Tungabhadra Dam New Gates Inauguration 2026: తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్ కొత్త క్రెస్ట్ గేట్ల ప్రారంభోత్సవానికి జూన్ 25న ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు. గతేడాది 19వ గేట్ కొట్టుకుపోయిన ఘటన తర్వాత 33 గేట్ల మార్పిడి పూర్తి చేశారు.

Tungabhadra Dam Meeting: రాజకీయాల్లో అత్యంత అరుదైన, చారిత్రాత్మక ఘట్టానికి కృష్ణానది ఉపనది అయిన తుంగభద్ర వేదిక కాబోతోంది. గతేడాది చోటుచేసుకున్న ఒక ఊహించని జల విపత్తును సవాల్గా తీసుకున్న ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు.. రికార్డు సమయంలో డ్యామ్ రూపురేఖలనే మార్చేశాయి. కేవలం ఒకే ఒక్క ఆఫ్-సీజన్ వ్యవధిలోనే జలాశయానికి ఉన్న మొత్తం 33 క్రెస్ట్ గేట్లను అత్యంత విజయవంతంగా పునరుద్ధరించాయి. ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ.. జూన్ 25న మునిరాబాద్ కొప్పల్ వద్ద నిర్వహించబోయే తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభోత్సవ వేడుక కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అధికారికంగా ఆహ్వానించేందుకు కర్ణాటక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సోమవారం ఏపీ సచివాలయానికి వచ్చింది.
గతేడాది ఆగస్టు 10న అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదం కారణంగా తుంగభద్ర డ్యామ్ 19వ నంబర్ క్రెస్ట్ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో.. వరద ఉధృతికి ఆ గేట్ కొట్టుకుపోయింది. ఆ సమయంలో జలాశయం నుంచి దాదాపు 35,000 క్యూసెక్కుల నీరు వృధా అయింది. దీంతో రాయలసీమ, కర్ణాటక రైతాంగంలో తీవ్ర గుండెకోత మిగిలింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడే మకాం వేయగా.. సుప్రసిద్ధ నిపుణుడు కన్నయ్యనాయుడు బృందం యుద్ధప్రాతిపదికన శ్రమించి తాత్కాలిక స్టాప్-లాక్ గేటును అమర్చింది. దాంతో దాదాపు 80 టీఎంసీల నీటిని కాపాడగలిగారు. అయితే డ్యామ్ గేట్లు 70 ఏళ్ల క్రితం నాటివి కావడం, వాటి కాలపరిమితి ముగిసిపోవడంతో.. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మొత్తం 33 గేట్లను మార్చాలని తుంగభద్ర బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ భారీ ప్రాజెక్టును అహ్మదాబాద్కు చెందిన హార్డ్వేర్ టూల్స్ అండ్ మెషినరీ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థకు సుమారు రూ. 51 కోట్ల వ్యయంతో అప్పగించారు. గతేడాది డిసెంబర్ 24న పాత గేట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కాగా.. కేవలం 123 రోజుల రికార్డు కాలంలోనే, అంటే ఈ ఏడాది ఏప్రిల్ 25 నాటికే కొత్త గేట్ల అమరిక పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. వర్షాకాలం ప్రారంభమై పశ్చిమ కనుమల నుంచి వరద నీరు జలాశయానికి వచ్చేలోపే ఈ పనులన్నీ పూర్తి చేశారు. దీనివల్ల రాబోయే సీజన్లో పూర్తి స్థాయిలో 105 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు డ్యామ్ సురక్షితంగా సిద్ధమైంది.
జూన్ 25న జరగబోయే ఈ భారీ నూతన గేట్ల ప్రారంభోత్సవ వేడుక కేవలం ఒక ప్రాజెక్ట్ ఓపెనింగ్ మాత్రమే కాదు.. మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల వేదికగా మారనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు సంయుక్తంగా ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, తుంగభద్ర జలాశయ నీటి భాగస్వామ్యం, నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటుపై ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై చర్చించే అవకాశం ఉందని కర్ణాటక వర్గాలు తెలిపాయి.
ఈ 33 కొత్త గేట్ల ఏర్పాటుతో.. ఇటు కర్ణాటకలోని బళ్లారి, కొప్పల్, రాయచూర్, విజయనగర జిల్లాలే కాకుండా.. అటు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని సుమారు 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత సాగునీటి భద్రత లభించనుంది. తెలంగాణలోని మహబూబ్నగర్ పరిధిలోని ఆయకట్టుకు సైతం ఊరట లభించనుంది. దశాబ్దాల కాలపరిమితి ముగిసిన డ్యామ్ గేట్లను మార్చడం ద్వారా రాబోయే 50-60 ఏళ్ల పాటు రైతులకు నీటి ఢోకా లేకుండా భద్రత కల్పించినట్లయింది. ప్రమాదాన్ని అవకాశంగా మార్చుకుని, రికార్డు టైమ్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ఇరు రాష్ట్రాల రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















