Bengal Assembly Elections 2026: బెంగాల్లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయ క్షేత్రం గత ఎన్నికల మాదిరిగా కేవలం టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా కాకుండా, ఈసారి త్రిముఖ పోరు దిశగా వేగంగా మారుతోంది. లెఫ్ట్, కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

Bengal Assembly Elections 2026: పశ్చిమ బెంగాల్ రాజకీయ క్షేత్రం గత ఎన్నికల మాదిరిగా కేవలం టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా కాకుండా, ఈసారి త్రిముఖ పోరు దిశగా వేగంగా మారుతోంది. గత రెండు దశాబ్దాలుగా ఉనికి కోసం పోరాడుతున్న లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి, ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువతను, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ కూటమి చేస్తున్న పాదయాత్రలు, ఆందోళనలు బెంగాల్ రాజకీయాల్లో కొత్త వేడిని పుట్టిస్తున్నాయి.
యువత చూపు లెఫ్ట్ వైపు?
రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగిత సమస్యను లెఫ్ట్ పార్టీలు సమర్థవంతంగా వాడుకుంటున్నాయి. పరిశ్రమల లేమి, వలసలు, ఉపాధి అవకాశాల కొరతపై యువతలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో లెఫ్ట్ క్యాడర్ విజయం సాధిస్తోంది. విద్యావంతులైన యువతను ఆకర్షించడానికి సోషల్ మీడియాను కూడా ఆయుధంగా మలుచుకుంటూ, అవినీతి రహిత పాలనే తమ నినాదమని చాటుతున్నాయి. ఇది టీఎంసీ , బీజేపీ రెండింటికీ కొంత మేర ఆందోళన కలిగించే పరిణామమే.
అవినీతి అంశమే ప్రధాన అస్త్రం:
టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ నుండి మొదలుకొని రేషన్ కుంభకోణం వరకు అధికార టీఎంసీని చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలను లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. దొంగల రాజ్యం అంటూ చేస్తున్న విమర్శలు సామాన్య ఓటర్లపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. పారదర్శకమైన పాలన కావాలనుకునే తటస్థ ఓటర్లు ఇప్పుడు ఈ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మైనారిటీ ఓట్ల చీలిక - టీఎంసీకి తలనొప్పి
బెంగాల్లో టీఎంసీకి పెట్టని కోటగా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంక్లో ఇప్పుడు చీలిక కనిపిస్తోంది. లెఫ్ట్ , కాంగ్రెస్ పార్టీలు తమ సంప్రదాయ మైనారిటీ ఓటర్లను తిరిగి రాబట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒకవేళ మైనారిటీ ఓట్లు గణనీయంగా చీలితే, అది నేరుగా మమతా బెనర్జీ విజయావకాశాలను దెబ్బతీస్తుంది. గెలుపు ఓటములను నిర్ణయించే ఈ వర్గం పక్కకు జరిగితే, టీఎంసీకి అధికారం నిలబెట్టుకోవడం కత్తిమీద సామే అవుతుంది.
ఎవరికి నష్టం? ఎవరికి లాభం?:
లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి బలం పుంజుకోవడం వల్ల జరిగే నష్టమెవరికి అన్నది ఇప్పుడు కీలక ప్రశ్న. సాధారణంగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి వెళ్లాల్సి ఉండగా, ఈ కూటమి బలంగా ఉంటే ఆ ఓట్లు చీలిపోతాయి. ఇది పరోక్షంగా అధికార టీఎంసీకి మేలు చేస్తుందని కొందరి వాదన. అయితే, టీఎంసీ నుంచి అసంతృప్తితో ఉన్న సెక్యులర్ ఓటర్లు కూటమి వైపు వెళ్తే మాత్రం మమతా బెనర్జీకి భారీ దెబ్బ తప్పదు బీజేపీకి రావాల్సిన హిందూ ఓటర్లలో కూడా లెఫ్ట్ కొంత మేర ప్రభావం చూపితే, ఆ పార్టీ ఆశలపై నీళ్లు చల్లినట్లే. అందుకే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. కేవలం హిందూ-ముస్లిం పోలరైజేషన్ తో గెలవాలనుకుంటున్న పార్టీలకు, ప్రజా సమస్యలే అజెండాగా వస్తున్న కాంగ్రెస్, లెప్ట్ గట్టి పోటీనిస్తోంది. ఈ కూటమి ఎన్ని ఓట్లు చీలుస్తుంది, అది ఎవరి సింహాసనాన్ని కదిలిస్తుంది అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.



















