Nara Lokesh: భారత క్వాంటమ్ టెక్నాలజీకి పునాది అమరావతి క్వాంటమ్ వ్యాలీ.. రాష్ట్రానికి 3 బలాలు, భారీ ఉద్యోగాలు: నారా లోకేష్
Amaravati Quantum Valley | భారత క్వాంటమ్ టెక్నాలజీకి పునాది అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని, ఫ్రంటియర్ ఇన్నోవేషన్ సృష్టికర్తగా ఆంధ్రప్రదేశ్ ను నిలబెడతామని మంత్రి నారా లోకేష్ అన్నారు.

అమరావతి: ఇది కేవలం సాధారణ భూమిపూజ కార్యక్రమం కాదు. ఈరోజు అమరావతిలో భారతదేశ క్వాంటమ్ టెక్నాలజీలలో భవిష్యత్ నాయకత్వానికి పునాది వేస్తున్నామని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మూడు బలాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమరావతిలో చరిత్రాత్మక క్వాంటమ్ వ్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా క్వాంటమ్ వ్యాలీలో తమ సంస్థల ఏర్పాటుకు 14 సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచం సాఫ్ట్వేర్ సేవల సామర్థ్యాన్ని అర్థం చేసుకుంటుండగానే... భారత్లో దూరదృష్టి గల ఒక సమర్థనేత ధైర్యవంతమైన ప్రశ్న వేశారు. హైదరాబాద్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ క్యాపిటల్గా ఎందుకు మార్చలేం అన్న ఆ ఒక్క ప్రశ్న చరిత్రనే మార్చింది. అది మైక్రోసాఫ్ట్తో పాటు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను హైదరాబాద్కు తీసుకొచ్చింది. దేశంలో లక్షలాది ఉద్యోగాలు సృష్టించింది. అది ఒక నగరాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ చిత్రపటంలో భారతదేశ ఐటీ విప్లవానికి నాంది పలికింది.

చాట్జీపీటీ ద్వారా క్వాంటమ్ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం..
ఈ రోజు డీప్ టెక్నాలజీస్, మరెన్నో గొప్ప అవకాశాలను సృష్టించే సమయంలో ఆయన మళ్లీ మరో ప్రశ్న వేశారు. క్వాంటమ్ విప్లవాన్ని భారత్ ఎందుకు అనుసరించాలి? దేశమే దానిని ఎందుకు ముందుండి నడిపించకూడదు అని. ఆ ప్రశ్నకు సమాధానమే అమరావతి క్వాంటమ్ వ్యాలీ. సీఎం చంద్రబాబు మొదటిసారిగా కేబినెట్ సమావేశాల్లో క్వాంటమ్ వ్యాలీ గురించి చర్చించినప్పుడు, చాలా మంది మంత్రులం ఇంటికి వెళ్లి చాట్జీపీటీ ద్వారా క్వాంటమ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఇతరులు క్వాంటమ్ గురించి చర్చిస్తున్న సమయంలోనే చంద్రబాబు భారత్ క్వాంటమ్ టెక్నాలజీని ఎలా ముందుకు నడిపించాలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సమర్థ నాయకత్వం, దూరదృష్టికి ఇది నిదర్శనం.

ఏపీకి ఉన్న 3 బలాలు ఇవే..
ఏపీకి మూడు బలాలు ఉన్నాయి. అందులో మొదటిది నిరూపితమైన సమర్థ నాయకత్వం. సీబీఎన్ విజన్, బ్రాండ్, విశ్వసనీయత ఈ రోజు ప్రపంచస్థాయి గుర్తింపు పొందాయి. పెట్టుబడిదారులు హామీలను పొందడమేగాక చరిత్రను చూస్తారు. రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇందుకు రెండు స్పష్టమైన ఉదాహరణలు ఇస్తాను. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని సాధించేందుకు మేము 12 నెలలు లక్ష్యం పెట్టుకుని 13 నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం. రెండవది అర్సెలార్ మిట్టల్ ప్రాజెక్ట్ కేవలం ఒక సంవత్సరంలో సాకారం చేశాం. దేశంలోని ఇతర ప్రాంతాల్లో అసాధ్యం అనుకున్నది ఇక్కడ సాధ్యమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఆయా సంస్థలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై నిర్ధిష్ట హామీ, వేగం, స్పష్టత, జవాబుదారీతనంతో ముందుకు సాగింది.

ఏదైనా ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్కు వచ్చాక అది ఆ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ కాదు. మా సొంత ప్రాజెక్ట్ గా భావించి బాధ్యత తీసుకుంటాం. వారితో కలిసి పనిచేస్తూ అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి ప్రాజెక్టు స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు, అనుమతులు కల్పిస్తాం. మూడవది అత్యంత కీలకమైనది. ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ రాష్ట్రం. పెట్టుబడుల ఆకలితో ఉన్న మేం ఉత్సాహంగా, వేగవంతంగా ప్రణాళికలు అమలుచేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం.

