Rayavaram Tiger Mystery: 4 గంటలు పక్కనే ఉన్నా, పశువులకు హాని చేయని పులి.. కూర్మాపురంలో ఘటన
గుడిసెలో నాలుగు గంటలు ఉన్నా పక్కనే ఉన్న పశువులకు పులి ఎలాంటి హాని చేయలేదని తూర్పు గోదావరి జిల్లా డి ఎఫ్ వో ప్రభాకర రావు శనివారం నాడు వెల్లడించారు.

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో పులి శుక్రవారం రాత్రి ఒక గుడిసె ఇంట్లోకి ప్రవేశించింది. పులి సుమారు నాలుగు గంటల పాటు అక్కడే, అదే పాకలో ఉన్నప్పటికీ.. సమీపంలో ఉన్న రెండు గేదెలకు ఎలాంటి హాని కలగజేయలేదని జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
గ్రామంలో ఉన్న పశువులను లేదా ప్రజలను పులి ఎలాంటి విధంగా హానిచేయకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. పులి ప్రవర్తనలో సహజ వన్యప్రాణి లక్షణాలు స్పష్టంగా కనిపించాయని, ఇది వన్యప్రాణుల పరిరక్షణకు ఒక మంచి ఉదాహరణగా నిలిచిందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా అటవీ శాఖ సేకరించిందని ఆయన తెలిపారు.
ఈ ఘటన తెలియడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందకుండా, అటవీ శాఖ, పోలీసు సిబ్బంది సూచనలను పాటించాలని జిల్లా అటవీ అధికారి కోరడం, వారు సహకరించడం జరిగిందన్నారు. గ్రామంలో నిరంతర నిఘా వ్యవస్థ కొనసాగింపు, ఆ మేరకు పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచామని ఆయన తెలిపారు.
ముగిసిన పులి ఎపిసోడ్..
తూర్పుగోదావరి జిల్లాను గత 15 రోజులుగా వణికించిన రాయవరం పులి ఎపిసోడ్ ఎట్టకేలకు సుఖాంతమైంది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఒక పాడుబడిన పాత ఇంట్లో నక్కిన బెంగాల్ టైగర్ను అటవీ శాఖ అధికారులు, పోలీసులు చాకచక్యంగా బంధించారు. ప్రత్తిపాడు, అనపర్తి పరిసరాల్లో సంచరించిన ఈ పులిని పట్టుకోవడానికి అధికారులు తొలుత ఎర వేసినా ఫలితం లేకపోవడంతో, 'ప్లాన్-బి' అమలు చేశారు.

పాడుబడిన ఇంటి పైకప్పుకు రంధ్రం చేసి, డ్రోన్ కెమెరాల సాయంతో పులి కదలికలను నిశితంగా గమనించారు. పులి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా, షూటర్లు గురి తప్పకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. కొద్దిసేపటికే అది స్పృహ కోల్పోవడంతో, నెట్ సహాయంతో సురక్షితంగా బంధించి ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ భారీ ఆపరేషన్ విజయవంతం కావడంతో కూర్మాపురం గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
























