Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Ayodhya Donation Theft Case: అయోధ్య రామాలయ విరాళాల చోరీ కుంభకోణం యూపీ ఎన్నికల వేళ బీజేపీకి తలనొప్పిగా మారింది. ఈ అవినీతిపై ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం, నిర్లక్ష్యం యోగి సర్కార్కు సమస్యగా మారుతున్నాయి.

Yogi Adityanath Action On Ram Temple Scam: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో.. అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల దుర్వినియోగం, చోరీ ఉదంతం భారతీయ జనతా పార్టీ కి ఊహించని పెద్ద రాజకీయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అయోధ్య రామాలయంలోనే నిధుల స్కామ్ వెలుగుచూడటం, అందులోనూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ముఖచిత్రాలుగా ఉన్న చంపత్ రాయ్, అనిల్ మిశ్రా వంటి వారి పేర్లు లీక్ కావడం తీవ్ర దుమారం రేపుతోంది. జా ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం జవాబుదారీతనం కి సంబంధించినదిగా కాకుండా, యూపీ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేసే సరికొత్త పొలిటికల్ మైలేజ్ గేమ్గా మారిపోయింది.
బాధ్యత ఎవరిది?
ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న.. "బాధ్యత ఎవరిది? ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు అంత జాప్యం జరిగింది?". ఆలయ నిధుల దారిమళ్లింపు చాలా కాలం క్రితమే అంతర్గతంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, ట్రస్ట్ యాజమాన్యం , స్థానిక యంత్రాంగం దీనిని తొలుత తొక్కిపెట్టే ప్రయత్నం చేశాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. మీడియాలో వార్తలు లీక్ అయి, తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమయ్యాక మాత్రమే ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఒత్తిడి తట్టుకోలేక చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు రాజీనామాలు సమర్పించడం వెనుక ఈ అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయనే అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. వివాదం దేశంలో మరికొంత మేర సామాజిక ధృవీకరణకు దారితీస్తోంది. దేవుడి సొమ్మును కూడా వదలకుండా దోచుకున్నారంటూ విపక్షాలు హిందూ సమాజంలో ఒక వర్గాన్ని బీజేపీకి వ్యతిరేకంగా తిప్పుతుంటే.. మరోవైపు ఈ స్కామ్ను అడ్డం పెట్టుకుని హిందూ వ్యతిరేక శక్తులు రామాలయ పవిత్రతను దెబ్బతీయాలని చూస్తున్నాయంటూ బీజేపీ శ్రేణులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నాయి.
ఆదిత్యనాథ్కు అగ్నిపరీక్ష
ఈ సంక్షోభం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్కు ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారింది. అవినీతి విషయంలో జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తూ, బుల్డోజర్ యాక్షన్తో పాపులర్ అయిన యోగి.. ఈ ఆలయ నిధుల స్కామ్ను ఏ విధంగా డీల్ చేస్తారనే దానిపైనే బీజేపీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. యోగి ఈ కేసులో ఎలాంటి మొహమాటాలు లేకుండా, సిట్ దర్యాప్తును వేగవంతం చేసి నిందితులతో పాటు వారికి సహకరించిన ట్రస్ట్ పెద్దలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటే.. హిందూ ఓటర్లలో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చవచ్చు. తద్వారా రాముడి సొమ్మును దోచుకుంటే సొంత మనుషులనైనా వదిలేది లేదు అనే బలమైన క్లీన్ ఇమేజ్ సందేశాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లగలరు.
కానీ, అలా కాకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఆర్ఎస్ఎస్ , వీహెచ్పీ లతో ముడిపడి ఉన్న పెద్దలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే భావన గనుక ప్రజల్లోకి వెళ్తే.. అది బీజేపీకి కోలుకోలేని రాజకీయ నష్టాన్ని మిగులుస్తుంది. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి ఈ ఇష్యూను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి దళిత, వెనుకబడిన వర్గాల భక్తుల సెంటిమెంట్లను క్యాష్ చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. గతంలో అయోధ్య అసెంబ్లీ సీటు పరిధిలోనే సమాజ్వాదీ పార్టీ బలపడిన విషయాన్ని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు కేవలం ఒక క్రైమ్ కేసో లేదా లీగల్ ఇష్యూనో కాదు.. ఇది యూపీ అసెంబ్లీ ఎన్నికల గమనాన్ని మార్చగల హై-స్టేక్స్ పొలిటికల్ డ్రామా. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల చేతికి ఇదొక బ్రహ్మాస్త్రం కానుంది. అవినీతిని కప్పిపుచ్చారనే ముద్ర పడకుండా, హిందూ ఓటు బ్యాంకు చెల్లాచెదురు కాకుండా కాపాడుకోవడానికి యోగి సర్కార్ ఇక్కడ ఎంతవరకు కఠినంగా వ్యవహరిస్తుందనే దానిపైనే లక్నో పీఠంపై తిరిగి కూర్చునే సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















