JC Prabhakar Reddy Tadipatri Politics: తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ
Tadipatri : తాడిపత్రి రాజకీయాలు భగ్గమంటూనే ఉన్నాయి. తాడిపత్రిలో అడుగు పెట్టడానికి పెద్దారెడ్డికి చాలా చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఎవరైనా రాజకీయం చేయవచ్చు కానీ పెద్దారెడ్డి మాత్రం కాదని అంటున్నారు.

JC Brothers Vs Ketireddy Family: ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో తాడిపత్రి నియోజకవర్గానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన చరిత్ర, వేడి ఉంటాయి. ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మార్క్ పాలిటిక్స్తో తాడిపత్రి రాజకీయం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో గానీ, ఆ పార్టీలో ఉండే ఇతర నేతలతో గానీ ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు.. తన పోరాటం కేవలం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితోనే అని ఆయన స్పష్టం చేశారు. పెద్దారెడ్డి మినహా వైసీపీ నుంచి ఎవరైనా తాడిపత్రిలో రాజకీయం చేసుకోవచ్చని, తనకు అభ్యంతరం లేదని జేసీ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పెద్దారెడ్డి మాత్రమే ఎందుకు వద్దన్నదానిపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.
రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల ఫ్యాక్షన్ గొడవలు
జేసీ ప్రభాకర్ రెడ్డి కేవలం పెద్దారెడ్డిని మాత్రమే టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. రాయలసీమలో ఒకప్పుడు నడిచిన ఫ్యాక్షన్ రాజకీయాలే దీనికి కారణం అని ఎక్కువ మంది చెబుతున్నారు. దశాబ్దాల క్రితం జేసీ కుటుంబానికి , కేతిరెడ్డి కుటుంబానికి మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువగా ఉండేవి. చాలా మంది చనిపోయారు కూడా. కేతిరెడ్డి పెద్దారెడ్డి సోదరుడు కేతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి కూడా తాడిపత్రి రైల్వే స్టేషన్ వద్ద హత్యకు గురయ్యారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం పెద్దల సమక్షంలో కొన్ని ఒప్పందాలు జరిగాయని.. ఆ ప్రకారం ఒకరి నియోజకవర్గాల్లో ఒకరు జోక్యం చేసుకోవద్దని ఒప్పందం జరిగిందని చెబుతారు.
గతంలో కుదిరిన ఫ్యాక్షన్ రాజీ ప్రకారం.. జేసీ బ్రదర్స్ తాడిపత్రి నియోజకవర్గానికే పరిమితం కావాలి. అదే సమయంలో కేతిరెడ్డి కుటుంబం ధర్మవరం లేదా అనంతపురం రూరల్ రాజకీయాలు చూసుకోవాలి తప్ప.. తాడిపత్రి సరిహద్దుల్లోకి రాకూడదు అనేది ఇరువర్గాల మధ్య ఉన్న పాత ఒప్పందం అని చెబుతారు. అయితే, 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ తరపున కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి బరిలోకి దిగడం, అక్కడ ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ దశాబ్దాల నాటి ఫ్యాక్షన్ ఒప్పందం పూర్తిగా ఉల్లంఘించినట్లయింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై దాడులు జరగడం, ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకోవడం తాడిపత్రిలో శాంతిభద్రతల సమస్యను సృష్టించింది. తన సొంత గడ్డపైనే దశాబ్దాలుగా పాటిస్తున్న రాజకీయ సరిహద్దుల నియమాన్ని పెద్దారెడ్డి బ్రేక్ చేశారనే కసి, కోపం జేసీ ప్రభాకర్ రెడ్డిలో బలంగా నాటుకుపోయినట్లుగా తెలుస్తోంది.
అందుకే పెద్దారెడ్డిని అడుగు పెట్టనివ్వని జేసీ
అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. జేసీ ప్రభాకర్ రెడ్డి తన పాత శత్రుత్వాన్ని క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. వైసీపీ అనే పార్టీని సైడ్ ట్రాక్ చేసి, కేవలం పెద్దారెడ్డిని ఒంటరిని చేసే వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నారు. వైసీపీలో ఉన్న ఇతర సామాజిక వర్గాల నేతలను, ద్వితీయ శ్రేణి నాయకులను తన వైపు తిప్పుకుంటూ.. పెద్దారెడ్డికి తాడిపత్రిలో లీడర్ల సపోర్ట్ లేకుండా చేస్తున్నారు. పెద్దారెడ్డిని తాడిపత్రి రాజకీయాల నుంచి శాశ్వతంగా తరిమేయడమే నా లక్ష్యం అనే సంకేతాన్ని జేసీ తన క్యాడర్కు ఇస్తున్నారు.
తాడిపత్రిని వదిలేది లేదంటున్న కేతిరెడ్డి
సోషల్ మీడియా వేదికగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గం కూడా దీనికి కౌంటర్లు ఇస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుందని.. తమను అడ్డుకోవడం జేసీ ప్రభాకర్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు. తాము కూడా తాడిపత్రిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడుతామని పెద్దారెడ్డి అనుచరులు చెబుతున్నారు. తాడిపత్రిలో సాగుతున్న ఈ జేసీ-కేతిరెడ్డి కోల్డ్ వార్ కేవలం ఈనాటి రాజకీయాల వల్ల వచ్చింది కాదు.. ఇది దశాబ్దాల నాటి ఫ్యాక్షన్ రాజీలు, సరిహద్దుల ఉల్లంఘనల కొనసాగింపు అనుకోవచ్చు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుకున్నట్లుగా పెద్దారెడ్డిని పొలిటికల్ స్క్రీన్ నుంచి అవుట్ చేస్తారా.. లేక కూటమి హయాంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య ఘర్షణలు తాడిపత్రిని మళ్లీ పాత ఫ్యాక్షన్ రోజుల్లోకి తీసుకెళ్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం తాడిపత్రి రాజకీయ చదరంగంలో పావులు పూర్తిగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లుగానే కదులుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















