Political Publicity: ప్రధాని పొదుపు పిలుపును పబ్లిసిటీ స్టంట్స్ గా మార్చేస్తున్న నేతలు - దేశమంతా ఇంతే - మారరుగా !
Savings Stunt: ప్రధాని పిలుపునిచ్చిన పొదుపు ఉద్యమం వింతైన పబ్లిసిటీ సర్కస్ లా మారిపోయింది. నిశ్శబ్దంగా జరగాల్సిన ఈ మార్పును నేతలు కెమెరా ఈవెంట్గా మార్చేసి ప్రచారం చేసుకుంటున్నారు.

Savings Vs Showoff: ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక క్షేమం కోసం పొదుపు పాటించాలని ఇచ్చిన పిలుపును మన రాజకీయ నేతలు అత్యంత వేగంగా స్వీకరించారు. అయితే, వారు స్వీకరించింది పొదుపు ను కాదు.. దాని చుట్టూ ఉన్న పబ్లిసిటీ ని! ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఎంత పొదుపు చేస్తున్నారనేది పక్కన పెడితే, మేము పొదుపు చేస్తున్నామని చాటిచెప్పుకోవడానికి చేస్తున్న ఖర్చు మాత్రం సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది. మంచి ఆశయం కాస్తా ఇప్పుడు ఒక భారీ పబ్లిసిటీ స్టంట్ గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సైకిల్ యాత్రలు - డ్రోన్ కెమెరాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన కాన్వాయ్ను తగ్గించి, బుల్లెట్ ప్రూఫ్ కార్లను వదిలి సాధారణ వాహనాల్లో ప్రయాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది హర్షించదగ్గ పరిణామమే అయినా, కొందరు నేతలు చేస్తున్న హడావుడి మాత్రం విచిత్రంగా ఉంది. కొందరు మంత్రులు పెట్రోల్ ఆదా చేయాలంటూ సైకిళ్ల మీద ఆఫీసులకు వెళ్తున్నారు. కానీ, ఆ సైకిల్ తొక్కుతున్న దృశ్యాలను బంధించడానికి ముందు ఒక ఏసీ కారులో వీడియో గ్రాఫర్ల టీమ్, పైన ఒక డ్రోన్ కెమెరా తిరుగుతుండటం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. అంటే సైకిల్ ఆదా చేసిన పెట్రోల్ కంటే, షూటింగ్ కోసం వాడిన కార్లు ఎక్కువ పెట్రోల్ ఖర్చు చేస్తున్నాయన్నమాట!
ఎకానమీ క్లాస్ సెల్ఫీలు
ఇక విమాన ప్రయాణాల్లోనూ నేతలు తమ రూటు మార్చారు. బిజినెస్ క్లాస్ వదిలేసి ఎకానమీ క్లాస్లో కూర్చుని పక్కన ఉన్న సామాన్యుడితో సెల్ఫీ దిగి, సామాన్యుడిలా నేను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఆ ఒక్క సెల్ఫీ దిగడానికి ఆ నేత వెంట వచ్చే గన్మెన్లు, పీఏలు, ఫోటోగ్రాఫర్ల కోసం విడిగా టికెట్లు కొని ప్రభుత్వ ఖజానాకు భారం వేస్తున్నారనే నిజాన్ని ఎవరూ గమనించడం లేదు. ఈ ప్రహసనాన్ని చూస్తున్న తోటి ప్రయాణికులు ఆర్భాటం తగ్గించుకుంటే చాలు, మా పక్కన కూర్చోనక్కర్లేదు అని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
ఫ్లెక్సీల మీద పొదుపు సందేశాలు
మరో విడ్డూరం ఏమిటంటే.. కాగితం ఆదా చేయాలని, అనవసర ఖర్చులు తగ్గించాలని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పంపుతున్న నేతలు, అదే సందేశాన్ని వందలాది భారీ ఫ్లెక్సీల మీద ముద్రించి నగరం నిండా కట్టేస్తున్నారు. ఒక ఫ్లెక్సీకి అయ్యే ఖర్చుతో పదుల సంఖ్యలో నిరుపేదలకు భోజనం పెట్టవచ్చని, కానీ ఆడంబరాల కోసం చేసే ఈ ఖర్చును పొదుపు ' అని ఎలా పిలుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పొదుపు మంత్రం జపిస్తున్న వారు ముందస్తుగా ఈ ఫ్లెక్సీల సంస్కృతికి చెక్ పెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే స్ఫూర్తిని ఇతర నేతలు కేవలం కెమెరా ముందే కాకుండా, కెమెరా లేనప్పుడు కూడా పాటిస్తేనే దానికి సార్థకత లభిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా మంది మంత్రులు తమ ఆఫీసుల్లో ఏసీల వాడకం తగ్గిస్తున్నామని చెబుతూనే, విదేశీ పర్యటనలకు భారీ టీమ్స్ను వెంటబెట్టుకుని వెళ్లడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా కనిపిస్తోంది.
నిజాయితీ లేని ఆడంబరం దేనికి?
నిజమైన పొదుపు అనేది నిశ్శబ్దంగా, బాధ్యతాయుతంగా జరగాలి. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు విలాసాలను తగ్గించుకుంటే అది దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. కానీ, ప్రతి చిన్న మార్పును మైకులు పట్టుకుని ఊదరగొట్టడం వల్ల ఆ ఆశయం పలచనవుతుంది. ఆర్భాటాల కోసం చేసే ఖర్చును నిజాయితీగా తగ్గిస్తేనే అది ప్రధాని ఆశయానికి గౌరవం తెచ్చినట్లవుతుంది. కేవలం పబ్లిసిటీ కోసం చేసే ఈ పొదుపు నాటకాలు ప్రజలు గమనిస్తున్నారని నేతలు గుర్తించాలని నెటిజన్లు అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















