Daughter killed parents: ఇలాంటి కూతుళ్లు కూడా ఉంటారు - ఇంజెక్షన్తో తల్లిదండ్రుల హత్య - ఎందుకో తెలుసా?
Nurse killed parents:వికారాబాద్ జిల్లా బంత్వారంలో వెలుగుచూసిన ఈ విషాదకర ఘటన మానవ సంబంధాలలోని చీకటి కోణాన్ని ఆవిష్కరించింది. ఓ కూతురు తల్లిదండ్రుల్ని హత్య చేసింది.

Nurse Surekha who killed her parents with an injection: వికారాబాద్ జిల్లా బంత్వారం మండలం యాచారం గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే దారుణం వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడి, ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులను ఓ కన్నకూతురే అత్యంత కిరాతకంగా హతమార్చింది. తన ప్రేమ వివాహానికి అడ్డుపడుతున్నారనే కక్షతో, నవమాసాలు మోసిన తల్లి లక్ష్మి , అడిగిందల్లా ఇచ్చి పెంచిన తండ్రి దశరథం లను మత్తు ఇంజక్షన్ ఇచ్చి శాశ్వతంగా నిద్రపుచ్చింది. ప్రేమ మత్తులో పెంచిన ప్రేమను మర్చిపోయిన ఈ నర్సు ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్న సురేఖకు ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, అతడినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవకు దిగింది. అయితే, ఆమె ప్రేమ వ్యవహారం నచ్చని తల్లిదండ్రులు దానికి ససేమిరా అన్నారు. తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకుంటే ఒప్పుకోమని తెగేసి చెప్పారు. దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను అడ్డుతొలగించుకోవాలని సురేఖ ఒక భయంకరమైన స్కెచ్ వేసింది. తన వృత్తిని ఆయుధంగా మార్చుకుని, మృత్యువును సిరంజీలోకి ఎక్కించింది.
రెండ్రోజుల క్రితం రాత్రి సమయంలో, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న తల్లిదండ్రులకు నొప్పులు తగ్గుతాయి అని నమ్మబలికి కేటామైన్ వంటి అత్యంత శక్తివంతమైన హై-డోస్ మత్తుమందును ఇంజక్షన్ రూపంలో ఇచ్చింది. అది శరీరంలోకి చేరిన కొద్దిసేపటికే వారు స్పృహ కోల్పోయి మరణించారు. చంపిన తర్వాత కూడా ఏమీ తెలియనట్లుగా సురేఖ తన అన్న అశోక్కు ఫోన్ చేసి, అమ్మ, నాన్నలు పలకడం లేదు.. ఏదో అయిపోయింది అని ఏడుస్తూ నమ్మకమైన నాటకమాడింది. ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారంటూ అందరినీ నమ్మించాలని చూసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అయితే, ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడం, మృతదేహాలపై అనుమానాస్పద గుర్తులు ఉండటంతో వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో లోతుగా విచారణ చేపట్టారు. పోలీసులు సురేఖను విచారిస్తున్న సమయంలో ఆమె చెప్పిన సమాధానాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో పోలీసులకు అనుమానం బలపడింది. వారి స్టైల్లో విచారించగా, సురేఖ తన నేరాన్ని అంగీకరించింది. తన ప్రేమకు అడ్డుపడుతున్నందుకే ఇంజక్షన్ ఇచ్చి చంపినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.
ప్రస్తుతం పోలీసులు సురేఖను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘాతుకానికి ఆమెకు మరెవరైనా సహకరించారా? లేదా ఒక్కతే చేసిందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కని పెంచిన వారినే కాటికి పంపిన ఈ కిరాతక కూతురి పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ కోసం కన్నవారిని చంపిన ఆమెకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో యాచారం గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.























