Adulterated ghee politics: నెయ్యి కల్తీపై సిట్ రిపోర్టుకు మసి పూస్తున్న పార్టీలు - వైసీపీ క్లీన్ చిట్ ప్రచారం - ఏది వాస్తవం ?
TTD Case: ఆంధ్రప్రదేశ్లో కల్తీ నెయ్యిపై వైసీపీ చేస్తున్న ప్రచారంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కల్తీ చేసి అడ్డంగా దొరికిపోయి తప్పుడు ప్రచారం చేస్తోందని అంటోంది.

Adulterated ghee Case politics: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ చిచ్చు రేపింది. సీబీఐ పర్యవేక్షణలోని సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ను ఇరు పక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుండటంతో, అసలు నిజం ఏంటనేది ఇప్పుడు సామాన్య భక్తులలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా వైసీపీ చేస్తున్న క్లీన్ చిట్ ప్రచారానికి, సిట్ ఛార్జిషీట్లో ఉన్న కెమికల్ నెయ్యి వాస్తవాలకు మధ్య రాజకీయ ప్రచారం తెరలా మారిపోతోంది.
జంతు కొవ్వు లేదనే వాదనతో వైసీపీ ఎదురుదాడి
సిట్ నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు లేదా చేప నూనె ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ఈ అపవాదు వేసిందని, ఇప్పుడు సిట్ నివేదికతో తాము సుద్ధపూసలమని నిరూపితమైందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకున్నందుకు కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం జంతు కొవ్వు అంశాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ, ఇతర అంశాలను పక్కదారి పట్టించే వ్యూహాన్ని వైసీపీ అనుసరిస్తోంది.
సిట్ అసలు వాస్తవం - నెయ్యి కాని నెయ్యి
అయితే, సిట్ ఛార్జిషీట్ లోని లోతైన అంశాలను గమనిస్తే భయంకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి. సిట్ నివేదిక ప్రకారం.. సరఫరా అయిన నెయ్యిలో జంతు కొవ్వు లేకపోవచ్చు కానీ, అది అసలు నెయ్యే కాదు. అది కేవలం ప్రమాదకరమైన కెమికల్స్ , వెజిటబుల్ ఆయిల్స్ తో తయారైన మిశ్రమమని సిట్ తేల్చింది. అంటే, ఐదేళ్ల పాటు లక్షల లీటర్ల కెమికల్ నెయ్యి ని భక్తులకు ప్రసాదం రూపంలో పంచారనేది సిట్ ప్రధాన అభియోగం. జంతు కొవ్వు లేదని సంబరపడుతున్న వైసీపీ, ఈ కెమికల్ కల్తీ పై ఎందుకు మాట్లాడటం లేదని టీడీపీ ప్రశఅనిస్తోంది.
కూటమి కౌంటర్ ఇవ్వలేకపోతోందా?
వైసీపీ ఇంతలా ఎదురుదాడి చేస్తున్నా, కూటమి ప్రభుత్వం నుండి ఇంకా గట్టి కౌంటర్ మొదలవ్వలేదు. దీనికి ప్రధాన కారణం, సిట్ నివేదికపై కోర్టుల స్పందన కోసం ప్రభుత్వం వేచి చూస్తుండటమే కావచ్చు. సీబీఐ నేతృత్వంలోని సిట్ ఇచ్చిన ఈ ఛార్జిషీట్ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు, వైసీపీ చేసిన తప్పులు నిబంధనల ఉల్లంఘన, అనర్హులైన వారికి టెండర్లు ఎలా నిరూపితమవుతాయనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాజకీయం కంటే న్యాయపరంగా వైసీపీని ఇరికించాలని కూటమి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఈ సీబీఐ-సిట్ రిపోర్టుపై న్యాయస్థానాలు స్పందించనున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలే బాబా డైరీ ,ఇతర సంస్థల వెనుక ఉన్న పెద్ద తలకాయల పాత్రపై కోర్టు ప్రశ్నలు కురిపించే అవకాశం ఉంది. జంతు కొవ్వు లేదన్న ఒక్క పాయింట్ మీద వైసీపీ గెలిచినట్లు కనిపిస్తున్నా, విషపూరితమైన కెమికల్ నెయ్యి సరఫరా జరిగిందని కోర్టు గనుక సీరియస్ అయితే, ఆ పార్టీకి అది కోలుకోలేని దెబ్బ అవుతుంది.
కల్తీ తేలితే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్లే!
సామాన్య భక్తుడికి కావలసింది జంతు కొవ్వు ఉందా లేక కెమికల్స్ ఉన్నాయా అన్నది కాదు.. తమ ఆరాధ్య దైవం ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా అన్నదే ముఖ్యం. సిట్ నివేదిక కల్తీ జరిగిందని స్పష్టంగా చెబుతోంది. ఒకవేళ కేవలం కెమికల్స్ మాత్రమే ఉన్నా, అది కూడా అపచారమే అన్నది భక్తుల విశ్వాసం. కాబట్టి వైసీపీ చేస్తున్న క్లీన్ చిట్ ప్రచారం కేవలం రాజకీయ రంగు పూయడమేనని, కోర్టుల తీర్పు తర్వాత అసలు దోషులు ఎవరో బహిర్గతమవుతాయని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.























