Kukatpally girl murder case: కూకట్పల్లి బాలిక హత్య కేసులో ఎన్నో అనుమానాలు - తల్లిదండ్రులు చెబుతోంది నిజమేనా?
Twelve Year Old Girl Murder: కూకట్పల్లిలో పన్నెండేళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిజాలేంటో ఇంకా బయటకు రాలేదు. దొంగలపనై ఉంటుదని తల్లిదండ్రులు అంటున్నారు.

Brutal murder of twelve year old girl in Kukatpally: హైదరాబాద్ కూకట్ పల్లిలో పన్నెండేళ్ల వయసు ఉన్న సహస్ర అనే బాలికను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య ఘటన కలకలం రేపుతోంది. ఎవరు ఈ పని చేశారన్నదానిపై పోలీసులు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. చుట్టుపక్కల సీసీకెమెరాలను విశ్లేషిస్తున్నారు. అయితే బాలిక తల్లిదండ్రులు మాత్రం దొంగల పనై ఉంటుందని.. తన కుమారుడు ఇంట్లో ఉండి ఉంటే.. అతన్ని కూడా చంపేసి ఉండేవారని కన్నీరుమున్నీరవుతున్నారు.
మధ్యాహ్నం భోజనానికి తండ్రి వచ్చే సరికి కుమార్తె హత్య
కూకట్ పల్లిలో రేణుక, కృష్ణ అనే దంపతులు కొన్నాళ్లుగా నివసిస్తున్నారు. కృష్ణ మెకానిక్గా..రేణుక ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నారు. ఎప్పట్లాగానే వీరు తమ విధులకు వెళ్లారు. మధ్యాహ్నం తండ్రి భోజనం కోసం ఇంటికి వచ్చేసరికి కుమార్తె నెత్తురు మడుగులో పడి ఉంది. ఆయన బిగ్గరగా అరవడంతో స్థానికులు వచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ హత్య ఘటనపై పూర్తి స్థాయిలో క్లూస్ టీమ్ ను పిలిపించి ఆధారాలు సేకరించారు. స్కూల్ కు సెలవు కావడంతో సహస్ర ఇంట్లోనే ఉందని తల్లిదండ్రులు చెప్పారు. దొంగలు ఈ పని చేసి ఉండవచ్చని చెప్పారు.
లైంగిక దాడికి ప్రయత్నించడంతో అడ్డుకున్నదని చంపేశారా?
అయితే దొంగలు ఇలా చొరబడి కత్తులతో చంపి పారిపోరని.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. బాలికపై కన్నేసిన వారే.. లైంగిక దాడికి ప్రయత్నించి ఉంటారని.. ఆ బాలిక ఎదురు తిరిగే సరికి.. చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బాలికకు తెలిసిన వారే .. అంటే బంధువులే చేసి ఉంటారని..తాను బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా అందరికీ చెబుతారనే భయంతోనే ఆ వ్యక్తి దాడి చేసి ఉంటాడన్న కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య..పదకొండు గంటల నుంచి పన్నెండున్నర మధ్యలో జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
చుట్టుపక్కల వారితో గొడవలు - వారే చేశారా ?
సీసీ కెమెరాల్లో నమోదైన వారిలో.. వారి బంధువులు ఎవరు ఉన్నారు.. వారిని పిలిపించి ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టుతో పాటు క్లూస్ టీమ్..ఇతర ఆధారాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఎవరికీ ఆఫీసుల్లో కానీ.. ఇతర చోట్ల కానీ బంధువులతో కానీ వివాదాల్లేవని అంటున్నారు. అయితే ఇంటి చుట్టుపక్కలవారితో చిన్న చిన్న గొడవలు ఉన్నాయని అంటున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెద్దలతో గొడవలు ఉంటే.. పిల్లలను ఎందుకు హత్య చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. పోలీసులు ఈ కేసును చాలెంజింగ్గా తీసుకున్నారు.





















