Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Gandipet Land Scam Case: గండిపేట భూ కుంభకోణం కేసులో వైసీపీ నేత బొల్లాకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫోర్జరీ పత్రాలు, నకిలీ జీవోల సృష్టికి సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టు వివరాలు

YSRCP Former MLA Arrested: హైదరాబాద్ శివారు గండిపేట పరిధిలో రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను నకిలీ పత్రాల ద్వారా కాజేయడానికి ప్రయత్నించారనే ఆరోపణల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శనివారం పోలీసులు ఆయన్ను భారీ భద్రత నడుమ ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జూన్ 20 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు.
కేసు నమోదయ్యాక బ్రహ్మనాయుడు పరారీ
రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామం సర్వే నంబర్ 18 లోని సుమారు 10 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. ఈ ల్యాండ్ స్కామ్లో నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు , ఫోర్జరీ రెవెన్యూ రికార్డులను సృష్టించి ప్రభుత్వ ఆస్తిని కాజేయడానికి ప్రయత్నించారు. స్థానిక తహశీల్దార్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు గత నెలలో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు కాగానే బొల్లా బ్రహ్మనాయుడు పరారయ్యారు.
కాంచీపురంలో అరెస్ట్
బ్రహ్మనాయుడు అరెస్ట్ కోసం సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ , నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచి కేరళ, కర్ణాటక మీదుగా ప్రయాణించిన ఆయన, చివరకు తమిళనాడులోని కాంచీపురంలో తలదాచుకున్నట్లు పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. శుక్రవారం అక్కడ ఆయన్ను సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో అరెస్ట్ చేసి, అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు బొల్లా బ్రహ్మనాయుడుతో కలిపి మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ.12 కోట్ల లావాదేవీలు
పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలకమైన అంశాలను వెల్లడించారు. ఈ వేల కోట్ల భూమిని అక్రమంగా దక్కించుకునేందుకు ,నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేయించుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. నకిలీ జీవోల తయారీకి, ప్రభుత్వ అనుమతుల ఫోర్జరీ కోసం ఈ కుట్రకు సూత్రధారి అయిన రాధాకృష్ణ అనే వ్యక్తికి బ్రహ్మనాయుడు పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నకిలీ పత్రాల సృష్టి , లావాదేవీల వెనుక దాదాపు రూ. 12 కోట్ల మేర ఆర్థిక మూలాలు ఉన్నట్లు బ్యాంక్ అకౌంట్ల పరిశీలనలో నిర్ధారణ అయింది.
ఇంకా పరారీలోనే బ్రహ్మనాయుడి కుమారుడు
ఈ హైప్రొఫైల్ భూ కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా రమేష్ తో పాటు మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నకిలీ పత్రాల సృష్టిలో కీలక పాత్ర పోషించిన మరికొందరు రెవెన్యూ విభాగపు వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులను కూడా విచారించేందుకు బ్రహ్మనాయుడిని పోలీస్ కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు త్వరలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Before You Go
కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా
ట్రెండింగ్ వార్తలు





















