CM Revanth Reddy: బాగా పనిచేస్తున్నందుకే తప్పుకోవాలా? - విద్యాశాఖ మంత్రిపై విమర్శలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
Telangana Education Reforms: విద్యాశాఖ మంత్రి లేరనే విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. టీచర్ల బదిలీలు, అడ్మిషన్ల పెరుగుదలను వివరిస్తూ, ఉపాధ్యాయ సంఘాలకు కీలక సూచనలు చేశారు.

Revanth Reddy Teachers Unions Speech: తెలంగాణ విద్యాశాఖలో తెస్తున్న సంస్కరణలు, పాలనాపరమైన నిర్ణయాలపై విపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యంత ఘాటుగా, స్పష్టమైన సమాధానం ఇచ్చారు. విదేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఎంసీఆర్హెచ్ఆర్డీ లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సీఎం, రాష్ట్రంలో పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేరంటూ వ్యాఖ్యానిస్తున్న వారి వ్యాఖ్యలను పూర్తిగా తిరస్కరించారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని, ఈ శాఖ అత్యంత వేగంగా పురోగతి సాధిస్తున్నందుకే తనను మంత్రి బాధ్యతల నుంచి వైదొలగాలని అడుగుతున్నారా అని సూటిగా ప్రశ్నించారు.
విద్యాశాఖలో మంచి పురోగతి
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే విద్యాశాఖలో సాధించిన విజయాలను సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా వివరించారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 55 రోజుల్లోనే 11 వేల ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశామని, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 30 వేల మంది టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను ఎలాంటి వివాదాలు లేకుండా పారదర్శకంగా పూర్తి చేశామని గుర్తుచేశారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చడంతో పాటు ఉచిత అల్పాహారం, కేజీ నుంచి ప్లాస్ టూ వరకు నాణ్యమైన విద్యనందించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలోనే ప్రభుత్వ బడుల్లో లక్షకు పైగా కొత్త అడ్మిషన్లు పెరిగాయని, దేశంలో తెలంగాణ విద్యాశాఖ స్థానం 28 నుంచి 18కి మెరుగుపడిందని గణాంకాలతో సహా వెల్లడించారు.
ఉపాధ్యాయ సంఘాలు పిల్లల సమస్యలపై పోరాడాలి!
ఉపాధ్యాయ సంఘాల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు పిల్లల సమస్యలపై, వారి భవిష్యత్తు కోసం పోరాడండి.. మీ సొంత సమస్యలపై కాదు అని రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు హితవు పలికారు. సంఘాల అధ్యక్షులతో తాను స్పష్టంగా చెప్తున్నానని, ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ తన బాధ్యతగా వదిలేయాలని, వారు అడగకముందే పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెలా ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తూ సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించిందని, టీచర్లు తమ దృష్టినంతా విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపైనే కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు.
భాష అసలు సమస్య కాదు!
గ్లోబల్ ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల ఉపాధి అర్హతలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా రాష్ట్రం నుంచి లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ పట్టాలు పొందుతున్నప్పటికీ, కనీస ఉద్యోగ దరఖాస్తు నింపడం కూడా రాకపోవడం విచారకరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలతో పాటు గ్లోబల్ భాషా ప్రావీణ్యం పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత 25 ఏళ్లుగా మనం కేవలం అమెరికాపైనే ఆధారపడ్డామని, అయితే ఇప్పుడు జర్మనీ, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాల్లో కోట్లాది అవకాశాలు వేచి ఉన్నాయని వెల్లడించారు. భాష అనేది కేవలం ఒక సంభాషణా సాధనమే తప్ప అదే జ్ఞానం కాదని, చైనా, జర్మనీలు కేవలం 10 శాతం ఇంగ్లీష్తోనే ప్రపంచాన్ని శాసిస్తున్నాయని ఉదాహరించారు.
త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమీక్ష
రాబోయే ఐదేళ్లలో గ్లోబల్ ప్లాట్ఫామ్పై తెలంగాణ విద్యావ్యవస్థను ఆదర్శంగా నిలిపేలా ఆరు నెలలకోసారి ఉపాధ్యాయ సంఘాలతో సమీక్ష నిర్వహిస్తానని సీఎం ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తును దిద్ది తీర్చే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. రాజకీయం కోసం విమర్శలు చేసేవారికి తమ సంస్కరణలే సమాధానం చెప్తాయని, తెలంగాణ రూపురేఖలను మార్చేలా విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















