Sandhya Theatre stampede case: సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు- పోలీసుల దర్యాప్తుపై నాంపల్లి కోర్టు అసహనం
Puspha stampede case: సంధ్యా ధియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టు చార్జిషీటును మరోసారి వెనక్కి పంపింది. ఇలా చేయడం ఇది మూడోసారి. దీంతో ఈ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

Court sends back chargesheet in Sandhya Theatre stampede case: పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చార్జిషీటును కోర్టు మరోసారి వెనక్కి పంపింది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడిన ఘటనలో చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ను నాంపల్లి కోర్టు మళ్లీ వెనక్కి పంపింది. గతంలో రెండుసార్లు సాంకేతిక కారణాలు, ఆధారాల లేమిని ఎత్తిచూపిన కోర్టు, ఈసారి కూడా చార్జిషీట్లో స్పష్టత లేదని పేర్కొంది. నిందితుల పాత్రను నిర్ధారించే విషయంలోనూ, ఘటన జరిగిన తీరును వివరించడంలోనూ పోలీసులు సరైన ఆధారాలను కోర్టు ముందు ఉంచలేకపోయారు. వరుసగా ఇలా జరగడం పోలీసు శాఖ పనితీరుపై విమర్శలకు దారితీస్తోంది.
ఈ కేసులో పోలీసులు సమర్పిస్తున్న నివేదికల్లో సమగ్రత లోపించడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, నిందితులుగా పేర్కొన్న వారిపై మోపిన అభియోగాలకు తగిన సాక్ష్యాలను జతచేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. థియేటర్ యాజమాన్యం, బౌన్సర్లు , ఇతర బాధ్యుల పాత్రను చట్టపరమైన కోణంలో వివరించడంలో వైఫల్యం కనిపిస్తోందని భావిస్తున్నారు. అలాగే, కీలకమైన సిసిటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలను కోర్టు అడిగిన ఫార్మాట్లో సమర్పించకపోవడం వల్ల చార్జిషీట్ తిరస్కరణకు గురవుతోంది.
తొక్కిసలాట జరిగిన సమయంలో అక్కడ ఉన్న జన సమూహాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, చార్జిషీట్లో పోలీసులు తమ పాత్రను కాపాడుకుంటూ, కేవలం థియేటర్ సిబ్బంది లేదా ప్రేక్షకులపైనే బాధ్యతను నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు న్యాయస్థానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ఫోరెన్సి, సాంకేతిక నివేదికలను చార్జిషీట్కు సరిగ్గా అనుసంధానించడంలో లోపాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేసు దర్యాప్తు చేస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, దర్యాప్తు అధికారి తీరును తప్పుబట్టింది. ఒక సున్నితమైన కేసులో చార్జిషీట్ను పదే పదే తిప్పి పంపడం బాధితులకు న్యాయం చేయడంలో జాప్యాన్ని కలిగిస్తుందని కోర్టు హెచ్చరించింది. లోపాలను సరిదిద్దుకుని, శాస్త్రీయ ఆధారాలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని పోలీసులకు గడువు ఇచ్చింది. ఈసారి కూడా విఫలమైతే ఉన్నతాధికారుల జోక్యం అవసరమవుతుందని న్యాయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
చార్జిషీటులో అల్లు అర్జున్ పేరు
పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటులో ప్రధానంగా థియేటర్ యాజమాన్యం , ప్రైవేట్ బౌన్సర్ల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా అనుమతించిన దానికంటే ఎక్కువ మంది అభిమానులు వస్తారని తెలిసి కూడా సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని, క్రౌడ్ మేనేజ్మెంట్ లో విఫలమయ్యారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు లోపలికి వెళ్లే గేట్ల వద్ద బౌన్సర్లు అసభ్యంగా ప్రవర్తించడం , తోపులాటను సరిగ్గా అదుపు చేయకపోవడమే తొక్కిసలాటకు దారితీసిందని వివరించారు. ఈ కేసులో అల్లు అర్జున్ రెండవ నిందితుడిగా ఉన్నారు. ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడం వల్ల ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారని, అది తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. జన సమూహాన్ని నియంత్రించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్న కారణంతో ఆయన్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.























