Kerala food services shutdown: ఆకలితో అలమటిస్తున్న కేరళ పర్యాటకలు - అన్ని హోటళ్లూ మూసేశారు - కారణం ఇదే
Kerala: కేరళలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లతో పాటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు కూడా బుధవారం ఉదయం నుండి నిలిచిపోయాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడానికి నిరసనగా ఈ బంద్ చేశారు.

Kerala food services shutdown LPG price hike protest : వాణిజ్య అవసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపును నిరసిస్తూ కేరళ వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు చేపట్టిన 24 గంటల సమ్మె రాష్ట్రవ్యాప్తంగా ఆహార సేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బుధవారం జరిగిన ఈ బంద్తో వేల సంఖ్యలో ప్రయాణికులు, సామాన్యులు ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కేరళ వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ల బంద్
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల భారానికి వ్యతిరేకంగా కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ పిలుపునిచ్చిన 24 గంటల సమ్మె రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లతో పాటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు కూడా బుధవారం ఉదయం నుండి నిలిచిపోయాయి. కేవలం ఆసుపత్రి క్యాంటీన్లు, కొన్ని చిన్న బడ్జెట్ హోటళ్లను మినహాయించి దాదాపు అన్ని చోట్ల నో సర్వీస్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఫలితంగా పర్యాటకులు, రోజూవారీ ప్రయాణికులు , బ్యాచిలర్లు భోజనం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఎల్పీజీ ధరల మోత.. రూ. 3,000 మార్కు దాటిన సిలిండర్
మే 1వ తేదీ నుండి 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్పై కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 993 పెంచడంతో కేరళలో దీని ధర రూ. 3,150 దాటింది. కొచ్చి వంటి నగరాల్లో బ్లాక్ మార్కెట్లో దీని ధర రూ. 3,400 వరకు పలుకుతోందని వ్యాపార వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత కొన్ని నెలల్లోనే సిలిండర్ ధర సుమారు రూ. 1,400 మేర పెరగడం వల్ల హోటల్ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని, ధరలను పెంచక తప్పని స్థితిలో ఉన్నామని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
నిరసన వెనుక ఉన్న ప్రధాన కారణాలు
కేవలం గ్యాస్ ధరలే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కార్మిక వ్యయాలు కూడా హోటల్ యజమానులపై పెను భారాన్ని మోపుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎర్నాకుళంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిర్వహించిన భారీ ధర్నాను కేహెచ్ఆర్ఏ రాష్ట్ర అధ్యక్షుడు జి. జయపాల్ ప్రారంభించి, ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధమని హెచ్చరించారు.
ప్రత్యామ్నాయం లేని పరిస్థితి
ఈ సమ్మెకు కేరళ వ్యాపారులు, ఆల్ కేరళ క్యాటరర్స్ అసోసియేషన్ , హాస్టల్ ఓనర్స్ ఫెడరేషన్ వంటి కీలక సంస్థలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలోని సుమారు 60,000 మంది సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ధరల పెంపు వల్ల సామాన్యుడిపై భారం పడకూడదంటే ప్రభుత్వం సబ్సిడీని పునరుద్ధరించాలని లేదా పన్ను భారాన్ని తగ్గించాలని వారు కోరుతున్నారు. బంద్ కారణంగా రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక కేంద్రాలైన మున్నార్, అలప్పుజ , కోవలం వంటి చోట్ల పర్యాటకులు ఆహారం కోసం అల్లాడారు.
ఆందోళనలో పర్యాటక రంగం
కేరళ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే వెన్నెముక. ఇటువంటి ఆహార సేవల బంద్ల వల్ల అంతర్జాతీయ పర్యాటకుల ముందు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యాటక సీజన్ కొనసాగుతున్న తరుణంలో గ్యాస్ ధరల పెంపు వల్ల భోజనాల ధరలను 20-30 శాతం పెంచాలని హోటల్ అసోసియేషన్ భావిస్తోంది. అదే జరిగితే కేరళ పర్యటన సామాన్యుడికి మరింత భారం కానుంది. తక్షణమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కేరళ వ్యాపారులు కోరుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















