Delimitation 2026: డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ ఈ సారి ఖాయం - ఫార్ములా 50 శాతమా? టార్గెటెడ్ విభజనా?
Womens Reservation Bill: కేంద్రానికి రాజ్యాంగసవరణలకు అవసరమైన మద్దతు లభిస్తోంది. దీంతో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందడం ఖాయమే. కానీ ఏకాభిప్రాయం సాధ్యమేనా?

Delimitation formula for Lok Sabha seats: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. గతంలో ఎన్డీఏ కూటమికి పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజార్టీ లేకపోవడం వల్ల ఈ రాజ్యాంగ సవరణల ప్రక్రియ సాధ్యం కాదనే చర్చ నడిచింది. అయితే, లోక్సభలో అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన సుమారు 20 మంది ఎంపీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం, ఇండీ కూటమిలోని సమాజ్వాదీ పార్టీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ కోసం సానుకూల సంకేతాలు ఇస్తుండటంతో మోదీ-షా ద్వయానికి అవసరమైన సంఖ్యాబలం సమకూరుతున్నట్లు స్పష్టమవుతోంది. అసలు డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన జరగబోతోంది? దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు ఏంటి?
నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రధానంగా రెండు భిన్నమైన ఫార్ములాలు ప్రచారంలో ఉన్నాయి.
1. 50 శాతం పెంపు
ఈ ఫార్ములా ప్రకారం.. ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్ల సంఖ్యను నేరుగా దాదాపు 50 శాతం పెంచుతారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని కూడా ఇదే సంఖ్యాబలానికి అనుగుణంగా నిర్మించారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే, జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరుగుతాయి.
2. ప్రధాని ఆర్థిక సలహా మండలి టార్గెటెడ్ ఫార్ములా
జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే దేశ సమగ్రతకు, సమాఖ్య స్ఫూర్తికి నష్టం వాటిల్లుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించింది. కేవలం జనాభాయే కాకుండా.. భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక వృద్ధి, అక్షరాస్యత వంటి వివిధ సూచీలను పరిగణనలోకి తీసుకుని 'టార్గెటెడ్ నియోజకవర్గాల విభజన' చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల ఉత్తరాదికి సీట్లు పెరిగినప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు మరీ ఘోరంగా నష్టపోకుండా ఒక సమతుల్యత సాధ్యమవుతుంది.
Also Read: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
దక్షిణాది పార్టీల అసంతృప్తి.. దేనికి ఓటేస్తాయి?
జనాభా ఆధారిత డీలిమిటేషన్ ఫార్ములాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసి, దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు తమకు సీట్లను తగ్గించి శిక్షిస్తారా? అని చంద్రబాబు నాయుడు, స్టాలిన్ వంటి నేతలు ఇప్పటికే బహిరంగంగానే ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం 50 శాతం పెంపు ఫార్ములాను మొండిగా ముందుకు తీసుకెళ్తే దక్షిణాది పార్టీలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి. అయితే, ఒకవేళ ప్రధాని ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించిన 'టార్గెటెడ్ అండ్ వెయిటెడ్' పద్ధతిని ప్రవేశపెట్టి.. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తే మాత్రం దక్షిణాది పార్టీలు ఆ ఫార్ములాకు ఓటేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్లతో ముడిపడిన రాజకీయం
మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారినప్పటికీ, అది అమలు కావాలంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావడం సాంకేతికంగా అత్యంత కీలకం. ఉత్తరాదిలోని ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలు కోటాలో కోటా ఓబీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నాయి. అయితే, పార్లమెంట్లో ఎన్డీఏ బలం పెరుగుతున్న తరుణంలో, మహిళా ఓటర్ల మద్దతును పూర్తిగా స్వంతం చేసుకోవడానికి కేంద్రం ఈ రెండు బిల్లులను ఒకేసారి ముడిపెట్టి ఆమోదించే వ్యూహంతో ముందుకు వెళ్తోంది.
సమాఖ్య స్ఫూర్తికి పరీక్షా సమయం
రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ చర్చ కేవలం సీట్ల సంఖ్యకు పరిమితం కాకుండా.. భారతదేశ సమాఖ్య స్ఫూర్తి కి ఒక పెద్ద పరీక్షగా మారబోతోంది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో లభించిన 2/3 వంతు మెజార్టీతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందా, లేదా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక సలహా మండలి సూచించిన సమతుల్య ఫార్ములా వైపు మొగ్గు చూపుతుందా అనేది తేలాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















