Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
KV Venugopal: కాంగ్రెస్ హైకమాండ్ లో అత్యంత కీలక నేత కేసీ వేణుగోపాల్. ఆయన ఢిల్లీ రాజకీయాలకే ఎక్కువగా పరిమితం. కానీ ఇప్పుడు సీఎం కావాలనుకుంటున్నారు.

Kerala Congress : కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో నాయకత్వ సెగలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అధికార ఎల్డీఎఫ్పై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాల్సిన సమయంలో, తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న పార్టీలో కొత్త చిచ్చు పెట్టింది. ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు సీఎం రేసులోకి రావడం, దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో పాతుకుపోయిన సీనియర్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
కేరళలో పార్టీని నడిపిస్తున్న లోకల్ లీడర్స్
ప్రస్తుతం కేరళ కాంగ్రెస్లో ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్, కేపీసీసీ అధ్యక్షుడు కె. సుధాకరన్ ద్వయం పార్టీని నడిపిస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే, వేణుగోపాల్ అభ్యర్థిత్వంపై వస్తున్న వార్తలు వీరి ప్రాధాన్యతను దెబ్బతీసేలా ఉన్నాయి. మేము కష్టపడి పంట పండిస్తే, కోత కోయడానికి ఢిల్లీ నుండి ఎవరో వస్తామంటే ఎలా అన్న చందంగా స్థానిక నేతల అసంతృప్తి ఉంది. ఇప్పటికే పలువురు నేతలు తమకు కేసీ వేణుగోపాల్ సారథ్యం ఆమోదయోగ్యం కాదని అంతర్గత సమావేశాల్లో కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.
కేరళ కాంగ్రెస్ లో ఎన్నో గ్రూపులు
కేరళ కాంగ్రెస్కు పాత జబ్బు అయిన ‘ఐ’ కాంగ్రెస్ ‘ఎ’ గ్రూపుల పోరు ఈ పరిణామంతో మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఉమెన్ చాందీ, రమేష్ చెన్నితాల వంటి ఉద్దండులు నడిపిన ఈ గ్రూపులు.. ఇప్పుడు వేణుగోపాల్ రాకను అడ్డుకోవడంలో ఒక్కటవుతాయా లేక కొత్త గ్రూపులు పుట్టుకొస్తాయా అనేది ఉత్కంఠ రేపుతోంది. క్షేత్రస్థాయిలో పట్టున్న సతీశన్ వర్గం తమ పట్టును వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మరోవైపు, వేణుగోపాల్ మాత్రం తాను పోటీలో లేనని పైకి చెబుతున్నా, అభ్యర్థుల ఎంపికలో మెరిటోక్రసీ ఉండాలని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. పరోక్షంగా పాత తరాన్ని పక్కన పెట్టి తన మార్కు చూపించే ప్రయత్నమేనని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్ని అనుకూలంగా మలుచుకుంటున్న లెఫ్ట్
ఈ నాయకత్వ గందరగోళాన్ని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తేల్చుకోలేని కూటమి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తుంది అంటూ ఇప్పటికే పినరయి విజయన్ విమర్శలు మొదలు పెట్టారు. కాంగ్రెస్లోని ఈ అంతర్గత కుమ్ములాటలు ఓటర్లలో ప్రతికూల సంకేతాలను పంపే అవకాశం ఉందని హైకమాండ్ ఆందోళన చెందుతోంది. ఒకవేళ నాయకత్వ సమస్యను ముందుగా తేల్చకపోతే, గత ఎన్నికల్లో లాగే ఈసారి కూడా చేతికి వచ్చిన విజయం చేజారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
కేరళలో కాంగ్రెస్ గెలవాలంటే కేవలం అధికార వ్యతిరేకత సరిపోదు, అంతర్గత ఐక్యత కూడా అత్యవసరం. కేసీ వేణుగోపాల్ను సేవియర్ గా చూపిస్తారా లేక స్థానిక నేతలకు పట్టం కడతారా అనే నిర్ణయంపైనే యూడీఎఫ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఢిల్లీ నుండి వచ్చే ఆదేశాలు తిరువనంతపురంలోని కార్యకర్తల మనసు గెలుచుకోకపోతే, కేరళలో కాంగ్రెస్ ప్రస్థానం మరోసారి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















