Kalvakuntla Kavitha Telangana Rakshana Sena: సీఎం కావాలంటే జింఖానా అంత మనసుండాలి.. చంచల్గూడ అంత కాదు - టీఆర్ఎస్ కవితకు బీజేపీ విష్ణు కౌంటర్
Vishnuvardhan Reddy counter to Kavitha: సీఎం అయితే హైదరాబాద్లోని ఆంధ్రుల విగ్రహాలను ఏపీకి పార్సిల్ చేస్తామన్న కవిత వ్యాఖ్యలపై బీజేపీ నేత విష్ణు సెటైర్లు వేశారు.

Smashing Andhra Leaders Statues Vijayawada Parcel: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ విభేదాల మంటలు రాజుకుంటున్నాయి. ఇటీవల కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ నేతలను ఉద్దేశించి ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్ను పెంచాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది.
కవిత పార్సిల్ రాజకీయం
తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ నేతలను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను పగలగొట్టి, వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు పార్సిల్ చేస్తాం అంటూ ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లో పవన్ కల్యాణ్ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పెట్టాలనుకోవడంపై మండిపడుతూ.. ముందు ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ నేతలు ఇక్కడికి వచ్చి పెత్తనం చేయాలని చూస్తే పళ్లు రాలగొడతామంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు కౌంటర్ సెటైర్లు
కవిత చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విగ్రహాలు కూల్చడానికి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రగల్చడానికి మీకు ముఖ్యమంత్రి పదవి కావాలా కవిత గారు? అంటూ ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావాలంటే మీకు ‘జింఖానా గ్రౌండ్’ అంత విశాలమైన హృదయం ఉండాలి; అంతే తప్ప చంచల్గూడ జైలు అంత చిన్న మనసు ఉండకూడదు అంటూ గతంలో ఆమె జైలుకు వెళ్లిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ పరోక్షంగా సంచలన సెటైర్లు వేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండాలనుకునే వారు సమాజాన్ని జోడించేలా మాట్లాడాలి కానీ, ఇలా విగ్రహాలు పగులగొడతామంటూ విద్వేషాలు రెచ్చగొట్టడం తగదని హితవు పలికారు.
ఆంధ్ర విగ్రహాలు కూల్చి 100 కిలోమీటర్ల దూరానికి విజయవాడకు పార్సిల్ చేయడానికి ముఖ్యమంత్రి పదవి కావాల్నా కవిత గారు? @RaoKavitha https://t.co/O2Ivlu7Vcf pic.twitter.com/6uyGDEz3Wy
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 2, 2026
జనసేన సభకు అనుమతి నిరాకరణ - కాంగ్రెస్ మార్క్ రాజకీయం
ఇదే తరుణంలో హైదరాబాద్లో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ కు పోలీసులు అనుమతి నిరాకరించడంపై కూడా విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయనే సాకుతో సభను అడ్డుకోవడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఒక పక్క విపక్షాలు సెంటిమెంట్ను వాడుకుంటుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ పాత గాయాలను రేపుతూ, విగ్రహాల కూల్చివేత రాజకీయాలకు పిలుపునివ్వడం ద్వారా కవిత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాలని చూశారు. కానీ, దానికి విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చిన చంచల్గూడ కౌంటర్ సోషల్ మీడియాలో మరింత చర్చకు కారణం అవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















