Tirupati Crime News: లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు.. పిల్లలకు ఉరేసి, తల్లి ఆత్మహత్య.. తిరుపతిలో కన్నీళ్లు పెట్టించే ఘటన
Woman Suicide | తిరుపతి జిల్లాలో విషాదం చోటుచసుకుంది. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోగా, అప్పులు చేస్తూ పోతున్నాడు. దాంతో ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య చేసుకుంది.

తిరుపతి జిల్లా పుత్తూరులో గుండెలు పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యత లేకుండా తిరగడంతో పాటు దొరికిన చొటల్లా అప్పులు చేయడంతో మనస్తాపం చెందిన పద్మ(28) అనే వివాహిత, తన ఇద్దరు కుమార్తెలు తేజ(6), లాస్య(5)లను ఉరేసి చంపి, ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకున్న తన జీవితం ఇతరులకు ఒక గుణపాఠం కావాలని ఆమె రాసిన సూసైట్ నోట్ ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. జిల్లాలోని పుత్తూరు మండలం నేషనూరుకు చెందిన పద్మ, శివశంకర్లు డిగ్రీ చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. శివశంకర్ తో పెళ్లికి పద్మ తల్లిదండ్రులు నిరాకరించారు. అతడు ఏ పని లేకుండా తిరుగుతున్నాడని, కులాలు సైతం వేరు అని పద్మను పెద్దలు మందలించారు. కానీ పెద్దలను ఎదిరించి 2019లో పద్మ, శివశంకర్ వివాహం చేసుకున్నారు.
పెళ్లి తరువాత మారని భర్త.. భారీగా అప్పులు
సాధారణంగా బాధ్యత లేకుండా ఉండే వారు పెళ్లయ్యాక సెట్ అవుతారని పెద్దలు చెబుతుంటారు. కానీ అందరి విషయంలో అది నిజం కాదని పద్మ ఘటనే నిరూపించింది. పెళ్లయ్యాక కూడా శివశంకర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. జాబ్ చేయడం లేదు. ఏ పని చేయకపోగా వీలున్న చోటల్లా అప్పులు చేస్తూ వచ్చాడు. ఇద్దరు పిల్లలు తేజ, లాస్యలు పుట్టినా భార్యను, పిల్లల బాధ్యత తీసుకోలేదు. ఇంటి అద్దె చెల్లించడానికి, మరోవైపు పిల్లల స్కూలు ఫీజుల కోసం పద్మ ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ప్రస్తుతం వీరు పిల్లల చదువుల కోసం పుత్తూరులో నివాసం ఉంటున్నారు.
డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉన్న ఆమె కొంత లోన్ తీసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి శివశంకర్ ను మందలించగా కుటుంబాన్ని పోషిస్తానని, బాధ్యతగా ఉంటానని చెప్పాడు. కానీ తీసుకున్న అప్పును భర్త తీర్చకపోవడం, పిల్లలకు స్కూల్ ఫీజులు, వారి పోషణ సైతం బారంగా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంటి నుంచి వెళ్లిన భర్తను అప్పు గురించి అడకడంతో చెల్లించలేదని చెప్పాడు. దాంతో అవమాన భారాన్ని తట్టుకోలేక, పిల్లల్ని పోషించలేక పద్మ కఠిన నిర్ణయం తీసుకుంది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు కూతుళ్లకు చీరతో ఉరేసింది. తరువాత తాను హాల్లో ఉరేసుకుని చనిపోయింది. ఇంటికి వచ్చిన భర్తకు డోర్ తెరవకపోవడంతో అనుమానం వచ్చి మామకు ఫోన్ చేశాడు. ఆయన వచ్చాక తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురు చనిపోయి కనిపించారు. పోలీసులు శివశంకర్ ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
కష్టాలు వివరిస్తూ సూసైడ్ నోట్..
పెద్దల్ని ఎదరించి ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అమ్మాయికి అస్సలు నచ్చని లక్షణాలన్నీ నా భర్తకు ఉన్నాయి. పిల్లలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. అప్పులు తీర్చకపోతే, కుటుంబాన్ని పోషించకపోతే నేనేం చేయాలి. ఇక ఉంటాను. నేను చనిపోయాక మళ్లీ పెళ్లి చేసుకుంటావు, అయితే సెటిల్ అయ్యాక చేసుకో అని పద్మ సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది.
























