Python in Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో భారీ కొండచిలువ ప్రత్యక్షంతో కలకలం!
Tirumala Ghat Road: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో దాదాపు 10 అడుగుల కొండ చిలువ హల్ చల్ చేసింది.

Python Found in Tirumala Ghat Road:
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో దాదాపు 10 అడుగుల కొండ చిలువ హల్ చల్ చేసింది. మొదటి ఘాట్ రోడ్డులో ఏడోవ మైలు సమీపంలో అటవీ ప్రాంతం నుంచి భారీ కొండ చిలువ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. భారీ కొండ చిలువ రోడ్డు ఒకవైపు నుండి మరొక వైపునకు వెళ్ళేందుకు ప్రయత్నించిన సమయంలో వాహనాల లైట్ వెలుగు రావడంతో కొంత సేపు పాటు కొండచిలువ ఘాట్ రోడ్డుపైనే నిలిచి పోయింది. ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు ఒక్కసారిగా భారీ కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. కొంతసేపు పాటు కొండ చిలువ రోడ్డుపై ఉండి ఆ తర్వాత తిరిగి అటవీ ప్రాంతంలోనికి వెళ్లిపోయింది. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువ ఘాట్ రోడ్డుపై నిలిచిన సమయంలో కొందరు ఫొటోలు, వీడియోలు తీశారు. అటవీ శాఖ అధికారులకు సైతం కొండచిలువ గురించి సమాచారం అందించారు.
తిరుమల నడకదారిలో మళ్లీ పులి, ఎలుగు కలకలం
తిరుమలకు వెళ్లే భక్తులకు గత కొన్ని నెలలుగా వన్య మృగాల భయం పట్టుకుంది. తిరుమలలో, ఘాట్ రోడ్డులో గత నెల చివరివారం మళ్లీ చిరుత పులి, ఎలుగు బంటి కనిపించాయి. దాంతో చిరుత, ఎలుగు నుంచి ప్రజలకు ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం సైతం తిరుమలకు అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. నడక మార్గం చుట్టుపక్కల పులి లేదా ఇతర క్రూర జంతువుల సంచారం ఉందేమో తెలుసుకొనేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో తాజాగా దృశ్యాలు నమోదయ్యాయి. ఓ పులి, మరో ఎలుగుబంటి తిరుగుతున్న ఫోటోలు ఆ ట్రాప్ కెమెరాల్లో నమోదు అయ్యాయి.
కొన్ని నెలల కిందట ఓ బాలుడు, మరో బాలికపై పులి జరిపిన దాడి ఘటనల నేపథ్యంలో టీటీడీ జాగ్రత్తలు చేపట్టడం తెలిసిందే. తిరుమల ఘాట్ రోడ్డుతో పాటు అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులు తగ్గిపోవడంతో వారిలో భయం పోగొట్టేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తులకు చేతి కర్రలు ఇవ్వడం ప్రారంభించారు. కొన్నాళ్లుగా నడక మార్గంలో పులి సంచారం లేకపోవడంతో ఆ భయం కాస్త తగ్గింది. తాజాగా పులి, ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు కనిపించడంతో మరోసారి భక్తుల్ని టీటీడీ అప్రమత్తం చేసింది.
నడకదారి భక్తులకు విజ్ఞప్తి. తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో అక్టోబర్ 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో ఒక చిరుత, ఒక ఎలుగుబంటి తిరుగుతున్నట్టుగా కెమెరా ట్రాప్ లో నమోదయింది. కావున నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు గుంపులు గుంపులుగానే వెళ్లాలని విజ్ఞప్తి చేయడమైనది’’ అని తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని రోజుల కిందట ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read: శ్రీవారి భక్తులకు అలెర్ట్- నవంబరు 10న ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు
Before You Go
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
ట్రెండింగ్ వార్తలు






















