నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో అతి వేగంగా వచ్చిన కారు పాదచారులను ఢీకొట్టింది.
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్లో రిటైర్డ్ జవాన్! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Hyderabad Road Accident: హైదరాబాద్ శివారు నార్సింగిలో ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఒక రిటైర్డ్ ఆర్మీ జవాను ప్రాణం తీసింది.

- నార్సింగిలో వేగంగా వచ్చిన కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి.
- అతివేగంతో దూసుకొచ్చి నలుగురు పాదచారులను, రాపిడో బైక్ను ఢీకొట్టింది.
- మద్యం మత్తులో వాహనం నడిపి ఐదుగురు యువకులు వాహనాన్ని వదిలి పరారయ్యారు.
- పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Hyderabad Road Accident: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో రోడ్డు రక్తమోడుతున్నాయి. రూల్స్ అతిక్రమించి, మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న కొందరు వ్యక్తుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీస్తోంది. తాజాగా హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు గాయపడ్డారు.
ఆగస్టు10 సోమవారం ఉదయం నార్సింగి సమీపంలో హైదర్షాకోట్ ప్రదాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. శంషాబాద్ రిజిస్ట్రేషన్ కలిగి ఒక మహీంద్రా ఎస్యూవీ కారు అతి వేగంగా ప్రయాణిస్తూ రాంగ్ రూట్లోకి దూసుకొచ్చింది. ఆ సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి ఆ కారు దూసుకెళ్లింది. పాదచారులను ఢీ కొట్టిన కారు ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయింది.
ఈ ఘటనలో హైదర్షాకోట్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడి స్పాట్లోనే చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ారు బలంగా ఢీ కొట్టడంతో ఆయన గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. దీంతో తలకి తీవ్రమైన గాయమై మరణించారు. జవాన్ను ఢీ కొట్టిన అనంతరం అదే కారు రాపిడో బైక్పై వెళ్తున్న మరో ఇద్దర్ని, అలాగే మరో ఇద్దరు పాదచారులను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు గాయప్డారు. వారిని వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరికి కాలు విరిగింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో మొత్తం ఐదుగురు యువకులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
మద్యం మత్తులో చేసిన ప్రమాదం!
ప్రమాదం జరిగిన వెంటనే కారులోని యువకులు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. అయితే పారిపోయే క్రమంలో కారులో ఉన్న మద్యం బాటిళ్లను వెంట తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో నిందితులు ఫుల్గా మద్యం సేవించి ఉన్నారని అందుకే రాంగ్ రూట్లో అంత వేగంగా వాహనాన్ని నడిపారని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు లోపల లభించిన ఆధారాలు, స్థానికుల సాక్ష్యాల ప్రకారం, యువకులు ఒళ్లు తెలియని స్థితిలో ర్యాష్గా డ్రైవింగ్ చేసినట్టు తెలుస్తోంది.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. కారు నెంబర్ ఆధారంగా అది శంషాబాద్కు చెందిన వ్యక్తి కారుగా గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అతివేగంగా వాహనం నడిపి ప్రాణాలు తీసిన నిందితులపై కఠిన సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
రాజమండ్రిలో ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ జరిగిన ప్రమాదంలో ఒక వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరిగింది. ఈసారి రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి చెందారు. ఇంకో వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇలా మద్యం మత్తులో కొందరు వ్యక్తులు చేస్తున్న తప్పులు వేరే కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపుతున్నాయి. ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
Frequently Asked Questions
హైదరాబాద్లో ఇటీవల జరిగిన హిట్ అండ్ రన్ ఘటన ఎక్కడ జరిగింది?
ఈ ప్రమాదంలో ఎవరు మరణించారు మరియు ఎంత మంది గాయపడ్డారు?
ఈ దుర్ఘటనలో ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు, వారిలో ఒకరికి కాలు విరిగింది, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదానికి కారణమైన డ్రైవర్ గురించి పోలీసులు ఏమి అనుమానిస్తున్నారు?
కారులోని ఐదుగురు యువకులు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ప్రమాదం జరిగిన తర్వాత వాహనాన్ని వదిలిపెట్టి, మద్యం బాటిళ్లను వెంట తీసుకెళ్లారు.
ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
నార్సింగి పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు





















