Paritala Sunitha: తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వాడివి లింగమయ్య కుటుంబానికేం చేస్తావ్ - జగన్ కు పరిటాల సునీత ప్రశ్న
TDP Vs YSRCP: రాప్తాడులో జగన్ చేసిన ఆరోపణలపై పరిటాల సునీత మండిపడ్డారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వాడివి లింగమయ్య కుటుంబానికేం చేస్తావని ప్రశ్నించారు.

Paritala Sunitha: రాప్తాడులో ఘర్షణలో చనిపోయిన లింగమయ్య అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్ చేసిన విమర్శలపై పరిటాల సునీత మండిపడ్డారు. మీ చిన్నాన్నని చంపితే న్యాయం చేయమని మీ చెల్లలు అడిగింది..చెల్లలుకు న్యాయం చేయలేని నువ్వు ఇక్కడికొచ్చి ఏం చేస్తావని సునీత ప్రశ్నించారు. తల్లి, చెల్లెళ్లకు న్యాయం చేయలేని నువ్వు లింగమయ్య కుటుంబానికి ఏం న్యాయం చేస్తావని మండిపడ్డారు.
చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటాడా ?
జగన్ పరామర్శకు వచ్చాడా.. ఎన్నికల ప్రచారానికి వచ్చాడా అని పరిటాల సునీత ప్రశ్నించారు. చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటున్నాని.. నీ చుట్టూ ఉన్న వాళ్లు ఆ కుటుంబాన్ని చూసి నవ్వుతున్నారన్నారు. నువ్వు నవ్వుతున్నావో.. ఏడుస్తున్నావో అర్థం కావడం లేదు.. మేము అనుకుని ఉంటే జగన్ ఇక్కడ అడుగు కూడా పెట్టలేడన్నారు. తనను, తన కుమారున్ని టార్గెట్ చేయడానికే జగన్ వచ్చాడని మండిపడ్డారు. ఆ రోజు పులివెందులకు వెళ్తే పరిటాల రవిని అడ్డుకున్నావు.. ఈ రోజు మళ్లీ నన్ను, నా కొడుకుని టార్గెట్ చేశాడని మండిపడ్డారు.
పరీక్షల్లో కాపీ కొట్టినట్లుగా పేపర్లు చూసి చదువుతున్నాడు !
జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలేనని పరిటాల సునీత స్పష్టం చేశారు. ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్ర్కిప్టు జగన్ చదువుతున్నాడని.. పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా పేపర్లు చూసి చదువుతున్నాడని ఎద్దేవా చేశారు. పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా ఒక సంఘటన జరిగిందన్నారు. కానీ దాన్ని కొడవండ్లు, మారుణాయుధాలు అంటున్నాడని.. అలాంటివి పులివెందులలోని బాత్ రూముల్లో చంపేందుకు ఉపయోగిస్తారన్నారు. గ్రామాల్లోకి వచ్చి చిచ్చు పెట్టాలని జగన్ చూస్తున్నాడు.. మీ చిన్నాన్నని చంపితే న్యాయం చేయమని మీ చెల్లలు అడిగితే ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు.
పోలీసుల గురించి నీచంగా మాట్లాడతావా ?
మాజీ సీఎం గా ఉండి ఎస్ఐ గురించి నీచంగా మాట్లాడుతున్నారని.. పోలీసులను గుడ్డలూడదీస్తానని చెబుతున్నారని.. ఈ అంశంపై జిల్లా ఎస్పీతో పాటు పోలీసులు ఇప్పటికైనా స్పందించాలని సునీత డిమాండ్ చేశారు. పోలీసులు నీకు ఈ రోజు రెడ్ కార్పెట్ వేశారరన్నారు. ఎస్ఐ మాకు ఫోన్ చేయించాడని బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ చేశారు. మేము భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతామన్నారు. జగన్ పర్యటనను పోలీసులు, మా వాళ్లు ఎక్కడా అడ్డుకోలేదని.. జగన్ చేసిన వ్యాఖ్యల మీద కచ్చితంగా పోలీసులు స్పందించాలన్నారు. ఎంపీపీ ఎన్నికను గెలుచుకోలేక తోపుదుర్తి జీరో అయ్యాడు..ఆ జీరో మాటలు విని ఇంత దూరం జగన్ వచ్చాడని విమర్శలు గుప్పించారు.
పాపిరెడ్డిపల్లె అనే గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి చనిపోవడంతో జగన్ పరామర్శకు వచ్చారు. ఎంపీపీ ఎన్నిక వివాదంతో ఇది జరగడంతో రాజకీయ గొడవలేనని ఆయన ఆరోపిస్తున్నారు.





















