TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
BR Naidu | మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించి క్లారిటీ ఇచ్చారు. మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని, లీగల్ ఫైట్ చేస్తానన్నారు.

తిరుపతి: తన మీద వ్యక్తిగతంగా నీచాతినీచమైన ఆరోపణలు చేస్తున్నారని, అందుకే హైదరాబాద్ వెళ్లాల్సిన వ్యక్తిని తిరుపతి వేదిక నుంచే మాట్లాడుతున్నానని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు వైరల్ అయిన వీడియోలో కొన్నిచోట్ల మార్ఫింగ్ చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అలాంటి ఫేక్ వీడియోలకు భయపడే రకాన్ని కాదని స్పష్టం చేశారు. దశాబ్దాల నుంచి తమ కుటుంబాల మధ్య పరిచయాలు, స్నేహం ఉందని.. మార్ఫింగ్ చేసి వీడియోలు వైరల్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తిరుమల కల్తీ నెయ్యిపై వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వస్తుందని వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు.
చంద్రబాబు చెబితే క్షణాల్లో రాజీనామా
తిరుపతిలో బీఆర్ నాయుడు ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ‘టీటీడీ ఛైర్మన్గా నేను బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే నన్ను రిజైన్ చేయమంటున్నారు. ఒక్కరోజు, వారం, నెల కూడా గడువు ఇవ్వలేదు. నీ అబ్బ సొత్తా ఇది. నువ్వు చెబితే రిజైన్ చేయాలా. సీఎం చంద్రబాబు నమ్మకంతో బాధ్యత అప్పగించారు. ఆయన చెబితే క్షణాల్లో రాజీనామా చేస్తాను. ఎన్నో అవకాశాలు వచ్చినా సంస్కరణలు తీసుకురావాలని టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టాను. కానీ నామీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని గమనిస్తే ఆ వ్యక్తి (భూమన కరుణాకర్ రెడ్డి) ఎన్నో దారుణాలు, అవినీతి చేశారు. వేల టికెట్లు అమ్ముకున్న రికార్డు చైర్మన్ ఆఫీసులో వదిలి వెళ్లారు. ఒక్కొక్క విషయం ఇప్పుడు బయటపడుతున్నాయి.
టీటీడీ మాజీ ఛైర్మన్ల అవినీతి, స్కాములు బయటపెడదామని చెప్పగా దేవుడి విషయంలో రాజకీయాలు వద్దని సీఎం చంద్రబాబు సూచించారు. వాళ్ల లాగ మనం ఉండకూడదు అన్నారని మౌనంగా ఉన్నాను. సోషల్ మీడియాలో ఏం వీడియోలు పోస్ట్ చేస్తున్నారండీ. ఆ మహిళ కుటుంబంతో 30 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. మా ఇంటికి వాళ్లు, వాళ్ల ఇంటికి మేం వచ్చి వెళ్తుంటాం. ఈ గాడిదలకు వీడియో మార్ఫింగ్, ఎడిటింగ్ కూడా సరిగా చేయడం రాలేదు. చీప్ పాలిటిక్స్ చేసి బురద జల్లితే భయపడి టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. ఎఫ్ఐఆర్ వస్తే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి.
సతీసమేతంగా రాలేదని ప్రశ్నించడం తప్పా..
సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీసమేంగా తిరుమలకు రాలేదు. భారతీరెడ్డితో కలిసి జగన్ వచ్చి పట్టువస్త్రాలు సమర్పిస్తే నేను ఎందుకు ప్రశ్నిస్తాను. గతంలో వైఎస్సార్ కూడా రాలేదు. ఈ విషయాలు ప్రశ్నించినందుకు నాపై కక్ష కట్టారు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా ఉంటే నా ఆటలు సాగవని వాళ్లు భావించి దుష్ప్రచారం చేశారు. ఈ వీడియోలపై నా కుటుంబసభ్యులు గానీ, లేక మహిళగానీ, ఆమె కుటుంబసభ్యులుగానీ ఫిర్యాదు చేయాలి. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. 20, 25 ఏళ్ల కింద నేను దిగిన ఫొటోలకు మ్యూజిక్ పెట్టి వీడియో చేసి దుష్ప్రచారం చేస్తున్నారు.
లీగల్గా ఫైట్ చేయడానికి రెడీ..
నేను మీడియా అధిపతిగా చేసిన అనుభవం ఉంది. భూమనకు, వైవీ సుబ్బారెడ్డికి చుక్కలు చూపిస్తాను. నువ్వు, సుబ్బారెడ్డి మద్రాసులో ఏం చేశారో బయటపెట్టాలా?. హైదరాబాద్ నడిబొడ్డున ఉండి వ్యాపారం చేస్తున్నాను. ఏ ఫైల్ తీసుకున్నా వాళ్లు చేసిన అవినీతి, దుర్మార్గాలు బయట పడుతున్నాయి. కానీ సీఎం చంద్రబాబు సూచన మేరకు ఏ విషయాలపై మాట్లాడలేదు. నాపై జరిగిన దుష్ప్రచారంపై లీగల్గా ఫైట్ చేస్తాను. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వస్తుందని భయపడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెండు దశాబ్దాల కిందట ఫొటోలను మార్ఫింగ్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తే భయపడే వ్యక్తిని కాదు.
మహిళతో వల్గర్గా బిహేవ్ చేయలేదు..
అటువైపు జగన్ దొంగ అని ప్రపంచానికి తెలుసు. వేలు, లక్షల కోట్లు తిన్నాడని అందరికీ తెలుసు. నిస్వార్ధంగా టీటీడీ కోసం పనిచేస్తున్నాను. నా వల్ల ఒక్క రీమార్క్ కూడా రాలేదు. నా బిజినెస్ నాకున్నా టీటీడీలో సంస్కరణల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. 50 కోట్లు పెట్టి కోటి భగవద్గీత పుస్తకాలు ప్రింట్ చేసి మూలన పడేశారు. ఆ పుస్తకాలు చూస్తే అందులో ఏం విషయాలు లేవని ముఖాన ఉమ్మేస్తారు. మహిళతో వల్గర్గా బిహేవ్ చేయలేదు. అందులో ఏం తప్పు కనిపించింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికి రావడం, వెళ్లడం జరుగుతుంటాయి. వీఐపీ కల్చర్ ను పక్కనపెట్టి సామాన్య భక్తులకు సౌకర్యాలపై ఫోకస్ చేస్తున్నాం. పద్ధతిగా సంసారం చేస్తున్న మహిళల్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఆ మహిళ సైతం హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకుంటారని’ బీఆర్ నాయుడు అన్నారు.
























