Wife Killed Husband: భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్తో క్రైమ్ స్టోరీ లీక్!
Kakinada Murder Case: కాకినాడ జిల్లా సర్పవరంలో దారుణం. ఇన్ స్టాగ్రామ్ ప్రియుడి కోసం భర్తను ఖర్జూర జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపి చంపిన భార్య . కొత్త ప్రియుడి ఎంట్రీతో పాత ప్రియుడే కథ లీక్ చేశాడు.

Instagram Extra Marital Affair Crime: మంగళసూత్రం సాక్షిగా ఏడడుగులు నడిచిన ఆ ఇల్లాలు క్షణిక సుఖాల వ్యామోహంలో పడి పవిత్ర బంధాన్ని ఊపిరాడకుండా చేసి తెంచేసింది. గుండెజబ్బుతో బాధపడుతున్నాడన్న జాలి కూడా లేకుండా, కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. ఆపై గుండెపోటు మరణంగా కలరింగ్ ఇచ్చి కథ ముగిసిందనుకుంది. కానీ, దేవుడి స్క్రిప్ట్ మరోలా ఉంది. తనను వదిలేసి కొత్త ప్రియుడిని వెతుక్కుందన్న కోపంతో పాత ప్రియుడే ఎంట్రీ ఇచ్చి, లీక్ చేసిన ఒకే ఒక్క మెసేజ్తో ఈ మైండ్ బ్లోయింగ్ క్రైమ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా సర్పవరంలో జరిగిన ఈ ఘోరం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గుండెకు స్టెంట్లు వేయడంతో వీక్ అయిన దుర్గా ప్రసాద్
సర్పవరం సీఐ బి.ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ రూరల్ మండలం సర్పవరానికి చెందిన పుల్ల దుర్గాప్రసాద్ ఆటో నడుపుతూ భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాడు. అయితే రెండేళ్ల క్రితం దుర్గాప్రసాద్కు గుండెపోటు రావడంతో వైద్యులు స్టంట్లు వేశారు. అప్పటినుంచి ఆయన శారీరకంగా బలహీనపడి ఇంటికే పరిమితమయ్యాడు. భర్త అనారోగ్యంతో అచేతనంగా మారుతుండటంతో రమాదేవిలో శారీరక కోరికలు మితిమీరాయి. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ ద్వారా బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయితో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడితో కలిసి విజయవాడ, రామచంద్రపురం అంటూ ఆమె షికార్లు కొట్టడం మొదలుపెట్టింది.
భార్య ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన దుర్గా ప్రసాద్
భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన దుర్గాప్రసాద్ ఆమెను నిలదీశాడు. పద్ధతి మార్చుకోవాలని మందలించడమే ఆయన చేసిన పాపమైంది. తమ సుఖానికి అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని రమాదేవి, గోపిసాయి పక్కా ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం.. గోపిసాయి బాపట్ల నుంచి 15 నిద్రమాత్రలు తెచ్చి రమాదేవికి ఇచ్చాడు. మార్చి 13న ఉదయం భర్తకు ఎంతో ఇష్టమైన ఖర్జూర జ్యూస్లో ఆ మాత్రలన్నింటినీ కలిపి తాగించింది. కొద్దిసేపటికే దుర్గాప్రసాద్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. రమాదేవి ఏమాత్రం దయలేకుండా దిండుతో ఆయన ముఖంపై గట్టిగా అదిమి పట్టుకుని ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆపై భర్తకు గుండెపోటు వచ్చిందని నమ్మించి, ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియలు కూడా పూర్తి చేసేసింది.
ప్లాన్ ప్రకారం అంతా పూర్తి చేసి .. కొత్త ప్రియుడ్ని చూసుకున్న రమాదేవి
ఇక్కడితో కథ సుఖాంతం అయిందని రమాదేవి ఊపిరి పీల్చుకుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. భర్త చనిపోయి మూడు నెలలు కూడా గడవక ముందే రమాదేవి పాత ప్రియుడు గోపిసాయిని పక్కనబెట్టి, మరొక కొత్త ప్రియుడిని వెతుక్కుంది. ఈ డబుల్ క్రాస్ ను గోపిసాయి తట్టుకోలేకపోయాడు. కసి పెంచుకున్న అతను నేరుగా రమాదేవి కుమార్తె కు.. మీ అమ్మ జ్యూస్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి, ఊపిరాడకుండా చేసి మీ నాన్నను చంపేసింది అంటూ మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూసి షాకైన కుమార్తెలు బంధువుల సహాయంతో పోలీసులను ఆశ్రయించడంతో గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ హత్యోదంతం బయటపడింది.
పోలీసుల ట్రీట్ మెంట్ తో నేరం ఒప్పుకున్న రమాదేవీ
పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో నిందితురాలు రమాదేవి తన పాపాన్ని ఒప్పుకోక తప్పలేదు. పరారీలో ఉన్న ప్రియుడు గోపిసాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. క్షణిక సుఖం కోసం భర్తను చంపిన మహిళ, చివరకు కొత్త ప్రియుడి వ్యామోహంలో పాత ప్రియుడికి ద్రోహం చేయడం.. ఆ కక్షతోనే హత్య రహస్యం బట్టబయలు కావడం చూసి పోలీసులు సైతం ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఈ సైకో కిల్లర్ భార్య ఉదంతం కాకినాడ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
ట్రెండింగ్ వార్తలు






















