Ayodhya Ram Mandir Donation Row 2026: అయోధ్య రామందిరం నిధుల వివాదం- రాముడి విరాళాలు మాయమయ్యాయా? యోగి సర్కార్ ఏం తేల్చబోతోంది?
Yogi Adityanath SIT Probe Ayodhya: అయోధ్య రామమందిరం విరాళాలు పక్కదారి పట్టాయన్న ఆరోపణలపై యూపీ ప్రభుత్వం నియమించిన ఎస్ఐటీ దర్యాప్తుచేస్తోంది. దేవుడి నిధులు కొట్టేశారన్న ప్రచారం సంచలనంగా మారుతోంది.

Shri Ram Janmabhoomi Trust Audit: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు భక్తులు సమర్పించిన కానుకలు, నిధులు పక్కదారి పట్టాయంటూ వస్తున్న ఆరోపణలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన రాముడి ఆలయ విరాళాల్లో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, సోషల్ మీడియా వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. సమాజ్వాదీ పార్టీ , కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రతిపక్షాలు ఈ ఇష్యూపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై, రామమందిర ట్రస్ట్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
వివాదానికి కారణం ఏంటి? ప్రతిపక్షాల ఆరోపణలు!
అయోధ్య రామందిరంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలు, కోట్లాది రూపాయల విరాళాలు క్రమపద్ధతిలో మాయమయ్యాయని , ఇందులో భారీ కుంభకోణం జరిగిందని జూన్ మొదటి వారంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మ అభిమానుల నమ్మకాన్ని ఈ ఘటన దెబ్బతీసిందని, దీనిపై కోర్టు సుమోటోగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి తోడు.. కాంగ్రెస్ నేతలు అజయ్ రాయ్, దిగ్విజయ్ సింగ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సైతం రంగంలోకి దిగి.. విరాళాల నిధులతో పాటు రూ. 55 కోట్లకు పైగా భూముల కొనుగోలు వ్యవహారా కూడా భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.
రంగంలోకి యూపీ ప్రభుత్వం.. యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం
రాముడి నిధులపై వస్తున్న ఆరోపణలు అత్యంత సున్నితమైనవి కావడం, దేశవ్యాప్తంగా భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉండటంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే స్పందించారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు, విపక్షాల నోళ్లు మూయించేందుకు జూన్ మధ్యలో ఉన్నత స్థాయి ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో.. ఐజీ కిరణ్ ఎస్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ నీల్ రతన్లతో కూడిన ఈ ముగ్గురు సభ్యుల కమిటీ అయోధ్యలోనే క్యాంప్ వేసి నిశితంగా దర్యాప్తు చేస్తోంది. 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం యోగి ఆదేశించారు.
సీసీటీవీ ట్యాంపరింగ్ క్లూస్.. పోలీసుల తనిఖీల్లో దొరికిన నగదు!
SIT దర్యాప్తు ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హుండీ గదికి సంబంధించిన సిసిటివి ఫుటేజీలను కొందరు సిబ్బంది ట్యాంపరింగ్ చేసినట్లు దర్యాప్తు సంస్థ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. గత 11 నెలల్లో దాదాపు రూ. 10 కోట్లు కేవలం భద్రత కోసమే ఖర్చు చేసినప్పటికీ ఈ లూటీ జరగింది. ఈ క్రమంలోనే ఆలయానికి చెందిన లవ్ కుష్ మిశ్రా అనే ఉద్యోగితో పాటు కొందరి ఇళ్లలో తనిఖీలు చేయగా.. దాదాపు రూ. 10 లక్షల నగదు లభ్యమైంది. ప్రస్తుతం ఎస్ఐటీ బృందం దాదాపు 200 మంది అనుమానితులను, ఆలయ సిబ్బందిని విచారిస్తోంది.
రాముడి డబ్బులే కొట్టేశారన్న విమర్శలకు ట్రస్ట్ సమాధానం ఏంటి?
ఈ విమర్శలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ క్లారిటీ ఇచ్చారు. నిధులు ఎక్కడికీ పక్కదారి పట్టలేదని, అంతా సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ఆలయంలో విరాళాల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతుందని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, ట్రస్ట్ సభ్యులు సంయుక్తంగా ఈ లెక్కింపును నిర్వహిస్తారని, దీనికి సంబంధించిన ఇంటర్నల్ ఆడిట్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుందని తెలిపారు. ఈ ఆరోపణలన్నీ కేవలం మందిరం ప్రతిష్టను దెబ్బతీయడానికి రాజకీయ ప్రేరేపితంగా చేస్తున్నవేనని ట్రస్ట్ కొట్టిపారేసింది.
CM Yogi Assures Ayodhya of Uninterrupted Development Funds
— NationPress (@np_nationpress) June 19, 2026
CM Yogi Adityanath assured Ayodhya residents that the UP government will not let funds fall short, citing over ₹35,000 crore in sanctioned projects.https://t.co/r6GfPEzbi1 pic.twitter.com/VD7nhb3chZ
రాజకీయ కోణం వెనుక అసలు కథ!
అయోధ్య రామందిరం అనేది కేవలం ఒక ధార్మిక క్షేత్రం మాత్రమే కాదు.. భారతీయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన సెంటిమెంట్. అందుకే ప్రతిపక్షాలు ఈ ఇష్యూను వదిలిపెట్టడం లేదు. ఒకవేళ ఎస్ఐటీ విచారణలో చిన్న తప్పు జరిగినా అది అధికార బీజేపీకి జాతీయ స్థాయిలో పెద్ద మైనస్ అవుతుంది. అందుకే సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తూ.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తామని నమ్మకం కలిగిస్తున్నారు. విచారణ నివేదిక పూర్తిగా బయటకు వస్తేనే.. ఇందులో జరిగింది కేవలం కొందరు కిందిస్థాయి సిబ్బంది చేసిన చేతివాటమా లేక దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందా అనేది స్పష్టమవుతుందని చెబుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