సాంకేతిక ఆవిష్కరణ సృష్టికర్తగా ఏపీ
ప్రపంచంలోనే మొట్టమొదటిగా అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టి క్వాంటమ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, అల్గారిథమ్ లు, ఉత్పత్తులు, ఎగుమతులు, ప్రతిభావంతులకు శిక్షణ అన్నీ ఒకేచోట ఉండేలా దీనికి డిజైన్ చేశాం. ఈ సంకల్పం ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ వినియోగదారుగా కాకుండా, భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యున్నత సాంకేతిక ఆవిష్కరణ సృష్టికర్తగా నిలబెడుతుంది. అమరావతిని ప్రపంచంలోని 5 అత్యున్నత క్వాంటమ్ హబ్లలో ఒకటిగా ఉంచడమే మా ధ్యేయం. ఆంధ్రప్రదేశ్లో తయారైన క్వాంటమ్ కంప్యూటర్లు, కాంపోనెంట్లను ప్రపంచానికి ఎగుమతి చేయాలన్నది మా లక్ష్యం. మన యువతకు ప్రస్తుతం మాత్రమే కాకుండా.. భవిష్యత్ లో కూడా నిలకడైన ఉపాధి, ఆదాయం, ప్రపంచస్థాయి నైపుణ్యాలతో కూడిన వేలాది ఉద్యోగాలు కల్పించడం మా సంకల్పం.

భారత డీప్ టెక్ ప్రయాణానికి స్థిరమైన ప్రోత్సాహం, వ్యూహాత్మక మద్దతు అందిస్తున్న ప్రధాని మోడీకి మా కృతజ్ఞతలు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్, నేషనల్ క్వాంటమ్ మిషన్ కు మా ధన్యవాదాలు. మేము క్వాంటమ్ మజిలీని ప్రారంభించేటప్పుడు మాకు అన్నివిధాలా సహకారం అందించిన మద్రాసు ఐఐటీ డైరెక్టర్ కామకోటికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చారిత్రక ప్రయాణంలో వారు ఆంధ్రప్రదేశ్తో కలిసి నిలబడ్డారు. క్వాంటమ్ వ్యాలీ ఒక కాన్సెప్ట్ కాదు, అది ఇప్పటికే అమలులో ఉంది. అయితే భారత్లోని అత్యాధునిక 133-క్యూబిట్ ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ ఇక్కడ ఆవిష్కృతం కాబోతోందని నారా లోకేష్ అన్నారు.

దేశంలో తొలి నేషనల్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ
భారత్లో మొదటి నేషనల్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ అమరావతిలో స్థాపితమవుతోంది. సూపర్ కండక్టింగ్, ఫోటానిక్, ఐయాన్ ట్రాప్, న్యూట్రల్ ఆటమ్ టెక్నాలజీలతో బహుళ ప్లాట్ఫారమ్లు ఇక్కడ కో-డెవలప్ చేయబడుతున్నాయి. 50 వేల మంది లెర్నర్లు ఇప్పటికే శిక్షణ పొందుతున్నారు. 10 లక్షల మంది యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం మా దీర్ఘకాలిక లక్ష్యం. ఇది టెక్నాలజీ లీప్ఫ్రాగ్. మన ఇండస్ట్రీ పార్ట్నర్లు IBM, TCS, L&T, SRM యూనివర్సిటీ, QpiAI, QClairvoyance, MoUలు సంతకం చేసిన అన్ని కంపెనీలకు ధన్యవాదాలు. గ్లోబల్ ఇండస్ట్రీ అమరావతిని నమ్ముతోందని రుజువైంది.

ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ భారీ స్థాయిలో హై క్వాలిటీ ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇది క్వాంటమ్ ఇంజనీర్లు, అడ్వాన్స్డ్ AI, కంప్యూటింగ్ స్పెషలిస్టులు, చిప్ డిజైనర్లు, క్రయోజెనిక్స్ ఎక్స్పర్టులు, RF ఇంజనీర్లు, స్టార్టప్ ఫౌండర్లు, డీప్ టెక్ రీసెర్చర్లకు అవకాశాలను కల్పిస్తుంది. ఇది ఫ్యూచర్-ప్రూఫ్ ఉద్యోగాలు సృష్టించే మార్గం. ఇదే మన యువత అడ్వాన్స్డ్ టెక్నాలజీని కేవలం ఉపయోగించకుండా దాని నిర్మాతలుగా మలిచే మార్గం.

అమరావతి కేవలం అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ సిటీ మాత్రమే కాదు. అమరావతి సైన్స్, కంప్యూటేషన్, ఇన్నోవేషన్ క్యాపిటల్ సిటీగా రూపాంతరం చెందబోతోంది. క్వాంటమ్, డీప్ టెక్, ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ దాని గుర్తింపును నిర్వచిస్తోంది. ఇది గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించే నగరం. ఇది కేవలం సేవలు మాత్రమే కాకుండా, అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ప్రపంచానికి ఎగుమతి చేసే నగరం. హైదరాబాద్ భారత ఐటీ విప్లవానికి నాయకత్వం వహించినట్లుగానే విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో అమరావతి భారత క్వాంటమ్ విప్లవాన్ని ముందుండి నడిపించబోతోంది. ఇండస్ట్రీ, అకాడమియా, స్టార్టప్ల భాగస్వామ్యంతో తదుపరి సాంకేతిక శకానికి నేతృత్వం వహించడానికి ఏపీ సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
























