Lokesh and Chandrababu Politics: బాబుది రాజకీయ వ్యూహం.. లోకేష్ది కుటుంబ బంధం - ఎమ్మెల్యేలతో సమావేశాల ప్లాన్ ఇదేనా?
TDP MLAs: టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ విడివిడిగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. ఇద్దరి ఎజెండాలు వేరు. ఒకరు రాజకీయం అయితే..మరొకరివి ఆత్మీయ సమావేశాలు.

Lokesh and Chandrababu meeting with MLAs: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు, లోకేష్ల వ్యూహాత్మక సమావేశాలు హైలెట్ అవుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలతో రాజకీయ వ్యూహాలు, ప్రజా సమస్యలు, పాలనాపరమైన అంశాలపై చర్చలు జరుపుతుంటే.. మరోవైపు మంత్రి నారా లోకేష్ పూర్తి భిన్నమైన, వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఆత్మీయ కలయిక పేరుతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వారి కుటుంబ సభ్యులతో సహా తన నివాసానికి ఆహ్వానించి లోకేష్ విందు ఇస్తున్నారు. ఇది కేవలం భోజనానికో, మర్యాదకో పరిమితమైన సమావేశం కాదు.. రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ఒక కుటుంబ పెద్ద పాత్రలో లోకేష్ కనిపిస్తున్నారు.
ఆత్మీయతతో ఐక్యత
సాధారణంగా ఒక రాజకీయ నాయకుడి గెలుపు వెనుక అతని కుటుంబ సభ్యుల ఎన్నో ఏళ్ల నిరీక్షణ, త్యాగాలు ఉంటాయి. కానీ, రాజకీయాల్లో ఆ కుటుంబ సభ్యులను గుర్తించే సందర్భాలు చాలా తక్కువ. లోకేష్ తన నివాసంలో ఎమ్మెల్యేల భార్యలు, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో నేరుగా ముచ్చటించడం ద్వారా వారి కష్టాలకు ఒక గుర్తింపునిస్తున్నారు. ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలు బహూకరించడం, పిల్లల చదువులు, భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకోవడం ద్వారా.. పార్టీ అనేది కేవలం పదవుల కోసం కాకుండా, ఒక ఉమ్మడి కుటుంబం అనే భావనను ఆయన బలంగా నాటుతున్నారు.
అందుబాటులో ఉంటున్నామన్న భావన
ఈ భేటీల్లో మరో కీలకమైన అంశం సులభంగా అందుబాటులో ఉంటున్న భావన కల్పించడం. ముఖ్యమంత్రితో లేదా మంత్రులతో అపాయింట్మెంట్ దొరకడమే కష్టమైన రోజుల్లో, లోకేష్ స్వయంగా ఎమ్మెల్యేల కుటుంబాలకు తన ఇంటి తలుపులు తీయడం ఒక గొప్ప మార్పు. ఇది ఎమ్మెల్యేలలో బాధ్యతను పెంచడమే కాకుండా, నాయకత్వంపై నమ్మకాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం వల్ల, భవిష్యత్తులో రాజకీయంగా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఆత్మీయతతో కూడిన ఐక్యత ఆ నాయకులను పార్టీతోనే ఉండేలా చేస్తుంది. లోకేష్ నిర్వహిస్తున్న ఈ భేటీలు కేవలం సరదా ముచ్చట్లకు మాత్రమే పరిమితం కాలేదు. గతంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలపై ఇచ్చిన వినతులు ఏ దశలో ఉన్నాయి? ఆ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి? అనే దానిపై లోకేష్ ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసి వారికి చూపిస్తున్నారు. దీనివల్ల పాలనలో పారదర్శకత పెరగడమే కాకుండా, ఎమ్మెల్యేలకు కూడా తమ నియోజకవర్గాల్లో పనులు అవుతున్నాయనే ధీమా ఏర్పడుతుంది. చంద్రబాబు రాజకీయ పాఠాలు నేర్పుతుంటే, లోకేష్ ఆ పాఠాలకు ఆత్మీయతను జోడించి కేడర్ను ముందుకు నడిపిస్తున్నారు.
నేతల మధ్య ఆత్మీయ బంధంతో మరింత ఐక్యత
రాజకీయాలంటే కేవలం అధికారం, ప్రొటోకాల్స్ మాత్రమే కాదని, మనుషుల మధ్య ఉండే గౌరవం, ఆత్మీయత కూడా అని లోకేష్ నిరూపిస్తున్నారు. నాయకత్వం నుండి ప్రారంభమైన ఈ విలువల పరంపర.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. కుటుంబ సభ్యులను భాగస్వాములను చేయడం ద్వారా రాజకీయాల పట్ల సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని కూడా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఆత్మీయ భేటీలు కేవలం పార్టీ బలోపేతానికే కాకుండా, రాజకీయ నాయకులలో మానవ సంబంధాలను పెంచడానికి దోహదపడుతున్నాయి. అధికారం శాశ్వతం కాదని, అభిమానం , ఆత్మీయతలే శాశ్వతమని నమ్మే లోకేష్ మార్క్ రాజకీయం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ నింపుతోంది. ఒక నాయకుడు ప్రజలకే కాకుండా, తనను నమ్ముకున్న నాయకుల కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండాలనే ఈ సరికొత్త రాజకీయ సంస్కృతి రాష్ట్ర రాజకీయాల్లో సుస్థిరమైన మార్పుకు నాంది పలుకుతోందని టీడీపీ వర్గాలంటున్నాయి.























