కార్ మార్కెట్లో కీలక మలుపు: యూరోపియన్ కార్లపై దిగుమతి సుంకాలు 40 శాతానికి తగ్గించే యోచనలో భారత్!
EUతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో భాగంగా భారత్ దిగుమతి కార్లపై సుంకాలను 110 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలనుకుంటోంది. దీని ప్రభావం ఆటో మార్కెట్పై ఎలా ఉండబోతోంది?

Imported Cars India: భారత ఆటో మార్కెట్లో కీలక మార్పులకు దారి తీసే ఒక పెద్ద నిర్ణయం త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకోబోయే ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో (India EU Trade Deal) భాగంగా, దిగుమతి చేసుకునే కార్లపై ఉన్న భారీ సుంకాలను గణనీయంగా తగ్గించేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, కార్లపై 70 శాతం నుంచి 110 శాతం వరకు ఉన్న దిగుమతి పన్నులను, తొలి దశలోనే 40 శాతానికి తగ్గించే యోచనపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి అంగీకరించినట్లు చర్చల్లో భాగంగా ఉన్న వర్గాలు వెల్లడించాయి. యూరోపియన్ యూనియన్కు చెందిన 27 దేశాల నుంచి దిగుమతి అయ్యే, 15,000 యూరోల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై ఈ తగ్గింపు వర్తించే అవకాశం ఉంది. కాలక్రమేణా ఈ సుంకాలను 10 శాతం వరకు మరింత తగ్గించే దిశగా కూడా ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది.
‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా ప్రచారం
భారత్ - EU మధ్య సాగుతున్న ఈ వాణిజ్య చర్చలను ఇప్పటికే ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా వ్యవహరిస్తున్నారు. మంగళవారం నాటికి ఈ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒప్పందం అమల్లోకి వస్తే, భారత్ - EU మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరిగే అవకాశం ఉంది.
అమెరికా విధించిన అధిక సుంకాల కారణంగా దెబ్బతిన్న వస్త్రాలు, ఆభరణాలు వంటి భారత ఎగుమతులకు కూడా ఈ ఒప్పందం ఊరట కలిగించే అవకాశం ఉంది.
భారత ఆటో మార్కెట్ ఇప్పటివరకు ఎలా ఉంది?
అమ్మకాల పరంగా, భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతి పెద్ద కార్ల మార్కెట్. అయినా సరే, దేశీయ ఆటో పరిశ్రమపై ఇప్పటివరకు భారీ రక్షణ ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై అధిక పన్నులు విధించడం వల్ల యూరోపియన్ బ్రాండ్లు మన దేశంలో పెద్దగా విస్తరించలేకపోయాయి. టెస్లా CEO ఎలాన్ మస్క్ సహా పలువురు ఆటో దిగ్గజాలు గతంలో ఈ అధిక సుంకాలపై విమర్శలు చేశారు.
కొత్త ప్రతిపాదన ప్రకారం, ఏటా సుమారు 2 లక్షల ఇంజిన్ కార్లపై 40 శాతం సుంకం మాత్రమే విధించే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు భారత్ తీసుకున్న అత్యంత దూకుడైన నిర్ణయం అవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ కార్లకు మాత్రం మినహాయింపు
దేశీయ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా వంటి సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, మొదటి ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ కార్లను ఈ సుంకాల కోత నుంచి మినహాయించనున్నారు. ఐదేళ్ల తర్వాత EVలకూ ఇదే తరహా పన్ను తగ్గింపులు వర్తించే అవకాశం ఉంది.
ఎవరికి లాభం?
ఈ నిర్ణయంతో Volkswagen, Renault, Stellantis, అలాగే లగ్జరీ బ్రాండ్లు Mercedes-Benz, BMWకు పెద్ద ఊరట లభించనుంది. భారత్లో స్థానికంగా తయారీ ఉన్నప్పటికీ, అధిక దిగుమతి సుంకాల కారణంగా వీటి వృద్ధి పరిమితంగానే ఉంది.
సుంకాలు తగ్గితే, కార్ల ధరలు తగ్గే అవకాశం ఉండటంతో, ఈ కంపెనీలు కొత్త మోడళ్లను మన మార్కెట్లో పరీక్షించి, ఆపై స్థానిక తయారీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం, భారత కార్ల మార్కెట్లో యూరోపియన్ బ్రాండ్ల వాటా 4 శాతం కన్నా తక్కువే. అయితే 2030 నాటికి మార్కెట్ పరిమాణం 6 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో Renault భారత్లో కొత్త వ్యూహంతో తిరిగి పుంజుకుంటుండగా, Volkswagen గ్రూప్ కూడా స్కోడా ద్వారా తదుపరి పెట్టుబడులకు సిద్ధమవుతోంది.
మొత్తంగా చూస్తే, EUతో ఈ వాణిజ్య ఒప్పందం భారత ఆటో మార్కెట్ను కొత్త దిశలోకి తీసుకెళ్లే కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
























