ChandrababuNaidu Population Policy: చంద్రబాబు పాపులేషన్ పజిల్ - భవిష్యత్ భయమా? రాజకీయ సాహసమా ?
CBN Vision 2047: ఒకప్పుడు జనాభా నియంత్రణ లో ఆంధ్రప్రదేశ్ను దేశానికే ఆదర్శంగా నిలిపిన చంద్రబాబు , ఇప్పుడు అదే జనాభాను పెంచాలని పిలుపునిస్తున్నారు. అందరూ ట్రోల్ చేస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు.

ChandrababuNaidu Population Policy Feminist Criticism : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన పాపులేషన్ పాలసీ ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు, విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. జనాభా నియంత్రణ నుంచి జనాభా పెంపు వైపు ఆయన తీసుకున్న ఈ యూ-టర్న్ వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నప్పటికీ, సామాజికంగా మాత్రం అది తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రాజకీయంగా తక్షణ లాభం లేని, పైగా వివాదాస్పదమైన ఈ అంశాన్ని ఆయన పదే పదే ప్రస్తావిస్తూ విమర్శలకు గురవుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో జననాల రేటు ప్రమాదకరంగా పడిపోతోందని, ఇదే కొనసాగితే భవిష్యత్తులో పనిచేసే యువత కరువై, రాష్ట్రం వృద్ధాశ్రమంగా మారుతుందన్నది ఆయన ప్రధాన ఆందోళన. జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభాన్ని ఉదాహరణగా చూపుతూ ఆయన మేల్కొలుపు పలుకుతున్నారు. అయితే, ఈ పిలుపునకు రాజకీయ వర్గాల నుంచి కంటే సామాజిక వర్గాల నుంచే గట్టి సెగ తగులుతోంది.
మహిళల హక్కులు వర్సెస్ ప్రభుత్వ ప్రోత్సాహకాలు
చంద్రబాబు ప్రతిపాదించిన నగదు ప్రోత్సాహకాలు 3వ బిడ్డకు రూ.30 వేలు, 4వ బిడ్డకు రూ.40 వేలు ఫెమినిస్టులు , మహిళా సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. కేవలం డబ్బు ఆశ చూపి మహిళల శరీరాలను జనాభా ఉత్పత్తి యంత్రాలు గా మార్చాలని చూడటం అప్రజాస్వామికమని వారు వాదిస్తున్నారు. పిల్లల్ని కనాలా వద్దా అన్నది దంపతుల వ్యక్తిగత నిర్ణయమని, అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరైనది కాదని మండిపడుతున్నారు. ముఖ్యంగా గర్భధారణ, ప్రసవం వల్ల మహిళల ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని ఆర్థిక ప్రోత్సాహకాలతో తూచలేమని వారు స్పష్టం చేస్తున్నారు.
జెన్-జీ మైండ్సెట్ - పెంచేదెవరు?
నేటి తరం యువ దంపతులు పిల్లల విషయంలో చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఆకాశాన్నంటుతున్న విద్యా, వైద్య ఖర్చుల దృష్ట్యా ఒకరిని పెంచడమే భారంగా భావిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.30 వేలు ఒక నెల పాలకు, డైపర్లకు కూడా సరిపోవు.. మరి ఆ బిడ్డ 20 ఏళ్లు పెరిగి పెద్దయ్యే వరకు అయ్యే లక్షల రూపాయల ఖర్చు ఎవరు భరిస్తారు అన్నది సామాన్యుల నుంచి వస్తున్న సూటి ప్రశ్న. ఈ ఆర్థిక వాస్తవాలను విస్మరించి కేవలం జనాభా సంతులనం కోసం పిల్లల్ని కనమనడం క్షేత్రస్థాయిలో ట్రోలింగ్కు దారితీస్తోంది.
రాజకీయ నాయకులు సాధారణంగా తక్షణ ఓట్లు రాల్చే పథకాల గురించి మాట్లాడతారు. కానీ చంద్రబాబు ప్రతిపాదించిన ఈ జనాభా విధానం వల్ల ఆయనకు వచ్చే తక్షణ రాజకీయ లాభం సున్నా. పైగా, ఇది తీవ్రమైన విమర్శలకు, ట్రోలింగ్కు దారితీస్తోంది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. చంద్రబాబు వాదనను బలపరిచే వారు కూడా లేకపోలేదు. యువత లేని దేశం మనుగడ సాగించలేదు అన్నది ఆర్థిక నిపుణుల మాట. ఒకప్పుడు జనాభాను భారంగా చూసిన మనం, ఇప్పుడు డెమోగ్రాఫిక్ డివిడెండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. చంద్రబాబు సూచనలు ఈరోజు వినడానికి వింతగా ఉన్నా, మరో రెండు దశాబ్దాల తర్వాత అప్పుడు పుట్టిన పిల్లలు లేకపోతే రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీస్తుందన్నది ఆయన సిద్ధాంతం. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు అనుభవిస్తున్న చేదు అనుభవాలే ఆయనకు ప్రేరణ.
చరిత్రే నిర్ణయిస్తుంది!
కేవలం పిల్లల్ని కనమని చెప్పడం కంటే, వారి పెంపకానికి అవసరమైన సామాజిక రక్షణ వ్యవస్థను ప్రభుత్వం నిర్మించాల్సిన అవసరం ఉంది. ఉచిత విద్య, మెరుగైన వైద్యం, తల్లులకు ఉద్యోగ భద్రత వంటి అంశాలపై హామీ ఇవ్వకుండా కేవలం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ఫలితం ఉండదు. అలాగే, ప్రస్తుత యువతకు ఉన్న ఆర్థిక ఆందోళనలను ప్రభుత్వం గౌరవించాలి. రాజకీయంగా లాభం లేకపోయినా, వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతింటున్నా చంద్రబాబు ఈ అంశాన్ని వదలడం లేదు. ఇప్పుడు వస్తున్న ట్రోల్స్ తాత్కాలికమే కావొచ్చు, కానీ ఆయన చెప్పిన జనాభా సంక్షోభం నిజమైతే మాత్రం భవిష్యత్తులో ఆయనను గొప్ప ముందుచూపున్న నాయకుడిగా చరిత్ర గుర్తిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















