Hyderabad: విడాకులు ఇచ్చిందని మాజీ భార్యను హత్య చేసిన వ్యక్తి - అది కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చి !
Wife Murder: ఆస్ట్రేలియా నుంచి వచ్చి మాజీ భార్యను హత్య చేశాడో వ్యక్తి. హైదరాబాద్ వనస్థలిపురంలో ఈ ఘోరం జరిగింది

Man kills ex wife: హైదరాబాద్ వనస్థలిపురంలో బుధవారం పట్టపగలే సాఫ్ట్వేర్ ఇంజినీర్ సునీత దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. పది నెలల క్రితం విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న పగతో మాజీ భర్త మహేశ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అత్యంత కిరాతకంగా సునీత ప్రాణాలు తీయడమే కాకుండా, అడ్డువచ్చిన వారిని చంపేందుకు పెట్రోల్ డబ్బా, కట్టర్తో వచ్చి భీభత్సం సృష్టించాడు.
ప్రేమ వివాహం నుంచి విడాకుల వరకు..
సునీత, మహేశ్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. గతంలో వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ ఎన్నారైలుగా స్థిరపడ్డారు. అయితే, అక్కడ వారి మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు మొదలయ్యాయి. వేధింపులు భరించలేక సునీత ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు తిరిగొచ్చేసింది. పది నెలల క్రితం మహేశ్కు అధికారికంగా విడాకులు ఇచ్చి, శ్రీనాథ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.
పక్కా ప్లాన్తో మాజీ భర్త అటాక్..
సునీత రెండో పెళ్లిని మహేశ్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను అంతమొందించాలనే పగతో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మహేశ్, బుధవారం మధ్యాహ్నం వనస్థలిపురంలోని శ్రీనాథ్ సొంత ఫ్లాట్కు చేరుకున్నాడు. నిందితుడు మహేశ్ రాక మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. తనతో పాటు రెండు పదునైన కత్తులు, కట్టర్ , పెట్రోల్ డబ్బాను వెంట తెచ్చుకున్నాడు. లోపలికి ప్రవేశించిన వెంటనే సునీతపై కిరాతకంగా దాడి చేశాడు. సునీత నాలుగు నెలల గర్భిణి. ఆమె గర్భిణీ అని కూడా చూడకుండా కత్తులతో తలపై, శరీర భాగాలపై విచక్షణారహితంగా నరికి చంపేశాడు. ప్రస్తుతం సునీత నాలుగు నెలల గర్భిణీ. మరో ప్రాణం తనలో పెరుగుతున్న వేళ, పాత కక్షలతో మాజీ భర్త ఆమె ఊపిరి తీశాడు. అరుపులు విని లోపలికి రావడానికి ప్రయత్నించిన ఇరుగుపొరుగు వారిని కూడా మహేశ్ బెదిరించాడు. ఎవరైనా లోపలికి వస్తే పెట్రోల్ పోసి నిప్పంటిస్తానని హెచ్చరించాడు. రక్తపు మడుగులో సునీత పడిపోయిన తర్వాతే అక్కడి నుంచి బయటకు వచ్చాడు.
పోలీసుల దర్యాప్తు
విషయం తెలుసుకున్న సునీత భర్త శ్రీనాథ్ కన్నీరుమున్నీరుగా ఇంటికి చేరుకున్నాడు. వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. నిందితుడు మహేశ్ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన స్థానిక గ్రీన్సిటీ కాలనీ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.























