![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Suman Prediction: ఆయన మరోసారి ఏపీ సీఎం అవుతారు, ఎన్నికల ఫలితాలపై నటుడు సుమన్ జోస్యం
Andhra Pradesh: ఏపీలో టీడీపీ- జనసేన గెలుపు ఖాయమైపోయిందని, సీట్ల సర్దుబాటు సరిగా జరిగితే వారికి తిరుగేలేదని ప్రముఖ నటుడు సుమన్ జోస్యం చెప్పారు. వైసీపీ నుంచి తనను పోటీ చేయమన్నా తిరస్కరించానన్నసుమన్
![Suman Prediction: ఆయన మరోసారి ఏపీ సీఎం అవుతారు, ఎన్నికల ఫలితాలపై నటుడు సుమన్ జోస్యం TDP Janasena alliance will win AP Elections 2024 Actor Suman Prediction Suman Prediction: ఆయన మరోసారి ఏపీ సీఎం అవుతారు, ఎన్నికల ఫలితాలపై నటుడు సుమన్ జోస్యం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/18/c26fa0993d5f46aa42c8e42362a952761708266903954233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TDP Janasena alliance: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన గెలుపు ఖాయమని ప్రముఖ నటుడు సుమన్ జోస్యం చెప్పారు. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే ఈ కూటమికి తిరుగులేదన్నారు. చంద్రబాబు పరిపాలన బాగా తెలిసిన వ్యక్తని..ఏపీ ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించారు. సుమన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అయోమయంలో పడిపోయారు. ఇటీవల పలుమార్లు జగన్ పాలన, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకున్న సుమన్... ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును పొగడటం చూసి ఖంగుతిన్నారు. పైగా ఆయన్ను రాజమండ్రి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగాలని సంప్రదించగా... ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది.
కూటమి గెలుపు ఖాయం
తెలుగుదేశం- జనసేన కూటమికి తిరుగులేదని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీల అభ్యర్థులు విజయం ఖాయమని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు తనకు గురవని... ఆయన పరిపాలన బాగా తెలిసిన వ్యక్తని సుమన్ కొనియాడారు. తిరుపతి తాతయ్యగుంటలోని గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సుమన్....అనంతరం మీడియాతో మాట్లాడారు. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే తెలుగుదేశం-జనసేన గెలుపు ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని... ప్రలోభాలకు గురికావొద్దని సూచించారు.
మద్యం, డబ్బులు లొంగిపోకుండా తమ జీవితాలను బాగుచేసే పార్టీకి ఓటు వేయాలని సూచించారు. ముఖ్యంగా యువత ఆలోచించి ఓటు వేయాలని...ఓటు వేసే ముందు తమ భవిష్యత్ ను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని హెచ్చరించారు. ఓటు ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడే జీవితాలు మారిపోతాయని హితవు పలికారు. అలాకాకుండా తాత్కాలిక ఆనందం కోసం ప్రలోభాలకు లొంగిపోతే జీవితాలను తాకట్టు పెట్టినట్లేనని సూచించారు. గతపాలన, ఇప్పుడు పాలన బేరీజు వేసుకుని ఏదీ బాగుందని అనిపిస్తే ఆ పార్టీకే ఓటు వేయాలని సూచించారు. అయితే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
సుమన్ వ్యాఖ్యలతో ఖంగుతిన్న వైసీపీ!
ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే సుమన్.. తరుచూ ఈ మధ్య కాలంలో జగన్ పాలన గురించి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి పొగడ్తలు గుప్పించారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆయన యూటర్న్ తీసుకోవడంతో వైసీపీ నేతలు ఖంగుతిన్నారు. అయితే ఇటీవల వైసీపీ అధిష్టానం ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానించింది. రాజమండ్రి నుంచి వైసీపీ తరపున పోటీచేయాల్సిందిగా కోరింది. అయితే ఇప్పటి వరకు తాను తెలంగాణలోనే ఉండిపోయానని... ఇప్పటికిప్పుడు ఏపీలోకి రాలేనన్నారు. మూడు నెలల ముందు వచ్చి పోటీచేయడం సమంజసం కాదని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. అయితే రాజకీయాల్లో తనకు చంద్రబాబే గురువని చెప్పారు.
గతంలో తాను తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం కూడా చేసినట్లు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ-జనసేన గాలి వీస్తోందని ఒకరికొకరు సహకరించుకుంటే గెలుపు ఖాయమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును ప్రజలు వినియోగించుకొనే ముందు ఆలోచించి అటు తరువాత ఓటు వేయాలన్నారు. తమిళనటుడు విజయ్ పార్టీ పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నానని ఆయన అన్నారు.విజయ్ రాజకీయంగా ఆలోచనతో కూడిన అడుగులు వేస్తున్నారని తెలిపారు. తమిళనాడులో ఆయనకు చాలా పెద్దఎత్తున అభిమానులు ఉన్నారని....వారందరి కోరిక మేరకే ఆయన పార్టీ పెట్టినట్లు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)