AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. పిచ్చుకలపాలెం వద్ద అత్యాధునిక ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
సుమారు 165 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ అకాడమీని నిర్మిస్తున్నారు. మొత్తం 2.05 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ భవన సముదాయం, న్యాయాధికారులకు అత్యున్నత స్థాయి శిక్షణ అందించే కేంద్రంగా నిలవనుంది. ఒకేసారి 120 మంది ట్రైనీ జడ్జిలకు శిక్షణ ఇచ్చేలా ఈ అకాడమీని శాస్త్రీయంగా రూపొందించారు.

ఈ అకాడమీలో 500 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన అత్యాధునిక ఆడిటోరియంతో పాటు, శిక్షణ పొందే వారి కోసం గ్రౌండ్ ప్లస్ 8 (G+8) అంతస్తులతో కూడిన భారీ హాస్టల్ బ్లాక్ను నిర్మిస్తున్నారు. వీటితో పాటు, అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తుల కోసం 69.4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ప్రత్యేక అతిథిగృహానికి కూడా జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు.
న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. మధ్యవర్తిత్వం వల్ల అనేక కేసులు సులువుగా పరిష్కారం అవుతాయని.. ప్రతి సమస్యకు కోర్టుకు రావడమే పరిష్కారం కాదన్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు బాగా పెరుగుతున్నాయని సీజేఐ అన్నారు. అమరావతిలో నిర్వహించిన మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం వల్ల కేసులు వేగంగా పరిష్కారం అవుతాయని, అయితే న్యాయం జరుగుతుందని ఇరుపక్షాలు నమ్మాలి. న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకంతో ప్రజలు కోర్టులకు వస్తున్నారు. కానీ చాలా కేసుల్లో మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులకు రాకుండా సమస్యలు పరిష్కారం అవుతాయి. మధ్యవర్తిత్వం ద్వారా పలు దేశాల్లో కేసులు పరిష్కారం చేసుకుంటున్నారు. మనదేశంలోనూ మధ్యవర్తిత్వం వైపు మొగ్గుచూపితే సుదీర్ఘకాలం కోర్టుల చుట్టూ తిరిగే అవసరం ఉండదని, అదే సమయంలో ఇరుపక్షాలకు న్యాయం జరుగుతుందని’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.

హైకోర్టు జడ్జీల నివాస గృహ సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ప్రారంభించారు. సి.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో రూ.210 కోట్ల వ్యయంతో 33.20 ఎకరాల విస్తీర్ణంలో 36 మంది హైకోర్టు న్యాయమూర్తుల కోసం నివాస గృహాలను నిర్మించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో 13 బంగాళాలను నిర్మించేందుకు స్థలాన్ని కూడా కేటాయించారు.
ప్రతి నివాస గృహాన్ని 7,841 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ నమూనాలో.. న్యాయమూర్తుల అవసరాలకు అనుగుణంగా ఆఫీసు గది, వెయిటింగ్ హాల్ తదితర వసతులతో ఈ గృహాలను సమగ్రంగా రూపొందించారు. బి.ఎస్.ఆర్. ఇన్ఫ్రాటెక్ సంస్థ నిర్మాణం చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నివాస సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని జస్టిస్ సూర్యకాంత్ ఆవిష్కరించారు. అనంతరం జడ్జిల బంగ్లాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎస్.వి.ఎస్. భట్టి, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఏపీ సీఎస్ సాయి ప్రసాద్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శ్యామల రావు, సురేష్ కుమార్, CRDA కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్.పి. వకుల్ జిందాల్ పాల్గొన్నారు. అనంతరం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, సీఎం చంద్రబాబు, ఇతర న్యాయమూర్తులతో కలిసి ఒక నివాస గృహాన్ని సందర్శించారు.
























