Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
Tamil Nadu Politics: అమిత్ షా ఇచ్చిన ఆఫర్లను కూడా కాదని అన్నామలై సొంత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. శుక్రవారం ఆయన పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది.

Singham Returns 2026: తమిళనాడు రాజకీయాలు ఎన్నడూ లేని విధంగా అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగాయి. ఆ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై చుట్టూ ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయ సమీకరణాలు తిరుగుతున్నాయి. జూన్ 4న ఆయన పుట్టినరోజు సందర్భంగా కోయంబత్తూరుతో పాటు తమిళనాడు వ్యాప్తంగా ఆయన మద్దతుదారులు మా నాయకుడా.. వచ్చి మమ్మల్ని నడిపించు అంటూ భారీ పోస్టర్లు వేయడం, కొత్త రాజకీయ ప్రస్థానానికి సంకేతాలు ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే, పుట్టినరోజు నాడే కొత్త పార్టీ ప్రకటన వస్తుందని అందరూ భావించినప్పటికీ, అన్నామలై ఆర్భాటాలకు పోకుండా నిశ్శబ్దాన్ని పాటించారు.
పుట్టినరోజు సందేశంలో ‘బీజేపీ’ పేరు మాయం!
అన్నామలై తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న కృతజ్ఞతా నోట్లో ఎక్కడా బీజేపీ అనే పదాన్ని కనీసం ప్రస్తావించకపోవడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. తమిళనాడులోని రైతులు, యువత, మహిళలు , సామాన్య ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం, సమాజ సంక్షేమం కోసం మరింత సమర్పణభావంతో సరికొత్త పంథాలో ముందుకు సాగుతానంటూ ఆయన పేర్కొన్నారు. పార్టీ రాజకీయాలపై పూర్తి మౌనం వహించిన ఈ లేఖ, ఆయన కమలం గూటిని వీడి సొంతంగా ‘తమిళ అస్తిత్వ’ జెండా ఎగరేయబోతున్నారనే ఊహాగానాలకు బలాన్ని చేకూర్చింది.
అమిత్ షా, మోదీల ‘స్పెషల్ ఆఫర్లు’ ఏంటి?
తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన వన్-మ్యాన్ ఆర్మీగా అన్నామలైకి గుర్తింపు ఉంది. ఆయన పార్టీని వీడితే రాష్ట్రంలో బీజేపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని గ్రహించిన అధిష్ఠానం.. జూన్ 2న ఢిల్లీలో అమిత్ షాతో దాదాపు 30 నిమిషాల పాటు అత్యవసర భేటీ నిర్వహించింది. అన్నామలైని పార్టీలోనే కొనసాగేలా చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం ఆయనకు జాతీయ స్థాయిలో పెద్దపీట వేస్తామని, కేంద్ర క్యాబినెట్లో కీలక బాధ్యతలు లేదా జాతీయ స్థాయిలో పార్టీ ప్రధాన కార్యదర్శి వంటి అత్యున్నత పదవిని ఇస్తామంటూ ‘బంపర్ ఆఫర్లు’ ముందుంచినట్లు టాక్ నడుస్తోంది. ద్రావిడ పార్టీలతో లాలూచీ పడకుండా ఒంటరిగానే పోరాడాలన్న అన్నామలై సిద్ధాంతాన్ని గౌరవిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
అధిష్ఠానం ఇచ్చిన ఈ భారీ ఆఫర్లను , రాయబారాలను అంగీకరించేందుకు అన్నామలై సిద్ధంగా లేరని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా పార్టీలోని కొందరు సీనియర్ల వైఖరి, పొత్తుల వ్యూహాలు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వంటి విషయాల్లో హైకమాండ్ వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బిజెపితో గౌరవప్రదంగానే విడిపోయి , తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ గుర్తింపును చాటుకోవాలని ఆయన భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
ద్రవిడ వర్సెస్ ద్రవిడేతర రాజకీయం
డిఎంకె , అన్నాడిఎంకె ల మార్కు ద్రావిడ రాజకీయాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే.. జాతీయ పార్టీ ముద్ర తన ఎదుగుదలకు అడ్డంకిగా మారుతోందని అన్నామలై విశ్లేషిస్తున్నట్లు సమాచారం. అందుకే, అచ్చమైన తమిళ సంస్కృతి, యువత ఆకాంక్షలు, అవినీతి రహిత పాలనను అజెండాగా పెట్టుకుని ఒక ప్రాంతీయ పార్టీని స్థాపిస్తే, తమిళ జనం బ్రహ్మరథం పడతారని ఆయన నమ్ముతున్నారు. ఢిల్లీ పెద్దలతో భేటీ ముగిసిన తర్వాత కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదని, సొంత పార్టీ పెట్టేందుకే మొగ్గు చూపుతున్నారని తమిళ మీడియా గట్టిగా నొక్కిచెబుతోంది.
చెన్నై వేదికగా క్లైమాక్స్!
ఇక ఈ పొలిటికల్ సస్పెన్స్ అన్నింటికీ శుక్రవారం తెరపడనుంది. జూన్ 5న చెన్నైలో అన్నామలై ఒక ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణను , సరికొత్త పొలిటికల్ పార్టీ వివరాలను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రోజులు ఓపిక పట్టండి, అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇస్తాను అని ఆయన ఇప్పటికే మీడియాకు స్పష్టం చేశారు. ఒకవేళ ఢిల్లీ పెద్దల ఒత్తిడికి లొంగి బీజేపీలోనే ఉండిపోతారా.. లేదా అడ్డంకులను బద్దలు కొడుతూ ‘తమిళనాడు సింగం సరికొత్త పార్టీతో సింహగర్జన చేయబోతుందా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















