Telangana Cabinet Reshuffle : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఒత్తిళ్లు - రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి?
CM Revanth Cabinet: తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గ మార్పు చేర్పుల కోసం ఆయనపై ఒత్తిడి వస్తోంది.

Revanth Reddy working on the Telangana cabinet reshuffle: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధిష్టానం వద్ద ఆయన పరపతి గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. వరుస విజయాలు తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి మాటకు తిరుగులేని పరిస్థితి కనిపిస్తోంది.
కేబినెట్ మార్పులపై ఆచి తూచి అడుగులు
మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు పని చేయని వారిని తీసేసి కొత్త వారితో భర్తీ చేయాలన్న చర్చ కొంత కాలంగా జరుగుతోంది. అయితే ఇప్పుడున్న మంత్రులను కదిలించడం , కొత్తవారిని తీసుకోవడం వల్ల పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టీమ్ తోనే సమన్వయం చేసుకుంటూ వెళ్లడం మేలని ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అనవసరంగా కేబినెట్ ప్రక్షాళన చేసి అసంతృప్తికి తావివ్వడం కంటే పాలనపై దృష్టి పెట్టడమే ఉత్తమమని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. ఆశావహులు పలువురు తమ ప్రయత్నాలను ఢిల్లీ స్థాయి నుంచి చేసుకుంటున్నారు.
సామాజిక సమీకరణాల లెక్కలు
మంత్రివర్గ విస్తరణ చేపడితే సామాజిక వర్గాల వారీగా సమతుల్యత పాటించడం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలుగా మారనుంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ , మైనారిటీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆశావహుల జాబితా చాంతడంత ఉండటంతో ఎవరిని తీసుకున్నా మిగిలిన వారిలో అసహనం కలిగే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పై హైకమాండ్ నుండి రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ లభించినట్లు సమాచారం. ఎవరిని మంత్రిగా తీసుకోవాలి, ఎవరిని తొలగించాలి అనే నిర్ణయాధికారం ఆయనకే వదిలేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తక్షణమే ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని ..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పరిషత్ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల తర్వాతే ఆలోచన
బడ్జెట్ సమావేశాలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వంటి కీలక రాజకీయ పరిణామాల తర్వాతే దీనిపై ఒక నిర్ణయం ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు ప్రస్తుత మంత్రుల పనితీరును గమనించి ఆ తర్వాతే మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తన పట్టును మరింత పెంచుకోవడం పైనే దృష్టి సారించారు. ఆశావహుల్ని ఎలా ఎదురు చూస్తూ ఉండేలా చేయనున్నారు.























