ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
50 ఏళ్లుగా ఇథనాల్ మిశ్రమ ఇంధనం వాడుతున్న బ్రెజిల్ అనుభవం, భారత్లో E20 వాడుతున్న కార్లకు కీలక మార్గదర్శిగా మారింది. అసలు సమస్య ఇథనాలా, ఇంధన కాలుష్యమా?

E20 fuel India: భారత్లో E20 పెట్రోల్ వినియోగంపై వాహనదారుల్లో ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకడం లేదు. అయితే, ఒక్క విషయం మాత్రం రూఢీ అయింది - మైలేజీ తగ్గుతుందని. ఇది కాకుండా, ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం.. వాహనం ఇంజిన్కు దీర్ఘకాలంలో ఏమైనా నష్టం జరుగుతుందా అని. E20కి అనుకూలంగా లేని పాత కార్లు, బైక్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో అనేక సందేహాలు కనిపిస్తున్నాయి.
ఈ ప్రశ్నకు సమాధానం కోసం, దాదాపు 50 ఏళ్ల ఇథనాల్ అనుభవం ఉన్న బ్రెజిల్లోని పరిస్థితులను పరిశీలిద్దాం. ఆ దేశంలో, 1975లో చమురు సంక్షోభం సమయంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగం మొదలైంది. ప్రారంభంలోనే పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపారు. ఆ తర్వాత ఈ మిశ్రమం 25, 27 & 30 శాతానికి పెరిగింది. ప్రస్తుతం బ్రెజిల్లో E32 ఇంధనం కూడా అందుబాటులో ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బ్రెజిల్లో E20 వినియోగం మొదలైనప్పుడు, ఇప్పటి వాహనాలతో పోలిస్తే అప్పటి వాహనాలు చాలా మామూలు సాంకేతికతతో తయారయ్యాయి. ఫ్యూయల్ ఇంజెక్షన్, ఆధునిక సెన్సర్లు, క్లోజ్డ్ లూప్ నియంత్రణ వంటి సదుపాయాలు కూడా లేవు. అయినా E20 వల్ల పెద్ద ఎత్తున ఇంజిన్ సమస్యలు నమోదైనట్లు బ్రెజిల్ ఆటో ఎక్స్పర్ట్లు చెప్పడం లేదు. అప్పట్లో కనిపించిన సమస్యల్లో ఎక్కువ భాగం ఇంధన వ్యవస్థలో ఉపయోగించిన రబ్బరు, గ్యాస్కెట్లు & ఇతర విడిభాగాలకు సంబంధించినవే. మరోవైపు, స్వచ్ఛమైన ఇథనాల్ (E100)తో నడిచే వాహనాల్లో కార్బ్యురేటర్ తుప్పు, ఇంధన గొట్టాలు పాడవడం, చిన్న రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించాయి.
ఇది కూడా చదవండి: రోజూ కాలేజీ, ఆఫీస్కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇవే
ఈ విషయాన్ని నేరుగా భారత్కు వర్తింపజేయలేమని వాహన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 1970ల బ్రెజిల్ పరిస్థితులు, నేటి భారత్ పరిస్థితులు ఒకేలా లేవు. అయినప్పటికీ, బ్రెజిల్ అనుభవం ఒక ముఖ్యమైన విషయం చెబుతోంది. E20 వల్ల తక్షణం భారీ స్థాయిలో ఇంజిన్ నష్టం జరుగుతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు.
మన దేశంలో, E10 వాహనాల్లో E20 ఇథనాల్ను ఉపయోగిస్తున్నప్పటికీ వెంటనే భయపడాల్సిన అవసరం లేదని బ్రెజిల్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. దీర్ఘకాలంలో పాత రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు, ఓ రింగులు పాడయ్యే అవకాశం ఉందని మాత్రం వెల్లడించారు. ఇలాంటి సందర్భాల్లో, ఖరీదైన ఇంజిన్ భాగాల కంటే చిన్న భాగాల జీవితకాలం తగ్గే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు.
మరో ముఖ్యమైన అంశం - ఇంజిన్ క్యాలిబ్రేషన్. E20లో లీటరుకు లభించే శక్తి పెట్రోల్ కంటే తక్కువ. అందువల్ల సరైన మిశ్రమం కోసం ఇంజిన్ మరింత ఇంధనాన్ని పంపాలి. పాత వాహనంలో ఇంజెక్టర్ లేదా ఇంధన నియంత్రణ వ్యవస్థకు సరిపడా సర్దుబాటు అవకాశం లేకపోతే సమస్య రావచ్చు. అప్పుడు 'చెక్ ఇంజిన్' లైట్ వెలిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
బ్రెజిల్ అనుభవంలో అసలైన హెచ్చరిక ఇథనాల్ మిశ్రమం కాదు, ఇంధన నాణ్యత. ఇంధనంలో క్లోరైడ్ వంటివి కలిస్తే.. అవి ఫ్యూయల్ పంప్, ఇంజెక్టర్లు & వాల్వ్లకు నష్టం కలిగించవచ్చు. బ్రెజిల్లో, ఇంధనంలోని క్లోరైడ్కు కఠినమైన రూల్స్ ఉన్నాయి.
భారత్లో కూడా E20పై చర్చ కేవలం ఇథనాల్ శాతానికే పరిమితం కాకూడదు. వినియోగిస్తున్న ఇంధనం అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉందా, అందులో ఇంకేవైనా కలిశాయా? అనే అంశాలు కూడా ముఖ్యమైనవి. అందుకే బ్రెజిల్ 50 ఏళ్ల అనుభవాన్ని బట్టి... E20ని చూసి భయపడటం కంటే ఇంధన నాణ్యత, వాహన నిర్వహణ & అవసరమైన భాగాల పరిస్థితిపై దృష్టి పెట్టడం ముఖ్యం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















