్చినట్లు వార్తలు రావడం, స్థానిక సంస్థల సమయానికి ఓటు బ్యాంకును ఆకట్టుకోవాలనే వ్యూహాలు రేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి. సీనియర్ వర్సెస్ జూనియర్, రెడ్డి వర్సెస్ బీసీ, ఎస్సీ సామాజిక సమీకరణాల మధ్య సమతుల్యత సాధించడం దాదాపు అసాధ్యంగా మారడంతోనే విస్తరణ నిర్ణయాన్ని వాయిదా వేశారు.
పాలనపై దృష్టి సారించాలని ఆదేశాలు
ఢిల్లీ వేదికగా ఎఐసీసీ పెద్దలు తెలంగాణ నేతలకు చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పాలిటిక్స్ పక్కనపెట్టి, పాలనపై దృష్టి సారించాలని, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి వేగంగా తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి 45 రోజులకు ఒకసారి పీసీసీ సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి.. ప్రభుత్వం, పార్టీ యంత్రాంగం మధ్య సయోధ్యను పెంచాలని ఆదేశించారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటర్ల నమోదు ప్రక్రియపై దృష్టి పెట్టాలని, మంత్రి పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగడం కన్నా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆశావహులకు నర్మగర్భ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. హైకమాండ్ వ్యూహాన్ని గమనిస్తే.. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన వేళ, ఈ రకమైన అంతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాలు బయటపడితే అది కాంగ్రెస్ ఇమేజ్ను ప్రజల్లో దెబ్బతీస్తుందనే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కేబినెట్ను కదిలించి తేనెతుట్టెను రేపడం కంటే ఉన్న వనరులతోనే పాలనను పరుగులు పెట్టించడం శ్రేయస్కరమని భావిస్తున్నారు.
ఢిల్లీ పర్యటనతో ఏదో ఒక శుభవార్త వింటామని భావించిన ఆశావహులకు అధిష్ఠానం రివర్స్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. పదుల సంఖ్యలో ఉన్న మంత్రి పదవుల పోటీదారులకు చెక్ పెడుతూ, సర్కార్ గ్రాఫ్ను పెంచుకునే పనుల్లో నిమగ్నం కావాలని ఆదేశించడంతో.. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రస్తుతానికి మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















