Telangana Municipal Elections 2026: రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలకు చేసినదెంత? - ఏమని ఓట్లడుగుతున్నారు?
Congress : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ పట్టణ ప్రగతి గురించి కాకుండా పూర్తిగా రాజకీయానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ అసలు పట్టణాలకు ఏం చేసింది?

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ప్రచార వేడి ఊపందుకుంది. ఈ సమయంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను, ప్రస్తుత రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ఓటర్లు బేరీజు వేసుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణాల అభివృద్ధిపై రెండు ప్రభుత్వాల ప్రాధాన్యతలు, అమలు చేసిన కార్యక్రమాల్లో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పట్టణ ప్రగతి - మౌలిక వసతులపై ఫోకస్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరుతో ఒక క్రమబద్ధమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ప్రధానంగా మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, పచ్చదనం కోసం హరితహారం, మౌలిక సదుపాయాల మెరుగుదలే లక్ష్యంగా పనిచేశారు. ప్రతి మున్సిపాలిటీకి ట్రాక్టర్లు, వైకుంఠధామాలు, వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్లు నిర్మించడం ద్వారా పట్టణాల్లో కనీస సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చారు. నిరంతర నిధుల విడుదల ద్వారా మున్సిపల్ కార్మికుల వేతనాలు, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాల్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
రేవంత్ సర్కార్ రీఫార్మ్స్ - హైడ్రా, మూసీ ప్రక్షాళన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణ అభివృద్ధిని భిన్న కోణంలో చూస్తోంది. ముఖ్యంగా చెరువుల ఆక్రమణలను తొలగించడం, అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడం రేవంత్ ప్రభుత్వ మార్క్ నిర్ణయంగా మారింది. అలాగే, వేల కోట్ల రూపాయలతో చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీఆర్ఎస్ వసతులపై దృష్టి పెడితే, కాంగ్రెస్ దీర్ఘకాలిక ప్రణాళికలు, పర్యావరణ పరిరక్షణపై మొగ్గు చూపుతోంది. అయితే కాంగ్రెస్ చేపట్టినవి ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించినవే. ఇతర మున్సిపాలిటీలకు ప్రత్యేకమైన ప్రణాళికలేమీ అమలు చేయలేదు.
కాంగ్రెస్ ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకు !
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ అభివృద్ధి కోసం బడ్జెట్లో భారీగానే కేటాయింపులు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిధుల విడుదలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గత ప్రభుత్వం వదిలివెళ్లిన పెండింగ్ బిల్లుల భారం మున్సిపాలిటీలపై ఉండటంతో కొత్త పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. ఇందిరమ్మ కమిటీల ద్వారా వార్డుల వారీగా అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని, ప్రజా పాలన ద్వారా ఫిర్యాదులను పరిష్కరించాలని రేవంత్ ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో అధికారులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో పట్టణ ప్రగతి జరిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లింది. ఉచిత బస్సు ప్రయాణం , ఉచిత విద్యుత్ వంటి గ్యారెంటీలు పట్టణ మధ్యతరగతి ప్రజలపై సానుకూల ప్రభావం చూపాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఎవరు బాగా చేశారని ప్రజలు అనుకుంటారు?
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి నిత్యం ఎదుర్కొనే సమస్యలనే ప్రాతిపదికగా తీసుకుంటారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన పార్కులు, మార్కెట్లను కాంగ్రెస్ ఎలా నిర్వహిస్తోంది.. రేవంత్ రెడ్డి తెచ్చిన కొత్త సంస్కరణలు తమ జీవితాలను ఎలా మారుస్తాయి అనే అంశాలను ప్రజలు పోల్చి చూస్తున్నారు. గత పదేళ్ల అభివృద్ధి వర్సెస్ ప్రస్తుత రెండేళ్ల "మార్పు" మధ్య ఈ ఎన్నికల పోరు సాగనుంది. ప్రజల ఓటింగ్ ప్రాధాన్యతలు ఎలా ఉన్నా.. ఈ అంశంలో మాత్రం ప్రజల మధ్యచర్చలు జరుగుతున్నాయి.



















