2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి, పార్టీలో అసమ్మతి గళం పెరగడం దీనికి ప్రధాన కారణం. జాతీయ స్థాయిలో పార్టీని పటిష్టం చేసి, ఎంపీలపై పట్టు సాధించాలనే లక్ష్యంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
Mamata Banerjee Lok Sabha: బెంగాల్ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం. అసెంబ్లీ ఓటమి, సొంత పార్టీలో ముదురుతున్న తిరుగుబాటు వేళ మమత బెనర్జీ లోక్సభకు వెళ్లాలని భావిస్తున్నారు. అందుకే యూసఫ్ పఠాన్ తన సీటు త్యాగం చేసే ఛాన్స్ ఉంది.

- 2026 ఎన్నికల ఓటమి, అంతర్గత విభేదాలతో మమత లోక్సభలోకి.
- బెహరాంపూర్ లోక్సభ స్థానం నుండి దీదీ పోటీకి సిద్ధం.
- టీఎంసీలో అంతర్గత కలహాలు, ఎంపీల అసమ్మతి పెరుగుతోంది.
- జాతీయ స్థాయిలో పార్టీని నిలబెట్టే లక్ష్యంతో ఆమె.
Mamata Banerjee Lok Sabha: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. అజేయ శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు అస్తిత్వ పోరాటంలో పడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం, సొంత పార్టీ ఎంపీల అసమ్మతి గళం వెరసి, పార్టీ అధినేత మమతా బెనర్జీ ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆమె నేరుగా లోక్సభలోకి అడుగుపెట్టి, జాతీయ స్థాయిలో పార్టీని చక్కదిద్దాలని యోచిస్తున్నారు.
ఎందుకు ఇంత సంచలన నిర్ణయం
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు తృణమూల్ కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ తీశాయి. 294 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో టీఎంసీ కేవలం 80 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీకి ఇది ఊహించని షాక్. కేవలం ఎన్నికల ఓటమి కాదు, పార్టీ లోపల కూడా అసమ్మతి సెగలు తీవ్రమయ్యాయి. లోక్సభలో ఉన్న టీఎంసీ ఎంపీల్లో చాలా మంది పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, వారు బీజేపీవైపు చూస్తున్నారని సమాచారం. ఈ తిరుగుబాటును అణచివేయడానికి, ఎంపీలను ఐక్యంగా ఉంచడానికి స్వయంగా దీదీయే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బెహరాంపూర్ లోక్సభ స్థానం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ దిగ్గజం అధిర్ రంజన్ చౌదరిని సుమారు 85 వేల ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మమత కోసం ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఈ సీటును ఖాళీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
పార్టీలో ముదురుతున్న ముఠా తగాదాలు
తృణమూల్ కాంగ్రెస్ కేవలం బయట శత్రువులతోనే కాదు, అంతర్గత శత్రువులతోనూ పోరాడుతోంది. సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదర్ వంటి వారు కూడా పార్టీ పనితీరుపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బరాసత్ ఎంపీగా ఉన్న ఆమె పార్టీలోని మరో సీనియర్ నాయకుడు కల్యాణ్ బెనర్జీ తనను సభలో దూషించారని స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడం పార్టీలోని అంతర్గత విభేదాలకు నిదర్శనం. సుఖేందు శేఖర్ రాయ్, శంతను సేన్ వంటి సీనియర్లు కూడా పార్టీ ప్రస్తుత గమనంపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే టీఎంసీ చీలిపోయింది. 57 మంది ఎమ్మెల్యేలు విడిపోయి, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రితబ్రత బెనర్జీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. స్పీకర్ రతీంద్ర బోస్ కూడా వారికి గుర్తింపు ఇవ్వడంతో టీఎంసీకి అసెంబ్లీలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ స్థాయిలోనైనా పట్టు కోల్పోకూడదని మమత ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంటున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
మమతకు లోక్సభ కొత్తేమీ కాదు
మమతా బెనర్జీకి పార్లమెంటరీ రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉంది. ఆమె గతంలో ఆరు సార్లు లోక్సభ సభ్యురాలిగా పని చేశారు. 1984 జాదవ్పూర్ నియోజకవర్గం నుంచి సీపీఎం ఉద్ధండుడు సోమనాథ్ ఛటర్జీని ఓడించి మొదటిసారి లోక్సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కలకత్తా సౌత్ ప్రస్తుతం దీన్ని కోల్కతా దక్షిణ్గా పిలుస్తున్నారు. అక్కడి నుంచి కూడా విజయం సాధించారు. 2011లో బెంగాల్ లో టీఎంసీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉంటూనే లోక్సభ సభ్యురాలిగా కొనసాగారు.
దాదాపు 15 ఏళ్ల తర్వాత తిరిగి ఆమె తన పాత అడ్డా అయిన పార్లమెంట్లో అడుగు పెట్టాలని చూడటం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. బెంగాల్లో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని విచ్చిన్నం కాకుండా కాపాడుకోవడం మమతా బెనర్జీ ముందు ఉన్న అతి పెద్ద సవాలు. లోక్సభలోకి ప్రవేశించడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల గొంతుకగా మారడమే కాకుండా, సొంతపార్టీ ఎంపీలపై పట్టు సాధించాలనని ఆమె ఆశిస్తున్నారు. యూసఫ్ పఠాన్ త్యాగం ఆమెకు కొత్త రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
Frequently Asked Questions
మమతా బెనర్జీ లోక్సభలోకి ప్రవేశించాలని ఎందుకు నిర్ణయించుకున్నారు?
మమతా బెనర్జీ ఏ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు?
ఆమె బెహరాంపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ స్థానం నుంచి యూసఫ్ పఠాన్ ఎంపీగా ఉన్నారు.
తృణమూల్ కాంగ్రెస్లో ప్రస్తుతం ఉన్న అంతర్గత సమస్యలు ఏమిటి?
పార్టీలో సీనియర్ ఎంపీల అసంతృప్తి, అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీలో 57 మంది ఎమ్మెల్యేలు విడిపోవడంతో పార్టీ చీలిక అంచున ఉంది.
మమతా బెనర్జీకి పార్లమెంటరీ రాజకీయాల్లో అనుభవం ఉందా?
అవును, మమతా బెనర్జీకి పార్లమెంటరీ రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉంది. ఆమె గతంలో ఆరు సార్లు లోక్సభ సభ్యురాలిగా పని చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















