Ketan Agarwal Lohagad Fort death case: కేతన్ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Siya Goyal polygraph test: పుణె కేతన్ అగర్వాల్ మృతి చెందిన కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సియా గోయల్కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Ketan Agarwal case: మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోహగడ్ కోట వద్ద లోయలో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేతన్ అగర్వాల్ మృతి చెందిన కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో అనుమానితురాలిగా ఉన్న సియా గోయల్ ఐదు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో, పుణె రూరల్ పోలీసులు ఆమెను వడ్గావ్ మావల్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, కేతన్ అగర్వాల్ను కోటపై నుంచి అసలు ఎవరు నెట్టారు? అనే దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన, ప్రత్యక్ష ఆధారాలు లభించలేదని పోలీసులు కోర్టుకు నివేదించడం ఈ కేసులో తీవ్ర సంచలనంగా మారింది.
ఈ కేసు విచారణలో నిందితురాలు సియా గోయల్ పోలీసులకు అస్సలు సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెబుతోందని పోలీసులు అంటున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, ఇద్దరి మొబైల్ డేటా విశ్లేషణ ఆధారంగా ఆమె నిజాలు దాస్తోందని భావిస్తున్న పోలీసులు.. కోర్టు ముందు కీలక ప్రతిపాదన పెట్టారు. ఈ కేసులోని అసలు గుట్టును, కుట్రను విరబోయాలంటే ప్రధాన నిందితురాలైన సియా గోయల్కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని, అందుకు అనుమతించాలని కోర్టును కోరారు.
పుణె పోలీసుల కథనం ప్రకారం.. కేతన్, సియా ఇద్దరూ లోహగడ్ కోటను సందర్శించిన సమయంలో కేతన్ కో లోయలోకి పడి మరణించాడు. పోలీసుల దర్యాప్తులో సియా గోయల్ ఆమె ప్రియుడి చేతన్ చౌదరితో కలిసి కుట్ర చేసి చంపేసిందని తేలింది. కానీ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. పాలిగ్రాఫ్ పరీక్ష ద్వారా సియా మానసిక స్థితిని, ఆమె చెబుతున్న సమాధానాల్లోని నిజానిజాలను శాస్త్రీయంగా విశ్లేషించవచ్చని దర్యాప్తు బృందం భావిస్తోంది.
మరోవైపు, ఈ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహణపై కోర్టు నిందితురాలు సియా గోయల్ న్యాయపరమైన సమ్మతిని కోరింది. చట్టప్రకారం నిందితురాలి అనుమతి లేకుండా ఇలాంటి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కానందున, దీనిపై తదుపరి విచారణలో కోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతానికి సియా గోయల్కు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. లోహగడ్ కోట వంటి పర్యాటక ప్రాంతాల్లో రక్షణ లోపాలు, సిసిటివి కెమెరాలు లేకపోవడం వల్లే ఇలాంటి కేసుల్లో డిజిటల్ ఆధారాలు సేకరించడం పోలీసులకు సవాలుగా మారిందనే విమర్శలు కూడా వస్తున్నాయి.
ఐటీ కారిడార్ అయిన పుణెలో ఈ కేతన్ అగర్వాల్ మృతి ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఒక యువ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోవడానికి వెనుక ఉన్న బలమైన కారణాలను బయటకు తీయాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కోర్టు గనుక పాలిగ్రాఫ్ పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ లోహగడ్ కోట డెత్ మిస్టరీలోని అసలు నిజాలు , సియా గోయల్ దాస్తున్న రహస్యాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని లీగల్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















